• facebook
  • whatsapp
  • telegram

సాంకేతికతే ఆలంబన

జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం సందర్భంగా...

ఒక భారతీయుడు 1928 ఫిబ్రవరి 28న యావత్‌ విజ్ఞాన ప్రపంచాన్నీ సంభ్రమానికి గురిచేశారు. ‘ఏ న్యూ రేడియేషన్‌’ పేరిట ఆనాడు ఆయన వెలువరించిన పరిశోధన గ్రంథానికి గుర్తింపుగా 1930లో నోబెల్‌ పురస్కారం లభించింది. ఆ పరిశోధనే ‘రామన్‌ ఎఫెక్ట్‌’ పేరిట జగద్విఖ్యాతమైంది. సి.వి.రామన్‌కు నివాళిగా ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రజల్లో శాస్త్రీయ స్పృహను పెంచే పలు కార్యక్రమాలు చేపడుతోంది. ‘శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల భవిష్యత్తు- విద్య, నైపుణ్యాలు, పని’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వీటిని నిర్వహిస్తోంది.

సంక్షోభం సదవకాశం

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో శాస్త్ర సాంకేతిక రంగాలు తక్షణం స్పందించాయి. వైరస్‌పై సరైన శాస్త్రీయ అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, టీకా ఔషధాల అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొవిడ్‌ ఫలితంగా సంభవించిన ప్రస్తుత ఆర్థిక సంక్షోభం- అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ఖజానాలను దెబ్బతీసి, పరిశోధన, ఆవిష్కరణ బడ్జెట్లను కుదించి వేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ మార్పు (భూతాప) నిరోధక చర్యల మీదా ప్రభావం పడుతుంది. డిజిటల్‌ పరివర్తనను వేగవంతం చేయాలన్న లక్ష్యాన్నీ దెబ్బ తీస్తుంది. అలాగే నూతన ఆవిష్కరణలను ఇతోధికంగా ప్రోత్సహించాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీల్లో భాగంగా ఆవిష్కరణ వ్యవస్థల పరిరక్షణకూ చేయూత ఇవ్వాలి. సంక్షోభం కల్పిస్తున్న అవకాశాలను చక్కటి అవకాశంగా ఉపయోగించుకుని ఈ దిశగా సంస్కరణలు ప్రవేశపెట్టాలి. ప్రపంచ ఆవిష్కరణల సూచీ (జీఐఐ-2020) ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో స్విట్జర్లాండ్‌ది ప్రథమ స్థానం. స్వీడన్‌, అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ ఆ తరవాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నూతన ఆవిష్కరణల్లో 50 అగ్రశ్రేణి ప్రపంచ దేశాల్లో ఒకటిగా భారత్‌ ఆవిర్భవించింది. 2019లో 52వ స్థానంలో ఉన్న భారత్‌, కేవలం ఏడాదిలోనే నాలుగు ర్యాంకులు ఎగబాకి 2020లో 48వ స్థానాన్ని దక్కించుకుంది. దిగువ స్థాయి మధ్యాదాయ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయిదో జాతీయ ‘శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల విధానం 2020’ రూపకల్పన భారత ప్రభుత్వ ముఖ్య విధాన నిర్ణయం. ఇందుకు అనుగుణంగా 2020-21 కేంద్ర బడ్జెట్‌ రాబోయే అయిదేళ్ల కాలానికి ‘క్వాంటం సాంకేతికత’లకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించింది. కంప్యూటింగ్‌, సమాచార వ్యవస్థలు, సైబర్‌ భద్రతలను కొత్తపుంతలు తొక్కించే ఈ సాంకేతికతలకు విస్తృత స్థాయిలో ప్రయోజనాలు ఉన్నాయి.

కొవిడ్‌ పుణ్యమా అని ఉన్నత విద్య బోధన అభ్యాసాల్లో ప్రవేశించిన కొన్ని మార్పులు భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తం కానున్నాయి. డిజిటల్‌ వనరుల వినియోగం, విద్యార్థుల ఆన్‌లైన్‌ పునశ్చరణ, అభ్యాసం, సృజనాత్మక మదింపు వంటి మార్పులను ఇకపైనా కొనసాగించాలి. విద్యారంగంలో సాంకేతిక ఆవిష్కరణలు ప్రవేశపెట్టినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డిజిటల్‌ టెక్నాలజీస్‌, గేమింగ్‌, చాట్‌బోట్లు వంటి నవకల్పనలు రానున్న రోజుల్లో రాజ్యమేలబోతున్నాయి.

వినూత్న విద్యా సాంకేతికతలు

దేశంలో విద్య నాణ్యతను మరింతగా పెంచడానికి అనువైన ఈ పద్ధతుల వినియోగం విద్య, బోధన రంగాల్లో మున్ముందూ కొనసాగాలి. కృత్రిమ మేధ, యంత్ర విద్య వంటి నవతరం సాంకేతికతలు విద్యారంగం రూపురేఖలు మార్చేస్తాయి. అభ్యాస విధానంలో మరొక కొత్త ధోరణి ‘గేమిఫికేషన్‌’. ఆన్‌లైన్‌ గేమ్స్‌ తరహాలో అభ్యాస వేదికలను రూపొందించి విద్యను మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. తద్వారా విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెరుగుతుంది. కృత్రిమ మేధతో ‘చాట్‌బోట్లు’ విద్యారంగంలోనూ పాదం మోపాయి. విద్యార్థుల సందేహ నివృత్తిలో వీటితోపాటు, ఇతర వర్చువల్‌ సహాయక అప్లికేషన్లు ఎంతో కీలకం కాబోతున్నాయి. సమయాన్ని, వ్యయాన్ని ఇవి ఆదా చేస్తాయి. ‘ఎడ్‌-టెక్‌’ రంగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత్‌ స్థానం పొందింది. కృత్రిమ మేధ, మరమనుషుల సాంకేతికత, క్వాంటం కంప్యూటింగ్‌, జన్యు ఇంజినీరింగ్‌, 3డీ ప్రింటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ వంటి సాంకేతికతలను ఉపయోగించుకుని పని చేయగల నిపుణుల అవసరం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞాన విస్ఫోటం, సమాచార విశ్లేషణ, యంత్రాలు, మరమనుషులు, స్వయంచాలక యాంత్రీకరణ, గ్రహాంతర యానం, జీవవైద్య ఇంజినీరింగ్‌లో పురోగతి- ఇలాంటివన్నీ ఆధునిక శాస్త్ర సాంకేతికతల ప్రాముఖ్యానికి నిదర్శనాలు. ఆవిష్కరణలు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనల ఆవశ్యకతను ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శాస్త్ర సాంకేతికతల పట్ల చిరుప్రాయం నుంచే పిల్లలకు ప్రేరణ కలిగించడం తప్పనిసరి. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడానికి జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం గొప్ప అవకాశం అందిస్తోంది. విజ్ఞానశాస్త్రం పట్ల అవగాహన, ప్రయోగ ప్రక్రియలు- చిన్నారుల విజ్ఞానాన్ని పెంచడానికి, వారు నూతన నైపుణ్యాలు సమకూర్చుకోవడానికి కచ్చితంగా తోడ్పడతాయి.


 

Posted Date: 02-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం