• facebook
  • whatsapp
  • telegram

నింగిలో నిప్పులు కక్కే డ్రోన్లు

రూపు మారుతున్న ఆధునిక సమరం

లద్దాఖ్‌లో భారత్‌, చైనా సేనల ఉపసంహరణకు అంగీకారం కుదిరినా- అక్కడ చైనా సేనలు ఇప్పటికీ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలన్న స్పృహ ఉభయుల్లోనూ ఉంది. ఈ పరిస్థితిలో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా అధినేతలు పాల్గొన్న వర్చువల్‌ ‘క్వాడ్‌’ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ సభను చూసి చిర్రెత్తిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌, క్వాడ్‌ పేరిట భారతదేశం తమను వ్యూహపరంగా బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తోందని మండిపడింది. తన సరిహద్దుల్లో చైనా దూకుడుకు ముకుతాడు వేయాలంటే క్వాడ్‌ దేశాలతో- ముఖ్యంగా అమెరికాతో రక్షణ బంధాన్ని పటిష్ఠపరచుకోవడం అవసరమని భారత్‌ నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 19-21 తేదీల్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ జె.ఆస్టిన్‌ భారత సందర్శన సందర్భంగా ఈ బంధం మరింత బలపడనుంది. ఈ పర్యటనలో అమెరికా నుంచి భారత్‌ మానవ రహిత సాయుధ మర భ్రమరాలు (కాంబాట్‌ డ్రోన్లు) కొనడానికి రంగం సిద్ధంకావచ్చు. ఇవి చేతిలో ఉంటే లద్దాఖ్‌లో రక్తపాత రహితంగానే చైనాను నిలువరించగలిగేవారమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. కాంబాట్‌ డ్రోన్లు 21వ శతాబ్ది యుద్ధాల రూపురేఖలను మార్చేస్తున్న దృష్ట్యా అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి వాటిని కొనడంతోపాటు- సొంతంగా తయారుచేయాలనీ భారత్‌ నిర్ణయించింది.

ఉత్పత్తిపై భారత్‌ దృష్టి

యుద్ధంలో విజయానికి డ్రోన్లు తోడ్పడతాయని 2020లో జరిగిన మూడు సమరాలు చాటిచెప్పాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) చైనీస్‌ వింగ్‌ లూంగ్‌ డ్రోన్లకు లేజర్‌ గైడెడ్‌ బాంబులను అమర్చి లిబియా నేషనల్‌ ఆర్మీ(ఎల్‌ఎన్‌ఏ)కి సరఫరా చేసింది. దీనికి పోటీగా ఎల్‌ఎన్‌ఏ ప్రత్యర్థులకు టర్కీ తన బేరక్తర్‌ క్షిపణులను అందించింది. వీటి దెబ్బకు ఎల్‌ఎన్‌ఏ వెనకడుగు వేయకతప్పలేదు. టర్కీ, ఇజ్రాయెల్‌ సరఫరా చేసిన డ్రోన్లతోనే అజర్‌ బైజాన్‌ నిరుడు ఆర్మీనియా మీద పైచేయి సాధించింది. సిరియాలో సైతం టర్కీ డ్రోన్లు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వ సేనలకు చెందిన వందలాది సాయుధ శకటాలను ధ్వంసం చేశాయి. పొరుగు ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి భారత్‌ క్రమంగా డ్రోన్ల దిగుమతికి, ఉత్పత్తికి సమాయత్తమవుతోంది. అమెరికన్‌ కంపెనీ జనరల్‌ ఏటమిక్స్‌ నుంచి లీజుకు తీసుకున్న రెండు సీ గార్డియన్‌ డ్రోన్ల పనితీరుపై సంతృప్తి చెందిన భారత నౌకాదళం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలను ఎదుర్కోవడానికి 10 డ్రోన్లను కొనదలచింది. ఈ ఉపగ్రహచోదిత డ్రోన్‌ 45 వేల అడుగుల ఎత్తులో 35 గంటలపాటు నింగిలోనే ఉండగలదు. భారత సైన్యం, వాయు సేనలు చెరో పది డ్రోన్లను కొంటాయి. ఇంతకుముందు ఇజ్రాయెల్‌ నుంచి 90 హెరాన్‌, హరాప్‌ డ్రోన్లను భారత సైన్యం కొనుగోలు చేసింది. హెరాన్‌లను నిఘా కోసం వినియోగిస్తున్నారు. హరాప్‌ ఆకాశంలో ఎగురుతూ గురిచూసి శత్రువుపై విరుచుకు పడుతుంది. ఈ తరహా డ్రోన్‌ను ‘లాయిటర్‌ మ్యూనిషన్‌ (నింగిలో తారట్లాడే ఆయుధం)’ అంటారు. హెరాన్‌ నిఘా డ్రోన్‌లకూ బాంబులు అమర్చడానికి గతేడాది ఆగస్టులో భారత్‌, ఇజ్రాయెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇజ్రాయెల్‌ నుంచి కొత్తగా మరి నాలుగు ఆధునిక హెరాన్‌ నిఘా డ్రోన్లను మూడేళ్ల లీజుపై తీసుకోవడానికి జనవరిలో మరో ఒప్పందం కుదిరింది. వీటిని చైనా సరిహద్దులో నియోగిస్తారు. రెండు దేశాలు కలిసి భారత్‌లో డ్రోన్ల తయారీకి ఫిబ్రవరిలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. అదే సమయంలో సొంత డ్రోన్‌ రుస్తుం-2 నూ భారత్‌ అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ డ్రోన్‌ను 27వేల అడుగుల ఎత్తులో 18 గంటల సేపు ఎగరేసి పరీక్షిస్తారు. ఐఐటీ-బొంబాయి పూర్వ విద్యార్థులు ఇద్దరు స్థాపించిన ఐడియా ఫోర్జ్‌ సంస్థ నుంచి రూ.130 కోట్లతో డ్రోన్లు కొనుగోలు చేయడానికి భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెలీ, భారతీయ డ్రోన్‌ ఉత్పత్తిదారులతో పోటీ పడి మరీ ఐడియా ఫోర్జ్‌ ఈ కాంట్రాక్టును గెలుచుకుంది.

ప్రయోజనాలెన్నో!

ఒక ఫైటర్‌ జెట్‌ విమానం ధర కోట్ల డాలర్లలో ఉంటే, డ్రోన్లు కొన్ని లక్షల డాలర్లకే లభిస్తాయి. ఫైటర్‌ జెట్‌ కూలిపోతే అపార ధన నష్టంతోపాటు ఎన్నో ఏళ్లపాటు శిక్షణ పొందిన పైలట్‌నూ కోల్పోవలసి వస్తుంది. అదే మానవ రహిత కాంబాట్‌ డ్రోన్లతో ప్రాణ నష్టం లేకుండానే శత్రువు పీచమణచవచ్చు. అసలు శత్రు భూభాగంలోకి సేనలను పంపకుండా సరిహద్దు ఇవతలే ఉండి డ్రోన్లను ప్రయోగించనూవచ్చు. లద్దాఖ్‌లో కాంబాట్‌ డ్రోన్లతో భారత్‌ కచ్చితంగా అనుకున్న ఫలితాలను సాధించగలిగేదని మాజీ సైన్యాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే చైనా కాంబాట్‌ డ్రోన్ల తయారీలో ముందుండటమే కాదు, పాకిస్థాన్‌కూ వాటిని సరఫరా చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ తరవాత చైనాయే అతిపెద్ద డ్రోన్ల తయారీదారు.

శత్రువుపై విరుచుకుపడేలా...

ఈ ఏడాది జనవరి సైనిక దినోత్సవంలో భారత్‌ 75 మర భ్రమరాల (డ్రోన్‌) దండును విజయవంతంగా ప్రదర్శించింది. మున్ముందు వెయ్యి డ్రోన్ల దండుతో శత్రువుపై విరుచుకుపడటానికి ఇది ఒక అభ్యాసం మాత్రమే. నిరుడు చైనా 48 డ్రోన్ల దండును ప్రదర్శించింది. భారత్‌ ఆర్మీడే కవాతులో మోహరించిన 75 డ్రోన్లలో మూడు రకాలు ఉన్నాయి. అవి- శత్రు లక్ష్యాలను పసిగట్టే సెన్సర్లు అమర్చిన క్వాడ్‌ కాప్టర్‌, దాడికి మార్గదర్శకత్వం వహించే మదర్‌ షిప్‌ డ్రోన్‌, బాంబులు అమర్చిన చిన్నసైజు క్వాడ్‌ కాప్టర్లు. కృత్రిమ మేధ, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ల సాయంతో డ్రోన్ల దండు దాడుల నిర్వహణ సాంకేతికత అభివృద్ధికి భారత్‌, అమెరికాలు 2018 నుంచి సహకరించుకుంటున్నాయి. మున్ముందు తేజస్‌, జాగ్వార్‌ యుద్ధ విమానాలకు అమర్చే డ్రోన్లతో శత్రువుపై విరుచుకుపడటానికి భారత్‌ సన్నద్ధమవుతోంది. ఈ విమానాలు మన భూభాగంలోనే ఉండి శత్రు భూభాగంలో 150-350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై డ్రోన్ల దండును ప్రయోగించగలుగుతాయి. డ్రోన్లు అమర్చిన ఫైటర్‌ జెట్లతో భారత్‌ మరి మూడు నాలుగేళ్లలో ప్రయోగాలు జరపనుంది. లద్దాఖ్‌ వంటి ఎత్తయిన పర్వత ప్రాంతంలో మోహరించి ఉన్న భారత సేనలకు సరకుల సరఫరాకు కంచర గాడిదల స్థానంలో హెలికాప్టర్‌ డ్రోన్లను నియోగించాలని భారత్‌ యోచిస్తోంది. అదే సమయంలో శత్రు డ్రోన్లను జామ్‌ చేసి, కూల్చివేయడానికి కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను భారత్‌ సొంతంగా రూపొందించింది. మూడున్నర కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను జామ్‌ చేసే సాంకేతిక వ్యవస్థలను చైనా సరిహద్దుల్లో ఇప్పటికే మోహరించారు. ఈ సాంకేతికతలన్నీ భవిష్యత్తులో అత్యాధునిక ఆరో తరం యుద్ధ విమానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి.

- ప్రసాద్‌
 

Posted Date: 19-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం