• facebook
  • whatsapp
  • telegram

గ్రామాలే దేశార్థికానికి దన్ను

సవాళ్లకు ‘సెస్సు’తో సమాధానం?

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఆర్థికాభివృద్ధి రేటును, ఉపాధి అవకాశాలను పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు. మొదటిది- పారదర్శకత. నిరుటి బడ్జెట్లో పేర్కొనకుండా  భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కోసం తీసుకున్న రుణాల వంటివి సైతం కొత్త బడ్జెట్లో కలిపి చూపారు. దీనివల్ల ద్రవ్య లోటును స్పష్టంగా అంచనా వేయడం  సాధ్యపడింది. ఈ ఏడాది ద్రవ్య లోటు     9.5శాతంగా, వచ్చే ఏడాది 6.8శాతంగా ఉంటుందని లెక్కగట్టారు. రెండో అంశం- ప్రభుత్వ వాటాల విక్రయం, బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు, బ్యాంకు పారుబాకీల వసూలుకు ప్రత్యేక సంస్థ ఏర్పాటుతో ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్ళడం. మూడు- కొత్త బడ్జెట్లో మౌలిక వసతుల వృద్ధికి, మూల ధన వ్యయం పెంపుదలకు ప్రాధాన్యమివ్వడం. గడచిన బడ్జెట్లో రూ.4.1లక్షల కోట్లుగా ఉన్న మూల ధన వ్యయాన్ని కొత్త బడ్జెట్లో 35శాతం పెంచి రూ.5.5 లక్షల కోట్లకు తీసుకెళుతున్నారు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు మూల ధన వ్యయంగా రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. పెట్టుబడుల పెంపునకు ప్రత్యేక సంస్థను ఏర్పరచారు. ఆరోగ్యం, మౌలిక వసతుల వృద్ధికి తమ బడ్జెట్‌ అత్యంత ప్రాధాన్యమిస్తోందని నిర్మలా సీతారామన్‌ వివరించారు.  నాలుగు- ఈ బడ్జెట్లో కొత్తగా పన్నులు విధించకపోవడం కీలకాంశం. మార్కెట్‌ రుణాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరిస్తారు.

మౌలిక వసతులపై దృష్టి

వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల వృద్ధికి బడ్జెట్లో విశేష ప్రాముఖ్యమిచ్చామని ఆర్థిక మంత్రి వివరించారు. కొవిడ్‌ లాక్‌డౌన్ల వల్ల వ్యవసాయేతర రంగాలు దెబ్బతినగా వ్యవసాయాభివృద్ధి రేటు మాత్రం 2020-21లో 3.4శాతంగా ఉంటుందని అంచనా. వ్యవసాయాదాయాలు, గ్రామీణ ఆదాయాలు ఏమాత్రం పెరగలేదు. నిరుటి బడ్జెట్‌ కన్నా కొత్త బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు కేవలం రెండు శాతం పెరిగాయి. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారు. తాజా బడ్జెట్లో గణనీయ అంశమేమంటే- వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) విధించడం. ఈ సెస్సును వ్యవసాయ    దిగుబడులు, ఆహార శుద్ధి సామర్థ్యాన్ని పెంచడానికి వెచ్చిస్తారు.

బడ్జెట్లో అనేక వస్తువులపై మౌలిక కస్టమ్స్‌ సుంకం (బీసీడీ) తగ్గించడం వల్ల ఏర్పడే ఆదాయ లోటును బంగారం, వెండిపై 2.5 శాతం, సెనగలపై 50శాతం మేరకు సాంఘిక సంక్షేమ సెస్సు విధించడం ద్వారా భర్తీచేయదలిచారు. లీటరు పెట్రోలు మీద రూ.2.50 చొప్పున, డీజిల్‌ మీద నాలుగు రూపాయల చొప్పున ఏఐడీసీ (వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి సెస్సు) విధించారు. అదే సమయంలో మౌలిక   ఎక్సయిజు సుంకం (బీఇడీ), ప్రత్యేక అదనపు ఎక్సయిజు సుంకం తగ్గించి వినియోగదారుపై అదనపు భారం పడకుండా చూశారు.

వినియోగదారులపై కొత్తగా భారాలు పడకపోయినా ఏఐడీసీ విషయంలో ఆందోళనకర అంశాలు ఉన్నాయి. సెస్సు వల్ల వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోనక్కర్లేదనేది అన్నింటికన్నా ఆందోళనకర అంశం. అంటే రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సూచించిన విధంగా పన్నుల ఆదాయంలో న్యాయమైన వాటా లభించదు. ఇంతకుముందు కస్టమ్స్‌ సుంకాల ద్వారా వచ్చే ఆదాయం విభాజ్య నిధిలో జమ అయ్యి, అక్కడి నుంచి కేంద్రం, రాష్ట్రాలు నిర్ణీత నిష్పత్తిలో పంచుకునేవి. ఇక నుంచి ఏఐడీసీ వసూళ్లు పూర్తిగా కేంద్ర ఖాతాకు చేరిపోయి, మౌలిక కస్టమ్స్‌ సుంకం (బీసీడీ) వసూళ్లలో వాటాలు మాత్రమే రాష్ట్రాలకు అందుతాయి. కానీ, బీసీడీ గతంకన్నా తగ్గిపోయినందువల్ల రాష్ట్రాలకు జమ అయ్యే మొత్తాలూ తరిగిపోతాయి. ఉదాహరణకు బడ్జెట్‌కు ముందు ఒక వస్తువుపై విధించే సుంకంలో బీసీడీ    95శాతంగా, సెస్సు అయిదు శాతంగా ఉండేది. దీనివల్ల అయిదు శాతం సెస్సు మాత్రమే కేంద్రానికి చేరి, మిగతా 95 శాతం బీసీడీని కేంద్రం, రాష్ట్రాలు పంచుకునేవి. తీరా ఇప్పుడు బీసీడీని 93శాతానికి తగ్గించి, సెస్సును ఏడు శాతానికి పెంచితే రాష్ట్రాల వాటా తగ్గిపోయి, కేంద్ర ఖాతాకు రెండు శాతం అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉదాహరణకు ముడి పామాయిల్‌పై బీసీడీ 27.5శాతంగా ఉండి, దాన్ని కేంద్రం, రాష్ట్రాలు పంచుకునేవి. కొత్త బడ్జెట్‌ తరవాత కేవలం 15శాతమే   పంచుకుంటాయి. 27.5శాతం బీసీడీ కేంద్ర ఖాతాకు చేరిపోతుంది.

ఉమ్మడి ‘ఫార్ములా’ కావాలి

గతంలో అన్ని వస్తువులపై సెస్సును ఏకీకృత రేటుగా విధించేవారు. బడ్జెట్‌ తరవాత వేర్వేరు వస్తువులపై వివిధ రకాలుగా విధించబోతున్నారు. ఇకనుంచి రకరకాల వస్తువులపై సెస్సు 2.5శాతం నుంచి 50శాతం వరకు ఉండబోతోంది. ఏఐడీసీ సెస్సు ద్వారా ఎంత మొత్తం సమకూరుతుందో కచ్చితంగా తెలియదు. కొన్ని అంచనాల ప్రకారం ఇది రూ.30,000 కోట్లవరకు ఉండవచ్చు. గతంలో సెస్సుల ద్వారా లభించే మొత్తాలను నిర్దేశిత పద్ధతిలో ఖర్చుపెట్టాలనే నిబంధన ఉండేది. ఏఐడీసీకి కూడా అదే పద్ధతి వర్తిస్తుందా అన్నది ప్రశ్న.   2018-19లో 35 సెస్సుల ద్వారా రూ.2,74,592 కోట్లు వసూలైనా కేవలం రూ.1,64,322 కోట్లను మాత్రమే నిర్దేశిత బోర్డులకు, నిధులకు బదిలీ చేశారని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక తెలిపింది. మిగతా మొత్తం భారత సంఘటిత నిధిలోనే మూలుగుతోంది. ఏఐడీసీ సెస్సు మొత్తాలను వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని సర్కారు చెబుతున్నా పంటల వైవిధ్యీకరణ, నీటి పంపిణీ, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ఎంతెంత ఖర్చుచేస్తారో తెలియదు.

వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల (ఏపీఎంసీ) మౌలికవసతుల వృద్ధికి లక్ష కోట్ల రూపాయల ఏఐఎఫ్‌ (వ్యవసాయ మౌలిక వసతుల నిధి)ని ఖర్చుచేస్తామని బడ్జెట్లో ప్రకటించడం సంతోషించాల్సిన అంశం. చిన్న, మధ్యతరహా రైతులకు తోడ్పాటుగా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను విరివిగా నెలకొల్పాలి. మన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల)లో 51శాతం గ్రామాల్లోనే ఉన్నాయి. కొవిడ్‌వల్ల కుదేలైన ఈ పరిశ్రమలు వేగంగా కోలుకోవడానికి తోడ్పడాలి. గ్రామాల్లో ఆదాయాలు పెరిగితే వస్తుసేవలకు గిరాకీ అధికమై పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయి. ఏఐడీసీ విధింపు, వసూళ్లు, పంపకాల విషయమై కేంద్రం, రాష్ట్రాలు ఒక ఫార్ములా రూపొందించుకోవాలి. ఉభయులూ కలిసి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి వీలుగా వ్యవసాయ మౌలిక వసతులను ఇబ్బడిముబ్బడిగా విస్తరించాలి.

సుంకం... కారాదు భారం

కొవిడ్‌ వల్ల పట్టణాల నుంచి గ్రామాలకు కార్మికులు తిరిగి రావడంతో పల్లెలకు నగదు జమలు పడిపోయాయి. పంటలకు గిట్టుబాటు ధరలూ లభించడం లేదు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) కారణంగా రైతు ఆదాయాలు పెరుగుతాయి. వినియోగదారులపై భారం మోపకుండా చూసేందుకు చాలా కొద్ది వస్తువులపైనే ఈ ‘సెస్సు’ విధిస్తామని ప్రకటించారు.

Posted Date: 23-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం