• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ కరెన్సీ వైపు ప్రపంచం

ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న భారత్‌

డిజిటల్‌ కరెన్సీ... ముఖ్యంగా కేంద్ర బ్యాంకు విడుదల చేసే డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రయోగాత్మకంగా సీబీడీసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దేశాల జాబితాలో తాజాగా భారతదేశమూ చేరింది. సీబీడీసీ అంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు జరుగుతున్న క్రిప్టో కరెన్సీల వంటిది కాదు. అది రిజర్వు బ్యాంకు వంటి కేంద్ర బ్యాంకుల హామీ ఉన్న చట్టబద్ధ కరెన్సీ. అదేసమయంలో సీబీడీసీ కాగితం కరెన్సీ కాదు, నాణెమూ కాదు. దాన్ని ఈ రెండు రూపాల్లోకీ మార్చడమూ కుదరదు. సీబీడీసీ అనేది ఫోన్‌, డిజిటల్‌ వ్యాలట్‌, కంప్యూటర్‌ ద్వారా మాత్రమే ఉపయోగించగల డిజిటల్‌ కరెన్సీ.

పూర్వాపరాలు

డిజిటల్‌ రూపంలో దాచుకున్న ఆస్తిని క్రిప్టో కరెన్సీ అనవచ్చు. దీన్ని ప్రైవేటు కరెన్సీ అనీ వ్యవహరిస్తున్నారు. అది బ్లాక్‌ చెయిన్‌ వంటి ‘డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌’ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఈ సాంకేతికత వల్ల క్రిప్టో కరెన్సీని ఫోర్జరీ చేయడం కుదరదు. క్రిప్టో కరెన్సీ చాలా పరిమితంగా చలామణీలో ఉన్నందువల్ల గిరాకీ ఏ కాస్త హెచ్చినా- దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ తరహా కరెన్సీల్లో బిట్‌ కాయిన్‌దే అగ్రస్థానం. ఇంకా ఎథీÅరియమ్‌, ఎక్స్‌ఆర్‌పీ, టెదర్‌, బిట్‌ కాయిన్‌ క్యాష్‌, బిట్‌ కాయిన్‌ ఎస్‌వీ, లైట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలూ వాడుకలో ఉన్నాయి. మొత్తం క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో 95శాతం కేవలం 10 అగ్రశ్రేణి క్రిప్టోలలోనే జరుగుతోంది. బిట్‌ కాయిన్‌ మూలాలు ఇప్పటికీ అస్పష్టమే. సతోషీ నకొమోతో అనే అజ్ఞాత నిపుణుడు 2009లో బిట్‌ కాయిన్‌ను సృష్టించాడని అందరూ అంటారు కానీ, ఆ వ్యక్తిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. అసలు సతోషీ కేవలం ఒక్క వ్యక్తా లేక కొందరు వ్యక్తుల బృందమా అనేదీ తెలియదు. ఈ ఏడాది మార్చి 29నాటికి ఒక్క బిట్‌ కాయిన్‌ విలువ 58,000 డాలర్లకు, అంటే సుమారు 42 లక్షల రూపాయలకు చేరుకుంది. నేడు ప్రపంచంలో 6,223 క్రిప్టో కరెన్సీలు చలామణీలో ఉన్నాయని అంచనా. వాటి విలువ 1.80 లక్షల కోట్ల డాలర్లు. కేవలం 12 ఏళ్లలోనే వీటి విలువ సున్నా నుంచి ఈ స్థాయికి పెరగడం విశేషం. పైగా ఇవి ప్రభుత్వ నియంత్రణ లేకుండా అంతర్జాలం సాయంతో సునాయాసంగా చేతులు మారుతున్నాయి, దేశాల ఎల్లలు దాటుతున్నాయి. దీంతో కేంద్ర బ్యాంకులు క్రిప్టో కరెన్సీలను ఇక ఏమాత్రం అలక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పోనుపోను ఈ తరహా కరెన్సీల విలువ పెరిగిపోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపనుంది.

ఇటీవలి కాలంలో డిజిటల్‌ చెల్లింపులు విస్తృతం కావడం చూస్తూనే ఉన్నాం. అధునాతన సాంకేతికత తెచ్చిన సౌలభ్యమిది. ఇది ప్రజలను అధికాధికంగా ఆకర్షిస్తోంది. మారుతున్న పరిస్థితులను గమనించి తగిన విధానాలతో ముందుకురావడం ప్రభుత్వాల కర్తవ్యం. డిజిటల్‌ కరెన్సీలు, చెల్లింపుల్లో ఫోర్జరీలకు ఆస్కారం దాదాపుగా ఉండదు. కరెన్సీ రూపంలో నగదు ముద్రణ, చలామణీకయ్యే ఖర్చులూ డిజిటల్‌ కరెన్సీ వల్ల తగ్గిపోతాయి. 2019-20లో కరెన్సీ ముద్రణ, నకిలీ కరెన్సీలను అరికట్టడం వంటి కార్యకలాపాలపై రిజర్వు బ్యాంకు రూ.4,400 కోట్లు ఖర్చుపెట్టవలసి వచ్చింది. ఇంతా చేసి ఒక కరెన్సీ నోటు సగటు జీవిత కాలం రెండేళ్లలోపే. అదే డిజిటల్‌ కరెన్సీ అయితే బ్లాక్‌ చెయిన్‌ సాంకేతకత వల్ల ఫోర్జరీకి అవకాశమే చిక్కదు. ఈ తరహా కరెన్సీలు డిజిటల్‌ రూపంలో శాశ్వతంగా ఉండిపోతాయి. డిజిటల్‌ చెల్లింపులు, డిజిటల్‌ కరెన్సీలు ఆర్థిక చక్ర భ్రమణాల వేగం పెంచుతాయి. ఈ వాస్తవాన్ని కేంద్ర బ్యాంకులు ఇంకా పూర్తిగా గుర్తించినట్లు లేదు!

క్రిప్టో కరెన్సీల వల్ల కానీ,డిజిటల్‌ కరెన్సీ  (సీబీడీసి) వల్ల కానీ ఇప్పుడప్పుడే కాగితం కరెన్సీలు పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశమే లేదు. సీబీడీసీలు ఇతర రకాల కరెన్సీలతో సహజీవనం చేయాలని కేంద్ర బ్యాంకులకు కేంద్ర బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) గతేడాది అక్టోబరు తొమ్మిదో తేదీన నిర్దేశించింది. సీబీడీసీలతో ప్రయోగాలను చైనా ఎన్నడో ప్రారంభించింది. నేడు కేంద్ర బ్యాంకులు ప్రజలను క్రిప్టో కరెన్సీల నుంచి సీబీడీసీలవైపు మళ్ళించడానికి కంకణబద్ధమయ్యాయి. తాము కాకుండా మూడో పక్షం చేతుల మీదుగా డిజిటల్‌ చెల్లింపులు జరగడం కేంద్ర బ్యాంకుల పాత్రను, దేశాల ద్రవ్య సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంది. నిరుడు కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో డిజిటల్‌ చెల్లింపుల ప్రాధాన్యం అందరికీ తెలిసివచ్చింది. వీటి మీద నియంత్రణాధికారం తమకే ఉండాలని ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఆశించడం సహజమే.

ఆందోళనకర అంశాలు

సీబీడీసీ అంతర్జాలం లేని చోట్ల పనిచేస్తుందా, సైబర్‌ చోరుల దాడులను తట్టుకోగలుగుతుందా, వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందా అనే ప్రశ్నలు అనివార్యంగా తలెత్తుతున్నాయి. ఏ దేశానికా దేశం సొంత సీబీడీసీని ప్రవేశపెడుతున్నప్పుడు, అంతర్జాతీయ లావాదేవీలు ఎలా జరుగుతాయి, ఒక దేశ కరెన్సీని మరో దేశం ఆమోదిస్తుందా అనే చిక్కు ముళ్లనూ పరిష్కరించాలి. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను సాధారణ కరెన్సీలోకి తేలిగ్గా మార్చుకోవచ్చు. అవి కొన్ని సెకన్లలో దేశాల ఎల్లలను దాటుతున్నాయి. అందుకే అవి ఆకర్షణీయంగా ఉన్నాయి. క్రిప్టోలు ప్రైవేటు కరెన్సీలు కావడం దీనికి కారణం. కానీ, సీబీడీసీలు రకరకాల నియంత్రణలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి క్రిప్టోలకున్న వేగం, సౌలభ్యం వాటికి ఉండవు. రహస్య లావాదేవీలు జరపాలనుకునేవారు ఎప్పటికీ క్రిప్టోలనే ఆశ్రయిస్తారు తప్ప- ప్రభుత్వాల కనుసన్నల్లో మెలిగే సీబీడీసీలను కాదు. ఏదిఏమైనా డిజిటల్‌ కరెన్సీలకు సంబంధించి పటిష్ఠమైన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం... కాస్త ఆలస్యమైనా సరే- వచ్చే దశాబ్దం, సాధికార డిజిటల్‌ కరెన్సీలదే!

అంతర్ధానం కానున్న ‘నోట్లు’

దాదాపు 200 ఏళ్ల నుంచి అనేకానేక దేశాల్లో చలామణీలో ఉన్న కాగితం కరెన్సీ, నాణాల నుంచి ఉన్నట్టుండి డిజిటల్‌ కరెన్సీకి మారడానికి కొంత సమయం పట్టేమాట నిజం. స్వీడన్‌, చైనాలు డిజిటల్‌ కరెన్సీ వాడకంలో మిగతా దేశాలకన్నా చాలా ముందున్నాయి. నగదు వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా స్వీడన్‌ వేగంగా పరుగులుతీస్తోంది. బిట్‌ కాయిన్‌ రంగప్రవేశం చేసినప్పటి నుంచి డిజిటల్‌ కరెన్సీకి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వడం ఎక్కువైంది. అన్నట్టు బిట్‌ కాయిన్‌ను కరెన్సీగా కన్నా షేర్ల వంటి స్పెక్యులేషన్‌ సాధనంగా పరిగణించడం ఉత్తమం. అయినా సరే... భారతదేశంలో బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీల వాడకం విస్తరించకుండా సీబీడీసీని ప్రవేశపెట్టాలని కేంద్రం, రిజర్వు బ్యాంకు భావిస్తున్నాయి. ఒక దశలో క్రిప్టో కరెన్సీలను నిషేధించాలనే దిశగా ఆలోచనలూ సాగాయి.

Posted Date: 05-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం