• facebook
  • whatsapp
  • telegram

ఆరోగ్యమే ఆర్థిక భాగ్యం

వైద్యరంగంలో పెట్టుబడుల ఊతం

భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ ఆర్థికాన్ని కొవిడ్‌ సంక్షోభం దెబ్బతీసింది. ఈ గడ్డుకాలం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను చేపట్టినా, వాటిని ఉపసంహరించిన తరవాత కొన్నేళ్ల వరకు డబ్బుకు కటకట ఏర్పడి తీరుతుంది. దీన్ని అధిగమించడానికి కేంద్రం, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచి ఆర్థిక రంగాన్ని పునరుత్తేజితం చేయాలి. ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఎడాపెడా అప్పులు చేసేసిన రాష్ట్రాల వద్ద పెట్టుబడులు పెట్టడానికి డబ్బు లేదు. అందువల్ల బాధ్యతనంతా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రజారోగ్యం, మౌలిక వసతుల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడితే, రాగల కొన్నేళ్లలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయేలా లేదు కాబట్టి- ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయడానికి పెట్టుబడులు పెంచడం అవసరమే కాక అనివార్యంగా భావించాలి. మౌలిక వసతుల కల్పన వ్యయం దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తుంది. ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టినప్పుడు ప్రైవేటు రంగం సైతం అదనపు విలువ జోడింపునకు పెట్టుబడులతో ముందుకొస్తుంది.

అధ్వానంగా సేవలు

ప్రజలు ఆరోగ్యవంతులైనప్పుడు వారి పని సామర్థ్యం, ఉత్పాదక సత్తా పెరిగి మన ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ విపణిలో పెద్ద వాటా కోసం పోటీ పడగలుగుతుంది. ప్రభుత్వమే తమ ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చినప్పుడు ప్రజలు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. దానివల్ల గిరాకీ, ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు విజృంభిస్తాయి. ఆరోగ్య రంగంలో ఖర్చుపెట్టే ప్రతి ఒక్క రూపాయికి నాలుగు రెట్లకు పైగా ప్రయోజనం సిద్ధిస్తుందని ఐరోపాలో జరిగిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ప్రజల ఆయుఃప్రమాణం ఒక్క సంవత్సరం పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు నాలుగు శాతం మేర పుంజుకొంటుందని ఇతర అధ్యయనాలు వెల్లడించాయి. అద్భుత ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాలను సమకూర్చుకున్న ఐరోపా సమాఖ్య(ఈయూ)లోని దేశాల్లో మొత్తం ఉద్యోగాల్లో 11శాతం ఆరోగ్య, సామాజిక సేవల రంగాల్లోనే లభిస్తున్నాయి. భారత్‌కు వచ్చేసరికి ఈ ఉద్యోగాలు ఒక శాతం కన్నా తక్కువే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొంత మెరుగుపడినా, కొవిడ్‌ దెబ్బకు అందులోని లొసుగులు బయటపడ్డాయి. పెద్ద దేశాల్లో ఆరోగ్యంపై జీడీపీలో అతి తక్కువ (1.25) శాతం ఖర్చు పెడుతున్న దేశం భారత్‌ ఒక్కటే. ప్రజారోగ్యంపై భారత్‌ కన్నా భూటాన్‌ (2.5శాతం), శ్రీలంక (1.6శాతం) ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. 2025కల్లా జీడీపీలో 2.5శాతాన్ని ప్రజారోగ్యంపై వెచ్చించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. అంతకన్నా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉందని కొవిడ్‌ గుర్తుచేస్తోంది. మన గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత దారుణంగా ఉన్నాయో కొవిడ్‌ కళ్లకు కట్టింది. మన జనాభాకు అవసరమైనన్ని ఆస్పత్రులు లేకపోవడమే కాదు, సిబ్బంది కొరతా పీడిస్తోంది. అసలు కొవిడ్‌ విరుచుకుపడటానికి ముందే, 2019నాటి ప్రభుత్వ గణాంకాలను బట్టి ఉప కేంద్రాల్లో సుశిక్షిత వైద్య సిబ్బంది కొరత 12శాతం; ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో 21శాతం, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 18శాతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం- ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ, భారత్‌లో ప్రతి 1,511 మంది జనాభాకు ఒక వైద్యుడే ఉన్నారు. ప్రతి 300 మంది జనాభాకు ఒక నర్సు అవసరమైతే, భారత్‌లో 670 మందికి ఒక నర్సు చొప్పున ఉన్నారు. భారత్‌లో మొత్తం 11.6 లక్షల మంది వైద్యులు ఉంటే, వారిలో తొమ్మిది లక్షల మంది మాత్రమే ప్రాక్టీస్‌ చేస్తున్నారని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. కొవిడ్‌ కాలంలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటే, దానికి తగ్గ సంఖ్యలో వైద్యులు, నర్సులు లేకపోవడం మన ఆరోగ్య యంత్రాంగ దుస్థితిని బయట పెడుతోంది. అందరికీ సక్రమంగా ఆరోగ్య సేవలు అందాలంటే వైద్యులు, నర్సుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగాలి.

పరిష్కార మార్గాలు

ఓటు బ్యాంకు రాజకీయాలపై ప్రజాధనాన్ని వృథా చేయడం మాని ప్రజల ప్రాణాలు కాపాడటానికి తోడ్పడే ఆరోగ్య సేవలపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి. తాలూకా లేదా మండల స్థాయి ఆస్పత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ఎక్కువ నిధులు వ్యయీకరించాలి. మండల స్థాయిలో 20 నుంచి 25 పడకల ఆస్పత్రి, ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అయిదు నుంచి ఏడేళ్ల ప్రణాళిక చేపట్టి తగిన నిధులు కేటాయించాలి. కొవిడ్‌ మహమ్మారి మరి కొన్నేళ్లపాటు మనతోపాటు ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా సమాయత్తం కావాలి. టీకాలు, కొవిడ్‌ అనంతర చికిత్సలకు ఏటా రూ.50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని గ్రహించాలి. భవిష్యత్తులో మరేవైనా వైరస్‌లు దండెత్తితే తక్షణం స్పందించే సామర్థ్యాన్ని మనం సంతరించుకోవాలి. గ్రామాలు, పట్టణాల్లో ఒకటి రెండు రోజుల్లోనే తాత్కాలిక చికిత్సా కేంద్రాలను నిర్మించగలగాలి. యుద్ధప్రాతిపదికపై పనులు చేయాలి. ఇలాంటి ఏర్పాట్లు భవిష్యత్తులో ఒక్కుమ్మడిగా సమస్యలు మీదపడినప్పుడు కూడా మనల్ని ఆదుకొంటాయి. వరదలు, తుపానులు, భూకంపాలు విరుచుకుపడినప్పుడు అంటు వ్యాధులు సహజంగానే వ్యాపిస్తాయి. వాటి చికిత్సకు మనం వెంటనే రంగంలోకి దిగే సామర్థ్యాన్ని కూడగట్టుకోవాలి. దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రకృతి ఉత్పాత నిభాయింపు చట్టాలను సవరించాలి. కేంద్రంతోపాటు రాష్ట్రాలు నిధులతో తోడ్పాటు అందించాలి. రానున్న అయిదేళ్లలో రాష్ట్రాలు చేసే అప్పులలో సగ భాగాన్ని ఆరోగ్య వసతుల విస్తరణపై ఖర్చు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. దానివల్ల పేదలు, మధ్యతరగతి వారికి ఆరోగ్య ధీమా లభిస్తుంది.

దశాబ్దాల నిర్లక్ష్యం

సగటున 300 నుంచి అయిదు వేల మందికి ఆరోగ్య సేవలు అందించాల్సిన ఒక ఉప కేంద్రానికి 5,729 మంది పౌరుల తాకిడి ఎదురవుతోంది. 20 వేల నుంచి 30 వేల మందికి తోడ్పడాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) 35,730 మందికి సేవలు అందించాల్సి వస్తోంది. 80 వేల నుంచి 1.2 లక్షల మంది రోగులకు సేవలు అందించాల్సిన సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) 1.71 లక్షల మంది బాధ్యత తీసుకోవలసి వస్తోంది. రోగుల తాకిడికి తట్టుకొనే స్థాయిలో ఆయా కేంద్రాల్లో సిబ్బంది, పరికరాలు, మందులు వంటివి లేవు. గిరిజన, పర్వత ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనలవి కాదు. దశాబ్దాల కాలంగా మన ఆరోగ్య యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల కొవిడ్‌ విజృంభించిన వేళ ఆ దుష్ఫలితాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి.

Posted Date: 27-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం