• facebook
  • whatsapp
  • telegram

ఇదే అదను... ఇక మేధకు పదును!

డిజిటల్‌ గేమింగ్‌లో అవకాశాలు అపారం

భారతీయ సంస్కృతి, జానపద గాథల ఆధారంగా సరికొత్త ఆటలు రూపొందించి ‘అంతర్జాతీయ డిజిటల్‌ గేమింగ్‌’ రంగంలో అగ్రస్థానాన్ని సంపాదించాలి - ప్రధాని నరేంద్ర మోదీ

నిన్న మొన్నటి వరకు వినోదం అంటే సినిమా, రంగస్థలం లేదా క్రీడలు మాత్రమే. కానీ డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం విస్తరణతో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కొత్త వినోద అవకాశంగా కంప్యూటర్‌, మొబైల్‌ తెరలమీదకు వచ్చింది. ఆ ఆటలు కేవలం పిల్లలు, యువకులనే కాదు- పదవీ విరమణ చేసి ఇంట్లో ఉన్న పెద్దవారినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతయ్యే ఆటలతో సరిపెట్టుకోవడమా... లేక దీన్నో వ్యాపార అవకాశంగా, కొత్త ఉద్యోగాల కల్పనకు వీలు కల్పించే సరికొత్త పరిశ్రమగా అందిపుచ్చుకోవడమా అనేది మనపైనే ఆధారపడి ఉంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా కాల్పనిక శక్తి, బొమ్మలు వేయడం, హేతుబద్ధంగా ఆలోచించగల నైపుణ్యాలు ఉన్న వారెవరికైనా ఈ రంగం ఉద్యోగాలు కల్పిస్తుంది. వాస్తవానికి గేమింగ్‌ రంగంలో ఆసియా దేశాలు... ముఖ్యంగా కొరియా, సింగపూర్‌, జపాన్‌, చైనా- మనతో పోలిస్తే ఒక దశాబ్ద కాలం ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా, సంయుక్త రాష్ట్రాల తరవాత అతిపెద్ద గేమింగ్‌ కంపెనీలు కొరియా, జపాన్‌లలో ఉన్నాయి. హాంకాంగ్‌, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో గేమింగ్‌ కంపెనీలకు ఉన్న మార్కెట్‌ విలువను చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి!.

వినోదం... ఉపాధి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ గేములు ఆడటం ద్వారా వినోదం పొందుతున్నారు. ప్రపంచ గేమింగ్‌ పరిశ్రమ వార్షిక టర్నోవర్‌ లక్ష కోట్ల రూపాయలకు మించిపోయింది. ఏటా కనీసం 10శాతం వృద్ధి నమోదు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, 4జీ విప్లవంతో అంచనాలకంటే ఎంతో వేగంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ విస్తరిస్తోంది. కొవిడ్‌వల్ల గత పది నెలల కాలంలో ఆన్‌లైన్‌, మొబైల్‌ గేమ్‌ల పట్ల ఆకర్షితులైనవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మన దేశంలో గేమింగ్‌ పరిశ్రమ ఇంకా శైశవ దశలోనే ఉంది. కానీ కొవిడ్‌ రూపంలో ఈ రంగానికి జీవం వచ్చింది. ఆటలు ఆడేవారి సంఖ్య పెరగడం, దీనికి తోడు కేంద్రం, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గేమింగ్‌ రంగంపై దృష్టి సారించడంతో- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో కంపెనీలకు తోడు కొన్ని అంకుర సంస్థలూ గేమింగ్‌ రంగంలోకి అడుగు పెట్టాయి. దీనికి తోడు స్వయానా ప్రధాన మంత్రి పిలుపివ్వడంతో మన దేశంలో ఒక వ్యాపార రంగంగా గేమింగ్‌ పరిశ్రమ అభివృద్ధి చెందగలదనే ఆశాభావం ఇప్పుడిప్పుడే  ఏర్పడుతోంది.

ఆపిల్‌ కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్‌ జాబ్స్‌, 2005లో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఆ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి- ‘ఆకలితో ఉండాలి... తిక్కతిక్కగా ఆలోచించాలి’ అని అన్యాపదేశంగా అన్నారు. ఆ విద్యార్థుల్లో ఒకరైన ఫారెస్ట్‌ లీని ఈ మాట విశేషంగా ఆకట్టుకుంది. చైనాలో పుట్టి అమెరికాలో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కాలం గడిపేద్దామనుకున్న అతడిలో ఆ తరువాత ఆలోచనల తుపాను చెలరేగింది. ఇపుడు అతడు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలో లిస్ట్‌ అయిన ‘సీ’ గేమింగ్‌ కంపెనీ యజమాని. ఈ కంపెనీకి ఉన్న మార్కెట్‌ విలువ 70 బిలియన్‌ డాలర్లు (అయిదు లక్షల కోట్ల రూపాయలకు పైనే).

విపణిని అందుకోవాలంటే?
ప్రపంచ గేమింగ్‌ రంగాన్ని చూస్తే... యుద్ధాలు, యాక్షన్‌ కథాంశాలుగా ఉన్న ఆటలే ప్రధానంగా కనిపిస్తాయి. దానికి మన పురాణాలు, వీరగాథలు, సాహస కృత్యాలు జోడించి విభిన్నమైన ఆన్‌లైన్‌ ఆటలు ఆవిష్కరించగలిగితే... ప్రపంచం మనవైపు తిరుగుతుంది. 2021 నాటికి మన దేశంలో గేమింగ్‌ పరిశ్రమ టర్నోవర్‌ రూ.10,000కోట్లకు మించిపోతుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఇతర దేశాల కంటే భిన్నంగా మనకు అతి పెద్ద దేశీయ ఆన్‌లైన్‌, మొబైల్‌ గేమింగ్‌ మార్కెట్‌ ఉంది. కానీ గేమింగ్‌ నైపుణ్యం కలిగినవారు తక్కువ. ఆటలు అభివృద్ధి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. కథనం, బొమ్మలు, గ్రాఫిక్స్‌, యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ నైపుణ్యాలు అవసరం. అటువంటి మానవ వనరులను తయారు చేయడానికి వీలుగా కోర్సులు ప్రారంభించాలి. ఈ రంగంలోని సంస్థలకు దీర్ఘకాలిక పెట్టుబడుల లభ్యత పెరగాలి. కంపెనీలకు ఒక్కరోజులోనే లాభాలు రావు. కొన్నేళ్లవరకూ మూలధన అవసరాలను తట్టుకోగలిగే స్థితిలో అవి ఉండాలి. దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు సాగితే వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచ గేమింగ్‌ మార్కెట్‌ను  గెలిచే పరిస్థితి మన దేశానికి వస్తుంది. అప్పుడు మనకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఎగుమతులు, ప్రభుత్వానికి భారీయెత్తున పన్ను ఆదాయం సుసాధ్యమవుతాయి. ఆ దిశగా ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు సన్నద్ధం కావాలి. అందుకు ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదు.

‘సీ’ ఆన్‌లైన్‌ విజయగాథ
ఇంతకీ ‘సీ గేమింగ్‌’ ఎందుకు ఇంత పెద్దకంపెనీ అయిందంటే... దానికి కారణం ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 50కోట్ల మంది గేమింగ్‌ వినియోగదారులు ఉండటమే. దీనికి చెందిన ‘ఫ్రీ ఫైర్‌’ మల్టీప్లేయర్‌ ఆన్‌లైన్‌ సర్వైవల్‌ గేమ్‌ గత ఏడాది కాలంలో అత్యధిక సంఖ్యలో డౌన్‌లోడ్‌ అయిన మొబైల్‌ యాప్‌గా గుర్తింపు సాధించింది. ఈ గేమ్‌ను 2017లో సీ గేమింగ్‌ కంపెనీ విడుదల చేసింది. అక్కడి నుంచి ఈ కంపెనీకి ఎదురే లేకుండా పోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ సీ కంపెనీకి 16.70 కోట్ల డాలర్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఈ ఆట భవిష్యత్తులోనూ భారీయెత్తున ఆదాయాన్ని ఆర్జిస్తుందని సీ గేమింగ్‌ కంపెనీ యజమాని ఫారెస్ట్‌ లీ ఆశిస్తున్నారు.

- మారుతీ శంకర్‌ లింగమనేని 
(డిజిటల్‌ గేమింగ్‌ రంగ నిపుణులు)

 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం