• facebook
  • whatsapp
  • telegram

సాగరంలోనా అణుగరళం?

రేడియోధార్మిక జలాల విడుదలకు జపాన్‌ యత్నం
 

అది... 2011 మార్చి 11వ తేదీ. జపాన్‌ ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 15 మీటర్ల ఎత్తున సునామీ అలలు చెలరేగాయి. తీరానికి సమీపంలో ఉన్న 5,306 మెగావాట్ల ఫుకుషిమా అణు విద్యుత్‌ ప్లాంటును అవి ధ్వంసం చేశాయి. 1986 నాటి చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ ప్లాంటు దుర్ఘటన తరవాత ఇది రెండో అతిపెద్ద ప్రమాదం. ఆపై 12 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలను అక్కడకు దూరంగా ఉన్న ఓ ప్రదేశంలో ఉంచిన వెయ్యి ట్యాంకుల్లోకి తరలించారు. వాటిలో ఇప్పుడు సుమారు 10 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. ఇప్పుడు ఫుకుషిమా అణువిద్యుత్‌ ప్లాంటును తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తమవద్ద ఉన్న రేడియో ధార్మిక జలాలను 2022 నుంచి సముద్రంలోకి విడిచిపెట్టాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ జలాల్లో పెద్ద మొత్తంలో ఉండే సీజియం, ట్రీటియం, కోబాల్ట్‌, కార్బన్‌-12 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్‌లు అత్యంత ప్రమాదకరం. వాటి సమీపంలోకి వెళ్లిన సముద్రజీవులకూ ముప్పే. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మత్స్యపరిశ్రమ దెబ్బతినడంతోపాటు, సముద్రతీర ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లోకి రేడియోధార్మికత వ్యాపించి క్యాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులతో మానవాళికీ పెనుముప్పు పొంచి ఉంది. జపాన్‌ తరహాలో భవిష్యత్తులో మరిన్ని దేశాలు తమ పారిశ్రామిక వ్యర్థాలను, రేడియోధార్మిక జలాలను సముద్రాల్లోకి వదిలే ప్రమాదమూ లేకపోలేదు.
 

ఏళ్లపాటు ప్రభావం
జపాన్‌ చేసే పని కారణంగా చేపలు సహా అన్నిరకాల సముద్ర జీవుల్లో నిరంతరం రేడియో ధార్మికతను పరీక్షించాల్సి వస్తుంది. తీరప్రాంతాల్లో భూగర్భ జలాలనూ పరీక్షించాల్సిందే. తాము విడుదల చేసేవి శుద్ధి చేసిన జలాలేనని, ట్రీటియం తప్ప మరేమీ ఉండబోవని జపాన్‌ చెబుతున్నా అనుమానం తొలగడం లేదు. ముప్పును తక్కువ అంచనా వేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర జలాల్లోకి ఒకసారి రేడియోధార్మిక జలాలు వదలడం మొదలైతే- చేపలు, రొయ్యలు, పీతల్లాంటి అన్నిరకాల సముద్ర జీవుల్నీ తినడాన్ని పూర్తిగా మానుకోవాల్సి ఉంటుంది. గతంలో ఫ్రాన్సులో రేడియోధార్మిక పదార్థాలను సముద్రంలోకి వదిలితే అవి ఉత్తర అట్లాంటిక్‌, ఆర్కిటిక్‌ సముద్రాల వరకూ వెళ్లాయి. అక్కడ తాబేళ్లు, సీల్‌ చేపలు కూడా మరణించాయి. ఇప్పుడు జపాన్‌ కూడా అదేపని చేస్తే ఆగ్నేయాసియా దేశాలన్నింటికీ ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

అన్నిరకాల రేడియోధార్మిక ఐసోటోప్‌లతో దీర్ఘకాలంలో మనుషులకు క్యాన్సర్‌ ముప్పు దాపురిస్తుంది. చెర్నోబిల్‌లో అణు ప్రమాదం సంభవించిన 20 ఏళ్ల తరవాతా థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, ట్రీటియం నుంచి వెలువడే బీటా కణాలు మనిషి డీఎన్‌ఏను సైతం ప్రభావితం చేస్తాయి. దానివల్ల జన్యువులు పాడై, రాబోయే తరాలపైనా దుష్ప్రభావాలు పడతాయి. నీళ్లలో కలిసిన రేడియో ఐసోటోప్‌లపై దీని తీవ్రత ఆధారపడుతుంది. నీళ్లలో కలిసిన అణు వ్యర్థ జలాల్లో ఉండే సీజియం పూర్తిగా కరిగిపోవడానికి 180 నుంచి 300 సంవత్సరాలు పడుతుంది! ఈ జలాల వల్ల ప్రభావితమైన బాలికల్లో 70 శాతం భవిష్యత్తులో థైరాయిడ్‌ క్యాన్సర్‌ పాలబడే ముప్పుంది.  చిన్నతనంలోనే ప్రభావితమైన బాలురలో ఏడుశాతానికి లుకేమియా, ఆడవారిలో ఆరుశాతానికి రొమ్ముక్యాన్సర్‌ ప్రమాదం తప్పదని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా.
 

ఇతర దేశాల్లో ఆందోళన
రేడియోధార్మిక జలాలను సముద్రంలో వదలాలనే ప్రతిపాదనకు జపాన్‌ వాసులూ సుముఖంగా లేరు. 41.5 శాతం వ్యతిరేకంగా స్పందించినట్లు ఓ సర్వేలో తేలింది. ఫుకుషిమా తీరంలోని మత్స్యకారులు బహిరంగంగానే తమ అసమ్మతి తెలిపారు. చైనా, దక్షిణ కొరియా దేశాలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. జపాన్‌ తాము శుద్ధి చేశామని చెబుతున్న రేడియోధార్మిక జలాలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో శాస్త్రీయంగా పరీక్షించిన తరవాతే నిర్ణయం తీసుకోవాలన్నది చైనా అణు నిపుణుల మాట. ఫుకుషిమా ప్రమాదం సంభవించినప్పుడు ఆ అణు విద్యుత్‌ ప్లాంటు పునరుద్ధరణ కంటే- ప్రజారోగ్యం, పర్యావరణాలను కాపాడటంపై జపాన్‌ సరిగ్గా దృష్టిపెట్టి ఉంటే ఇప్పుడు ఇంత ముప్పు తలెత్తి ఉండేది కాదన్న వాదనలు పొరుగు దేశాల నుంచి వినిపిస్తున్నాయి. ఆసియా ఖండంలో సముద్రాలన్నీ ఒకదాంతో ఒకటి కలుస్తాయి. అందువల్ల ఫుకుషిమా జలాలు ఈ ఖండమంతటికీ వ్యాపించి, ఆర్థిక వ్యవస్థలకు, మానవ నష్టానికి దారితీసే ప్రమాదం ఎక్కువ. తీరప్రాంతంలో అణుధార్మికత వ్యాప్తితోపాటు, అక్కడ లభ్యమయ్యే సముద్ర ఆహారంపై భయాందోళనలతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలయ్యే ప్రమాదముంది. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని దేశాల్లో పర్యాటక ఆదాయం పడిపోయింది. తాజాగా ఈ ప్రమాదమూ తోడైతే కోలుకోవడం చాలాకష్టం. ఇది ప్రపంచ సమస్య. దీన్ని అధిగమించేందుకు మరిన్ని ట్యాంకుల ద్వారా రేడియోధార్మిక జలాలను నిల్వచేయడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప, విషతుల్యాలను సముద్రాల్లోకి వదిలిపెట్టాలనుకోవడం ఎంతమాత్రం తెలివైన ఆలోచన కాదు!  
 

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ
 

Posted Date: 24-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం