• facebook
  • whatsapp
  • telegram

5జీతో ఆర్థిక ప్రయోజనాలెన్నో...

అందిపుచ్చుకొనేదెలా?

నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి రాకముందే ఎన్నో భయాలు, అనుమానాలు పట్టిపీడిస్తాయి. 5జీ విషయంలోనూ ఇదే జరిగింది. అనుమానాల కారణంగా దేశంలో 5జీ   నెట్‌వర్క్‌ను అడ్డుకోవాలని కొంతమంది ఇప్పటికే కోర్టును సైతం ఆశ్రయించారు. వాస్తవానికి 5జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశం వెనకబడింది. 3జీ స్పెక్ట్రమ్‌ కోసం ఉన్నదంతా గుమ్మరించడంతో టెలికాం సంస్థలపై అప్పుల భారం పడింది. వాటిని భరించలేక ఇప్పటికే అనేక టెలికాం సంస్థలు చేతులెత్తేశాయి. దేశంలో దశాబ్దం ముందు 11 టెలికాం సంస్థలు ఉండగా, ఇప్పుడా సంఖ్య నాలుగుకు పడిపోయింది. అటు ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రక్రియ నెమ్మదించింది. ప్రస్తుతం 100 దేశాల్లోనే 5జీ అందుబాటులో ఉంది. అందులోనూ కొన్ని ప్రాంతాలకే 5జీ సేవలు పరిమితమయ్యాయి. 5జీని ఎంత త్వరగా అమలులోకి తీసుకొస్తే, అంత ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదు.

‘అంతర్జాలం’తో అద్భుతాలు...

ఇంటర్నెట్‌ 1994లో పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనిషి జీవితాన్ని శాసిస్తోంది. జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అంతర్జాలం ప్రభావం ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొవిడ్‌ పుణ్యమా అని ఇంటర్నెట్‌ను ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. కొవిడ్‌ తొలిదశ(2020 జూన్‌)లో 42శాతం అమెరికా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసినట్లు అంచనా. అంతర్జాలంవల్లే ఇది సాధ్యమయింది. భారత్‌లోనూ ‘ఇంటి నుంచే పని’ సంస్కృతి ఊపందుకుంది. సమీప భవిష్యత్తులో ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉంది. దేశంలో 2012లో మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 2.3కోట్లు. ప్రస్తుతం అది 82.53కోట్లకు చేరింది. వీరిలో 79.9కోట్ల మంది సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద 40శాతం ఇంటర్నెట్‌ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. సగటు డేటా వినియోగమూ వృద్ధిచెంది, 2015 మార్చిలో 100ఎంబీ నుంచి 2021 మార్చి నాటికి 12.33 జీబీకి హెచ్చింది. అందరికీ సులభంగా అందుబాటులో ఉండటంతో ఇంటర్నెట్‌ వినియోగం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ... వేగం తగ్గకుండా ఉండేందుకు బ్యాండ్‌విడ్త్‌ను పెంచడం టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల బాధ్యత. ఇక్కడే భారత్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో ఇంటర్నెట్‌ వేగం ఇంకా 2జీ-4జీ మధ్యలోనే ఉండిపోయింది. పరికరాల సంఖ్య పెరిగితే ఇప్పుడున్న నెట్‌వర్క్‌ల వేగం తగ్గిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రపంచ దేశాల్లోని టెలికాం కంపెనీలు 5జీ వైపు అడుగులు వేస్తున్నాయి. 5జీతో ఇంటర్నెట్‌ వేగం పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు.

సమాచారాన్ని రూపాంతరీకరించడంలో వేగమే అంతర్జాలంతో ఒనగూడే అతిపెద్ద లాభం. సమాచారం ఎక్కడుంటే అక్కడ వినియోగదారులుంటారు. కస్టమర్లు ఎక్కడుంటే అక్కడ ప్రకటనలు ఉంటాయి. వాటి ద్వారా సంపాదన పెరుగుతుంది. వీక్షణలతో ఏ విధంగా డబ్బు ఆర్జించవచ్చనేది గూగుల్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లు ఇప్పటికే నిరూపించాయి. వీటన్నింటికీ మూలం ఇంటర్నెట్‌ అనడం నిస్సందేహం. ఫోన్‌ పే లావాదేవీలు ఎక్కువ శాతం ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాలు, పట్టణాల నుంచే జరుగుతున్నట్లు సంస్థ వెల్లడించింది. వ్యాపారాలు, గృహాల్లో సులభంగా ఉపయోగించే స్థాయికి అంతర్జాలం చేరడంతోనే ఇది సాధ్యపడింది. సాంకేతికతను ఉపయోగించుకుంటే లావాదేవీలు, ఖర్చులు ఆదా అవుతాయి. ఖర్చులు తగ్గితే ఎంఎస్‌ఎమ్‌ఈలు బలపడతాయి. కొవిడ్‌ అనంతర పరిణామాలతో సేవా రంగంలో ఇంటర్నెట్‌ రాజ్యమేలుతోంది. ఒకరకంగా ఎంఎస్‌ఎమ్‌ఈల మనుగడ అంతర్జాలంపైనే ఆధారపడే స్థాయికి చేరింది. ప్రజల పనితీరును ఇంటర్నెట్‌ పూర్తిగా మార్చేసింది. ఏడాదిగా కార్పొరేట్‌ సంస్థల బ్యాలెన్స్‌ షీట్లను పరిశీలిస్తే అంతర్జాలం వినియోగంతో అవి ఎంత లబ్ధి పొందాయనేదీ అర్థమవుతుంది. దేశంలో 5జీ రాకతో పరిస్థితులు ఇంకా మెరుగుపడతాయి.

గణనీయమైన మార్పులు

ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఓ వెల ఉంటుంది. 5జీకి కూడా అంతే. 5జీ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. టెలికాం రంగంలో ఉన్న తీవ్ర పోటీ, 3జీ కోసమైన ఖర్చులతో సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. స్పెక్ట్రమ్‌, టవర్లు, పరికరాల కొనుగోళ్లను కలుపుకొంటే దేశంలో 5జీని ప్రవేశపెట్టేందుకు మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. 5జీ అందించే వేగాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవాలంటే టవర్లు, బేస్‌ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచాలి. భారత్‌లో పోటీతత్వాన్ని, ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టెలికాం రంగంపై పన్నుల భారాన్ని తగ్గించాలి, వాటి నుంచి ఆదాయాన్ని డిమాండ్‌ చేయకూడదు. ప్రభుత్వం ఆదుకోకపోతే 5జీ ప్లాన్ల ధరలను కంపెనీలు పెంచక తప్పదు. ఇక కస్టమర్లు పాత ఫోన్లు పక్కనపెట్టి, 5జీ కనెక్టివిటీ ఉన్న పరికరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కృత్రిమ మేధతో పనిచేసే పలు యాప్‌లకు 6జీ అవసరం ఉండగా... వర్చువల్‌ రియాలిటీ, ‘ఇంటి నుంచే పని’ వంటి సదుపాయాలకు 5జీ దోహదపడుతుంది. 5జీతో బ్యాంకింగ్‌, ఆర్థికం,   వినోదం, షిప్పింగ్‌, ట్రేడింగ్‌ రంగాల్లో లబ్ధి పొందాలంటే భారీస్థాయిలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం అధికమవుతుంది. ఒకవైపు సాంకేతికతతో ప్రపంచం రూపురేఖలు మారిపోతున్నా, పుడమికి మాత్రం గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు, శిలాజ ఇంధనాల రూపంలో- చేటు వాటిల్లుతోంది. దేశంలో 5జీ ఊపందుకునే కొద్దీ- సర్వీస్‌ ప్రొవైడర్లు తమను తాము ఈ సాంకేతికతకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వెనకబడిపోయి తీవ్ర నష్టం దాపురిస్తుంది. 5జీతో ఉత్పాదకత పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే దీని కోసం ఉద్యోగులు తమ నైపుణ్యానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. ఇవన్నీ 5జీతో హఠాత్తుగా వచ్చే మార్పులు కావు. పోస్టల్‌ ఉత్తరాల నుంచి టెలిగ్రామ్‌ల వరకు, ఈ-మెయిల్స్‌ నుంచి మెసేజింగ్‌ యాప్‌ల వరకు మనిషి జీవనశైలి ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. కొత్త సాంకేతికత కారణంగా ఆర్థికవ్యవస్థలో వస్తున్న మార్పులను గ్రహించి, అందుకు తగ్గట్లు మారకపోతే, నిరుద్యోగం వంటి సమస్యలు వెంటాడే ప్రమాదం ఉంది!

పెరుగుతున్న వేగం

తరాలు మారుతున్న కొద్దీ ఇంటర్నెట్‌ వేగమూ పుంజుకొంటోంది. దీనివల్ల సమాచార పంపిణీలో వేగం పెరిగి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. 5జీలో ఇంటర్నెట్‌ వేగం సెకనుకు 10 గిగాబైట్‌(జీబీపీఎస్‌)గా ఉంటుందని అంచనాలున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ ఎల్‌టీఈ సాంకేతికతలో వేగం సెకనుకు 300 మెగాబైట్లు మాత్రమే. 3జీలో అది 43 ఎంబీపీఎస్‌లు. అంటే 5జీ నెట్‌వర్క్‌తో 500 ఎంబీ ఫైల్‌ను 4-5 సెకన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఒక గిగాబైట్‌ అంటే రెండు గంటల హెచ్‌డీ సినిమాను ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో డౌన్‌లోడ్‌ చేసుకోగలం.


 

Posted Date: 14-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం