• facebook
  • whatsapp
  • telegram

బాకీల పారుదల!

‘బ్యాడ్‌ బ్యాంక్‌’పై ఆశలు

బ్యాంకుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు- నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌) సమస్యకు మరో పరిష్కారాన్ని కనుగొనే దిశలో 2021-22 కేంద్రబడ్జెట్‌లో ముందడుగు పడింది. బ్యాంకుల పారుబాకీలను తగ్గించి వాటి రుణవితరణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ ప్రతిపాదన చేశారు. ఆర్థిక రంగ సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లేవిధంగా ఐడీబీఐ బ్యాంకుతోపాటు రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించేందుకు ఆర్థికమంత్రి పచ్చజెండా ఊపారు. బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుతం ఉన్న 49శాతం నుంచి 74శాతానికి పెంచి సంస్కరణల అమలును వేగవంతం చేశారు.

రెట్టింపు కానున్న ఎన్‌పీఏలు

కొన్నేళ్లుగా దేశ బ్యాంకింగ్‌ రంగం పారుబాకీల సమస్యతో అతలాకుతలమవుతోంది. 2018 మార్చినాటికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 11.2శాతం ఉండగా 2019 మార్చినాటికి అవి స్వల్పంగా తగ్గి 9.3శాతానికి చేరాయి. 2020 మార్చికి మరింత తగ్గి 8.5శాతానికి చేరాయి. అయితే రిజర్వు బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక- బ్యాంకింగ్‌ రంగ నిరర్థక ఆస్తులు రానున్న రోజుల్లో భారీగా పెరిగే ప్రమాదాన్ని సూచించింది. సెప్టెంబరు 2021 నాటికి అవి 13.5శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారితే పారుబాకీలు 14.8శాతానికీ చేరే అవకాశముందని వెల్లడించింది. బ్యాంకులు 2020 ఆగస్టు 31 వరకు ప్రకటించని నిరర్థక ఆస్తులను తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు పారుబాకీలుగా ప్రకటించవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో- ప్రతిష్టంభన నెలకొంది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడేదాకా పారుబాకీలు ఏ మేరకు పెరిగాయన్నది వెల్లడి కాదు. ఈ పరిణామాలతో బ్యాంకుల్లో పారుబాకీల వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కష్టతరంగా మారింది. కొన్ని అంచనాల ప్రకారం బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 2021 సెప్టెంబరు నాటికి రూ.15లక్షల కోట్లు దాటుతాయి. అంటే 2020 మార్చినాటికి ఉన్న నిరర్థక ఆస్తులకంటే దాదాపు రెట్టింపన్నమాట!

బ్యాంకుల పారుబాకీల సమస్యకు పరిష్కార మార్గం చూపే దిశగా- కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ యోచన ఈనాటిది కాదు. గతంలోనూ బ్యాడ్‌ బ్యాంకుపై చర్చ జరిగింది. పేర్లు వేరైనా లక్ష్యం ఒక్కటే. బ్యాంకుల పారుబాకీల భారాన్ని తగ్గించేందుకు 2016-17 ఆర్థికసర్వే- ప్రభుత్వరంగ అసెట్‌ రీహ్యాబిలిటేషన్‌ ఏజెన్సీని స్థాపించాలని సూచించింది. అప్పటినుంచి ‘బ్యాడ్‌ బ్యాంక్‌’పై అడపాదడపా చర్చ జరిగింది. బ్యాడ్‌ బ్యాంకును ఏఆర్‌సీ (అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ), ఏఎంసీ (అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ), ఏఐఎఫ్‌ (ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) రూపంలో స్థాపించవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో సునీల్‌ మెహతా కమిటీ పలు సిఫార్సులు చేసింది. నిజానికి నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2002లోనే తొలి ఏఆర్‌సీని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐల సారథ్యంలో స్థాపించింది. రెండు బ్యాంకుల పారుబాకీలను స్వాధీనం చేసుకునేందుకు పలు ఏఆర్‌సీలు రంగప్రవేశం చేశాయి. ప్రస్తుతం దేశంలో 24దాకా ప్రైవేటు ఏఆర్‌సీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే వీటివల్ల బ్యాంకుల పారుబాకీలు ఆశించిన స్థాయిలో తగ్గలేదు. ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంకును ప్రభుత్వరంగంలోనైనా, ప్రైవేటు రంగంలోనైనా లేదా పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) పద్ధతిలోనైనా స్థాపించవచ్చు. ఒకసారి ఏఆర్‌సీ లేదా ఏఎంసీ రూపంలో బ్యాడ్‌ బ్యాంకును స్థాపించిన తరవాత- బ్యాంకులు, ఎంపికచేసిన పెద్ద పారుబాకీల ఖాతాలను ఆ బ్యాంకుకు బదిలీ చేస్తాయి. ఆ మేరకు బ్యాంకుల పారుబాకీలు తగ్గిపోయి, లాభదాయకత పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకులకు పారుబాకీల బెడద తగ్గి కొత్తరుణాలపై దృష్టిసారించే వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా పీఎస్‌బీలకు మూలధనాన్ని సమకూర్చే విషయంలో ప్రభుత్వానికి కొంత భారం తగ్గనుంది. బ్యాంకుల పారుబాకీల సమస్య ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ స్థాపనతో సమసిపోతుందనుకోవడం సరికాదు. బ్యాడ్‌బ్యాంక్‌ వల్ల గతంలో పోగుపడ్డ నిరర్థక ఆస్తులు తగ్గుతాయే తప్ప- భవిష్యత్తులో కొత్తగా పారుబాకీలు చేరకుండా అడ్డుకోవడం సాధ్యంకాదు.

విఫల ప్రయోగం కారాదు...

పారుబాకీలను బ్యాడ్‌ బ్యాంకుకు బదిలీ చేసే క్రమంలో బ్యాంకులు కొన్ని కష్టనష్టాలను భరించాల్సి ఉంటుంది. నిరర్థక ఆస్తుల విలువలో కొంతభాగాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ సమర్థŸంగా పనిచేసి, సత్వర నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. లేకుంటే గతంలో మాదిరి పారుబాకీల పరిష్కారం ఎండమావిగానే మిగిలిపోయి ‘బ్యాడ్‌బ్యాంకు’ మరో విఫలప్రయోగంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా భవిష్యత్తులో బ్యాంకుల పారుబాకీలు భారీగా పెరగకుండా పరిమిత స్థాయిలో (4-5శాతం మధ్య) ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు వాటి రుణ వితరణ, రుణ వసూళ్ల విధానాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల పారుబాకీలు పెరగకుండా రిజర్వు బ్యాంక్‌ మరిన్ని విధానపరమైన చర్యలు చేపట్టాలి. ఏదిఏమైనా బ్యాంకుల పారుబాకీలపై ముప్పేటదాడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంకుల పారుబాకీలను తగ్గించే దిశలో ఇప్పటికే సెక్యూరిటైజేషన్‌(సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంటరెస్ట్‌) చట్టం, దివాలాస్మృతి (ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌) అమలులో ఉన్నాయి. వీటికి తోడుగా బ్యాడ్‌ బ్యాంకు స్థాపన పారుబాకీల తీవ్రతను తగ్గించేందుకు దోహదపడనుంది.


 

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని