• facebook
  • whatsapp
  • telegram

వస్తు సేవల పన్ను మేలా... కీడా?

‣ రాష్ట్రాల ఆశలు ఆవిరి

వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను ప్రవేశపెట్టి ఈ ఏడాది జులై ఒకటో తేదీకి నాలుగేళ్లయింది. 2017 జూన్‌ 30 అర్ధరాత్రి పార్లమెంటు కేంద్ర హాలులో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర నాయకులు సమావేశమైనప్పుడు- భారతదేశ సంక్లిష్ట పరోక్ష పన్నుల వ్యవస్థ లోటుపాట్లకు జీఎస్టీ సరైన పరిష్కారమవుతుందని ఎందరో ఆశించారు. జీఎస్టీని గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌ (మంచి, సరళమైన పన్ను)గా వర్ణించినవారున్నారు. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ అంటూ అప్పట్లో చాలానే సందడి చేశారు. నాలుగేళ్లు గడిచాక జీఎస్టీని మంచిదని కానీ, సరళమైనదని కానీ అంగీకరించేవారు కనిపించడం లేదు. భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థను సంస్కరించే ప్రయత్నం రాజీవ్‌గాంధీ హయాములో మొదలైంది. రాజీవ్‌ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న వీపీ సింగ్‌ మోడ్వాట్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. తరవాత యశ్వంత్‌ సిన్హా వ్యాట్‌ (విలువ జోడింపు పన్ను) విధానాన్ని తీసుకొచ్చారు. దాని స్థానంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టడానికి చిదంబరం సన్నాహాలు మొదలుపెట్టారు. చివరకు అమలులోకి వచ్చిన జీఎస్టీ విధానం మరే దేశంలోనూ లేనంత సంక్లిష్టమైనదిగా తయారైంది.

మరింత సంక్లిష్టం

మరెక్కడా లేనంత అధిక పన్ను రేట్లను కూడా భారతీయ జీఎస్టీలో పొందుపరచారు. అసలే జటిలంగా ఉన్న పన్నుల వ్యవస్థను మరింత సంక్లిష్టం చేయడం తప్ప జీఎస్టీ సాధించిందేమీ లేదు. పన్నుచెల్లింపుదారులపై ప్రభుత్వ నిఘా మాత్రం పెరిగింది. జీఎస్టీ తమకెంతో ప్రయోజనకరంగా ఉంటుందని మొదట్లో భావించిన రాష్ట్రాలు, ఇప్పుడు ఆ ప్రయోజనాలను అతిగా ఊహించుకున్నామని వాపోతున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా, 1954లో ఫ్రాన్స్‌ జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఆ తరవాత 140 దేశాలు జీఎస్టీకి మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఇప్పటివరకు జీఎస్టీకి మారలేదు. చైనావ్యాట్‌ పద్ధతినే అనుసరిస్తోంది. ఇతర దేశాల్లోని వస్తు సేవల పన్నుకు భారతదేశ జీఎస్టీకి ఎక్కడా పోలికే లేదు- ఒక్క కెనడాతో తప్ప. సింగపూర్‌లో మూడు శ్లాబులు ఉండగా, మిగతా దేశాలన్నీ ఒకే శ్లాబును పాటిస్తున్నాయి. భారత్‌లో కేంద్రం, రాష్ట్రాలు విధించే వివిధ పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మద్యం, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు, పన్ను చెల్లింపుదారులు, సామాన్య ప్రజలు ఎంతో లాభపడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. పాత పన్నుల విధానంలో అవినీతి వల్ల నష్టపోయి, విసిగిపోయిన వ్యాపారులకు జీఎస్టీ ఊరటనిస్తుందని భావించారు. పన్నుల విధానం సరళతరమై వ్యాపార వర్గాలకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. అధిక పన్నులతో కుంగిపోతున్నామని వాపోతున్న వర్గాలు జీఎస్టీ వల్ల పన్నులు తగ్గుతాయని ఆశపెట్టుకున్నాయి. కొత్త పన్నుల విధానంలో పన్నుల ఎగవేత తగ్గి, ఆదాయం పెరుగుతుందని రాష్ట్రాలు అంచనా వేశాయి. జీఎస్టీ విధానానికి తొలుత రూపకల్పన చేసినది పూర్వ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాబట్టి, ఎన్డీయే హయాములో పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభల్లో తేలిగ్గా ఆమోదం పొందింది. పన్నులు విధించడానికి రాజ్యాంగపరంగా తమకు సంక్రమించిన అధికారాలను రాష్ట్రాలు జీఎస్టీ మండలికి ధారాదత్తం చేశాయి. ఈ మండలిలో రాష్ట్రాలన్నింటికీ కలిపి 66శాతం ఓటింగ్‌ హక్కులు ఉంటే, మిగతా 33శాతం హక్కులు కేంద్రానికి ఉంటాయి. చివరికి రాష్ట్రాలు తమ పన్ను అధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టాయి. ఈ క్రమంలో తమ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాయనే చెప్పాలి. ఇక అవి కాలు వెనక్కు తీసుకోలేని స్థితి నెలకొంది. కేరళలో వరదల ఉద్ధృతి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించినప్పుడు, రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి ఎలాంటి పన్నులూ విధించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దుస్థితి మున్ముందు ఇతర రాష్ట్రాలకూ ఎదురుకావచ్చు.

హామీని నిలబెట్టుకోని కేంద్రం

వస్తుసేవల పన్ను అధునాతన సాంకేతికతను తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌, ఈ-వే బిల్లులు, ఇన్‌పుట్‌ క్రెడిట్లు, డిజిటల్‌ చెల్లింపుల వల్ల పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్వాయిస్‌లు తగ్గాయి. పెద్ద కంపెనీలు నెలనెలా సమర్పించాల్సిన ఆర్థిక ప్రకటనల భారం తగ్గింది. ఎంఎస్‌ఎంఈలకు మాత్రం ఈ తరహా భారం, అందుకయ్యే వ్యయం పెరిగాయి. పన్నుల విధాన కేంద్రీకరణవల్ల రాష్ట్రాలు పన్నుల ఆదాయంలో వాటా కోసం గతంలోకన్నా అధికంగా కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది. కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆర్థిక భాగస్వాములుగా పరిగణించే రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తోంది. అసలే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు జీఎస్టీ- గోరుచుట్టుపై రోకటి పోటైంది. కొవిడ్‌కు ముందే వ్యాపారాలు దెబ్బతిన్న చిన్న సంస్థలు జీఎస్టీ భారం నుంచి కోలుకోలేకపోయాయి. పలు వ్యాపార సంస్థలు మూతపడిపోయాయి. జీఎస్టీని ప్రవేశపెట్టాక భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఒక శాతానికి సమానమైన పన్నుల ఆదాయం కోసుకుపోయింది. కేంద్రం వివిధ సెస్సుల రూపంలో ఆదాయ లోటు లేకుండా చూసుకొంటూ ఉంటే, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేక ఆర్థికంగా చితికిపోతున్నాయి. పన్నుల ఆదాయంలో ఏర్పడిన నష్టానికి పరిహారం చెల్లిస్తాననే హామీని కేంద్రం నిలబెట్టుకోవడం లేదు. కేంద్రం, రాష్టాలు ఈ లోటుపాట్లను అధిగమించనిదే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిన పడదు.

ఎంఎస్‌ఎంఈలకు గుదిబండగా...

ఎలాంటి వస్తువులపైనైనా పన్నులు తగ్గించాలన్నా, పెంచాలన్నా జీఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాలు, కేంద్రం సమ్మతితోనే జరగాలి. పన్నులను మార్చాలంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రేగవచ్చు. పాత పన్నుల విధానాన్ని ఉన్నపళాన మార్చేయడం కన్నా దశలవారీగా కొత్త విధానానికి మారడం ఉత్తమమనే గ్రహింపు ప్రభుత్వాలకు కొరవడింది. అందుకే జీఎస్టీ వల్ల పన్నుల ఆదాయం ఏటా 14శాతం చొప్పున పెరుగుతుందని తప్పుడు అంచనాలు వేసుకున్నాయి. దీనికి ఏ మాత్రం లోటు ఏర్పడినా- నష్టపరిహార సెస్సు విధించి భర్తీ చేస్తానని రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చింది. చాలా రాష్ట్రాలకు 2015 నుంచి పన్నుల ఆదాయం అయిదుశాతం నుంచి 12శాతం వరకే పెరిగింది. అనేక రాష్ట్రాల్లో వివిధ సంస్థల పేరిట వ్యాపారాలు చేసే భారీ కంపెనీలకు మాత్రమే జీఎస్టీ లాభించింది. సొంత రాష్ట్రాలకే పరిమితమైన చిన్న వ్యాపారాలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు నష్టం మిగిలింది.


 

Posted Date: 16-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం