• facebook
  • whatsapp
  • telegram

పొదుపు... కుదుపు!

అల్పాదాయ వర్గాలకు కావాలి అండాదండా

భవితను పొదుపు ద్వారా మలుపు తిప్పవచ్చు అన్నమాట ఇప్పటిది కాదు. భారతీయుల నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన భావన... పొదుపు! రూపాయి రూపాయి కూడగట్టుకుని పొదరిల్లు కట్టుకుని అందులో శేషజీవితం అంతా కులాసాగా కాలక్షేపం చేయాలన్నదే భారతీయుల్లో అత్యధికుల ఆలోచన. బడాబాబుల మాట అటుంచితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో చాలామందికి పొదుపు చేయడం జీవితంలోను, జీతంలోను అతి పెద్ద భాగం, బాధ్యత. ఇలా పొదుపు చేసుకున్న మొత్తంలోంచే పిల్లల చదువులు, వాళ్ల పెళ్లిళ్లు, ఇంట్లో వాళ్ల ఆరోగ్య ఖర్చులు... ఇలా సమస్తం చూసుకుంటారు. పెద్ద ఆపద ఏదైనా ముంచుకొచ్చినా తాము కూడబెట్టుకున్న సొమ్ము ఆదుకుంటుందనే ధైర్యమే సగటు భారతీయుడిని ముందుకు నడిపిస్తుంటుంది. ఒక్క ముక్కలో- భారతీయ ఆర్థిక వ్యవస్థకు పొదుపే పట్టుగొమ్మగా నిలుస్తోంది. దేశ జనాభాలో సగానికి పైగా మధ్యతరగతి వర్గమే. వీళ్లు సాధారణంగా రోజుకు రూ.75 నుంచి రూ.150 వరకు ఖర్చుచేస్తారన్నది ముంబయి విశ్వవిద్యాలయ ఆర్థికవేత్తల అధ్యయన సారాంశం. మధ్యతరగతి సంపాదనలో సింహభాగం పొదుపు ఖాతాల్లోకే వెళుతోంది. దేశంలో సగానికిపైగా మధ్యతరగతి జీవుల పొదుపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. ఆ పొదుపు ద్వారా సమకూరిన డబ్బుతోనే బ్యాంకులు అనేకమందికి అప్పులు ఇస్తుంటాయి. పొదుపు చేసేవాళ్లకు ఇచ్చే వడ్డీ కంటే అప్పు ఇచ్చినవాళ్ల వద్ద నుంచి తీసుకునే వడ్డీ మొత్తం అధికం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే బ్యాంకులకు వచ్చే లాభం. వాటి నిర్వహణ వ్యయం, సిబ్బంది జీతాలు అన్నింటికీ అది సరిపోతుంది. అదీ మధ్యతరగతి పొదుపు మహిమ!

ఆర్థిక వృద్ధికి భరోసా

ఓ జీవిత బీమా సంస్థ 2019లో చేసిన సర్వే ప్రకారం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల్లో దాదాపు 75శాతం తమ జీతాల్లోంచి అత్యధిక భాగాన్ని ‘సేవింగ్స్‌ బ్యాంక్‌’ ఖాతాల్లోనే దాచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసి, 24 గంటల్లోనే ఉపసంహరించుకున్న ఓ పెద్ద ప్రకటన- ఇలాంటి మధ్యతరగతి పొదుపు జీవుల గుండెల్లో గుబులు రేపింది. కిసాన్‌ వికాస పత్రాలు, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సుకన్యా సమృద్ధి యోజన వంటి వివిధ పథకాల్లో చాలామంది భారతీయులు పొదుపు చేసుకుంటారు. ఇవి దీర్ఘకాలంలో వచ్చే అవసరాలకు ఉపయోగపడతాయని, పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు తమను ఆదుకుంటాయన్నది వారి ప్రగాఢ విశ్వాసం. కానీ, వీటన్నింటిపైనా వడ్డీని దాదాపు 0.7 శాతం నుంచి 0.9 శాతం వరకు తగ్గిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ పథకాలన్నీ ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే అమలవుతున్నాయి. వీటిపై వడ్డీరేటు ప్రభుత్వ సెక్యూరిటీల రేటుతో ముడివడి ఉంటుంది. అయినా, రిజర్వుబ్యాంకు మాత్రమే ఈ రేట్ల మీద నియంత్రణ కలిగి ఉంటుంది. ప్రభుత్వ ఆర్థిక విధానాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో రిజర్వుబ్యాంకు మార్పులు చేర్పులు చేస్తుంటుంది. రెండేళ్లుగా ఆర్థికవృద్ధి రేటును ఎలాగైనా పెంచాలని కంకణం కట్టుకుని, పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. వడ్డీ తక్కువ వస్తుంటే... పొదుపు ఖాతాల్లోంచి, భవిష్యనిధి (ప్రావిడెంట్‌ ఫండ్‌) ఖాతాల్లోంచి డబ్బులు వెనక్కి తీసుకుని, వాటిని ఏదో  ఒక రకంగా ఖర్చుపెడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకొని, తద్వారా జీడీపీ వృద్ధిరేటు అధిక స్థాయిలో నమోదవుతుందన్నది ప్రభుత్వ ఆర్థికవర్గాల యోచన.

ప్రమాదకర ఆలోచన

మధ్యతరగతి ప్రజలు చేసే చిన్నమొత్తాల పొదుపు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఎంతగానో ఆదుకుంటోంది. వచ్చే రాబడి కొంత తక్కువే అయినా... దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా తాము దాచుకున్న సొమ్ము చేతికి వస్తుందన్న భరోసాయే ప్రజలను వీటివైపు నడిపిస్తోంది. పోనుపోను ఈ రాబడి మరీ తీసికట్టుగా ఉండటంతో ప్రజలకు వీటిపై ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇలా నిరాసక్తత పెరిగి ప్రజలంతా తమ పొదుపు సొమ్మును క్రమంగా బయటకు తీయడం మొదలుపెడితే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. గతంలో అమెరికా వంటి అగ్రరాజ్యాలను ‘సబ్‌ప్రైమ్‌’ సంక్షోభం అల్లకల్లోలం చేసింది. ఆ తరుణంలో అక్కడి ప్రజలు పొదుపు చేసుకున్న మొత్తాలు చాలావరకు హారతికర్పూరంలా కరిగిపోయాయి. అంతటి సంక్షోభంలోనూ భారతదేశ ఆర్థికవ్యవస్థ చెక్కుచెదరకుండా నిలబడటానికి కారణం- మధ్యతరగతి ప్రజల పొదుపు సొమ్ము మేరువులా అండగా ఉండటమే! అదంతా బ్యాంకుల్లో భద్రంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా గడిచిపోయింది. కేంద్ర ఆర్థికమంత్రి తాను చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు చెప్పినా... భవిష్యత్తులో మళ్ళీ అలాంటి నిర్ణయమే తీసుకోబోరన్న నమ్మకం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పొదుపును ప్రోత్సహించకుండా, వ్యయం వైపే ప్రజలను మళ్ళించాలన్నట్లుగా ఉంటే మాత్రం- బ్యాంకుల్లో ఉన్న డబ్బులకు కాళ్లు రావడం ఖాయం. ఆ పరిస్థితి రానీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుదే!!

- కామేశ్వరరావు పువ్వాడ
 

Posted Date: 05-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం