• facebook
  • whatsapp
  • telegram

సరైన ఉద్దీపనతోనే దేశార్థికానికి ఊపు

సుస్థిరాభివృద్ధికి వ్యవస్థాగత సంస్కరణలు

కొవిడ్‌ మహమ్మారి వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రూ.1.5 లక్షల కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అదనపు రుణాల మంజూరుకు వెచ్చిస్తామన్నారు. ఆరోగ్య రంగానికి అదనపు నిధులు, పర్యాటక ఏజెన్సీలు, గైడ్‌లకు రుణాలు, విదేశీ పర్యాటకులకు వీసా రుసుము రద్దు వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం 2020-21లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3శాతం మేరకు కోసుకుపోయిన సమయంలో ఈ ప్యాకేజీ వెలువడింది. అయితే, ఇంతకు ముందే ప్రకటించిన రుణ గ్యారంటీ పథకాలు, ఇతర కేటాయింపులను మినహాయిస్తే, వాస్తవంలో కొత్తగా కేటాయించింది కేవలం రూ.60,000 కోట్లేనని రుణ రేటింగ్‌ సంస్థ ఐసీఆర్‌ఏ వెల్లడించింది. కొవిడ్‌ వల్ల ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి, గిరాకీ పడిపోయిన స్థితిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అదనపు రుణాలు ఏమాత్రం మేలు చేస్తాయో చెప్పలేం. యావత్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావడానికి ప్రభుత్వ తాజా ప్యాకేజీ పెద్దగా తోడ్పడదని చెప్పవచ్చు. కొవిడ్‌ వల్ల నిరుద్యోగం మిన్నంటడం, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం విధానకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ద్రవ్యోల్బణ భయం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా, ముమ్మరంగా వ్యాక్సినేషన్‌ చేపట్టి, ప్రజల్లో అత్యధికులకు టీకాలు వేస్తే, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఊపందుకొంటాయి. జనాభాలో 60-70శాతానికి టీకాలు వేస్తే సామూహిక రోగ నిరోధక శక్తి ఏర్పడి మార్కెట్లు క్రయవిక్రయాలతో మళ్ళీ కళకళలాడతాయి. గిరాకీ, ఉత్పత్తితోపాటు ఉపాధీ పెరుగుతుంది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను సహేతుక స్థాయిలో ఉంచినట్లయితే వ్యాపార, పారిశ్రామిక సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉత్పత్తిని, వ్యాపార లావాదేవీలను పెద్దయెత్తున పునఃప్రారంభించగలుగుతాయి. కానీ, బ్యాంకులు ఎడాపెడా రుణాలిచ్చేస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని కొందరు ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. జనం చేతిలో ఎక్కువ డబ్బు ఆడితే, వస్తుసేవల కొనుగోళ్ళు పెరుగుతాయి. తక్కువ వస్తువుల కోసం ఎక్కువ డబ్బు పోటీపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందనేది ఆర్థికశాస్త్రంలో మౌలిక సూత్రం. అయితే, ఈ సూత్రాన్ని ప్రస్తుత అసాధారణ పరిస్థితులకు వర్తింపజేయకూడదని మరి కొందరు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ల వల్ల నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిన గిరాకీని, నిలిచిపోయిన ఉత్పత్తిని పునరుజ్జీవింపజేయడానికి రిజర్వు బ్యాంకు తన ద్రవ్యవిధానాన్ని ప్రయోగించాలి. సామూహిక టీకాలతో ఆర్థిక రథం మళ్ళీ పట్టాలెక్కితే, కొత్త ఉత్పత్తి సామర్థ్య సృష్టీ జరుగుతుంది. దానికి కావలసిన పెట్టుబడులను అందించడానికి అనువుగా రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించాలి. సార్వజన టీకాలు, తక్కువ వడ్డీ రేట్లకు తోడుగా పన్నుల విధానాన్ని సవరించాలి. వ్యవసాయ ఉత్పత్తి సాధనాలపై, ఉపాధి కల్పించే పరిశ్రమలకు కావలసిన ముడిసరకులపై పన్నులు తగ్గించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి పన్ను రాయితీలతోపాటు మరిన్ని ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించాలి. ఎంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించారనే ప్రాతిపదికపై సేవా రంగానికి పన్ను రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలి. అన్నింటినీ మించి పెట్రోలును, డీజిలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఈ చర్యలు సామాన్య మానవుడితోపాటు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలపై భారం తగ్గించి, కొత్త ఉత్సాహం నింపుతాయి.

ఆర్థిక పునాది పటిష్ఠం కావాలి

దేశ శ్రామిక శక్తిలో 97శాతం ఆక్రమిస్తున్న అసంఘటిత రంగ కార్మికులు కొవిడ్‌ లాక్‌డౌన్‌ల వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర కడగండ్ల పాలవుతున్నారు. వారిని ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి. వీరి పూర్తి సమాచారాన్ని సేకరించే కార్యక్రమం కొనసాగుతుండటం స్వాగతించాల్సిన విషయమే. దీనికి తోడు అసంఘటిత రంగ కార్మికులకు సత్వర నగదు బదిలీ జరగాలి. ఈ నగదు మార్కెట్‌లోకి వచ్చి వ్యాపారాలు వృద్ధిచెందుతాయి. ఈ చర్యలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని, వ్యాపారుల్లో నమ్మకాన్ని పెంపొందించి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకొని, వృద్ధి బాట పట్టడానికి తోడ్పడతాయి. కొవిడ్‌ కాలంలో ప్రభుత్వం పోగొట్టుకున్న పన్నుల ఆదాయం ఖజానాకు తిరిగివస్తుంది. క్రమంగా మునుపటికన్నా ఎక్కువ ఆదాయమూ సమకూరుతుంది. అధిక విత్త లోటు, ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక సుస్థిరతకు ప్రమాదకరమని వాదించేవారు- పెరుగుతున్న నిరుద్యోగిత యువతలో అశాంతిని రేపి అంతిమంగా రాజకీయ అస్థిరతకు కారణమవుతుందని గ్రహించడం లేదు. కొవిడ్‌ కష్టాల నుంచి గట్టెక్కడానికి పై చర్యలను తీసుకోవడంతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే   ఆకస్మిక సంక్షోభాలను తట్టుకోగలిగేలా మన ఆర్థిక వ్యవస్థకు పటిష్ఠమైన పునాది ఏర్పరచాలి. భారత్‌ దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధికి ఇది చాలా అవసరం. అసలు కొవిడ్‌ ముందునాళ్ళలోనే భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగాలేదు. ఇంతలో గోరుచుట్టుపై రోకటిపోటులా మహమ్మారి వచ్చిపడింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2020లో నాలుగు శాతానికి పడిపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా వ్యవస్థాగత సంస్కరణలను తక్షణం చేపట్టాలి. సులభతర వాణిజ్యం, ఆరోగ్యకరమైన పోటీ, అందరికీ సమానావకాశాలు ఉండే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తే దేశంలోకి దీర్ఘకాలిక ప్రైవేటు పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఉపాధి, వ్యాపారాలు వృద్ధి చెంది దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది!

బంగ్లాదేశ్‌ స్ఫూర్తి

కొవిడ్‌ కష్టకాలంలోనూ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడపడంలో బంగ్లాదేశ్‌ అనేక పెద్ద దేశాలకన్నా ముందుంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి పొరుగునే ఉన్న భారత్‌ నేర్చుకోవలసింది ఎంతో ఉంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉండటం, ద్రవ్యోల్బణం అదుపు, విత్త లోటు నియంత్రణ, కరెన్సీ మారక రేటును సమర్థంగా నిభాయించడం ద్వారా బంగ్లాదేశ్‌ కొవిడ్‌ తుపానును తట్టుకొంటోంది. ఉత్పాదకత శక్తిని పెంచుకోవడం వల్ల తక్కువ వ్యయానికి వస్తూత్పత్తిని కొనసాగించ గలుగుతోంది. ఫలితంగా బంగ్లా ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లో సమర్థంగా పోటీ పడగలుగుతున్నాయి. ఐరోపా దేశాల మార్కెట్లలో బంగ్లా ఎగుమతులకు ప్రవేశ సౌలభ్యం, ప్రాధాన్యం ఉండటం ఆర్థికంగా ఎంతో తోడ్పడుతోంది. ప్రవాస బంగ్లాదేశీయులు స్వదేశానికి పంపే నగదు జమలు విదేశ మారక ద్రవ్య నిల్వలకు బలం చేకూరుస్తున్నాయి. చాలా దేశాల్లోకన్నా బంగ్లాలో ప్రైవేటు రంగం ఎంతో మెరుగ్గా మహమ్మారిని తట్టుకొని నిలబడగలిగింది. ఆ దేశ విధానాలను భారత్‌ అధ్యయనం చేయాలి.


 

Posted Date: 12-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం