• facebook
  • whatsapp
  • telegram

సైబర్‌ భద్రతకు తూట్లు

పేట్రేగుతున్న ఆన్‌లైన్‌ మాయగాళ్లు

గతేడాది నుంచి భారత్‌ కరోనా వైరస్‌తో పాటు అనూహ్యంగా పెరిగిపోయిన సైబర్‌ మోసాలతోనూ తీవ్రంగా పోరాడుతోంది. మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై సైబర్‌ నేరాలు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయి. కరోనా కాలంలో ఇండియాలో సైబర్‌ నేరాలు ఎన్నో రెట్లు పెరిగినట్లు పలు అధ్యయనాలు చాటుతున్నాయి. అయిదారేళ్లుగా పెరుగుతున్న ఫోన్ల వినియోగం, చెల్లింపులను సులభతరం చేయడానికి అందుబాటులోకి వచ్చిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) విధానం వంటివి అందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి దారితీశాయి. దాంతోపాటే సైబర్‌ భద్రత సైతం ప్రమాదంలో పడింది. కరోనా తరవాత భారత్‌లో సైబర్‌ నేరాలు ఎన్నోరెట్లు పెరిగాయని ఇటీవల కేరళలో జరిగిన వార్షిక సైబర్‌ భద్రతా సదస్సులో భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు.

తీవ్ర ఆందోళన

‘మీ బ్యాంకు ఖాతాను నిలిపివేస్తున్నాం. మీ గూగుల్‌పే, ఫోన్‌పేలను వాడుకోలేరు. వెంటనే మీ వివరాలను నిర్ధారించుకోండి’ వంటి సందేశాలు వస్తే ఆదరాబదరా అందులో ఉండే లింకులను తెరచి సమస్యలను కొనితెచ్చుకొనేవారే అధికంగా ఉంటున్నారు. వినియోగదారుల భయమే సైబర్‌ నేరస్తులకు పెట్టుబడి. ఇటువంటి వాటిని సాంకేతిక పరిభాషలో ‘సోషల్‌ ఇంజినీరింగ్‌ నేరాలు’ అని వ్యవహరిస్తారు. మనిషి సహజసిద్ధ భావోద్వేగాలను ప్రేరేపించేలా ఏదో ఒక కట్టుకథ అల్లి, ఆ గందరగోళంలో ఉన్న వ్యక్తి ఖాతాను ఖాళీ చెయ్యడం సైబరాసురుల వ్యూహం. దేశంలో లాక్‌డౌన్‌ అమలైన తరవాత ఐటీతో పాటు కొన్ని ఇతర రంగాల సంస్థలు తమ ఉద్యోగులు ఇళ్లనుంచి పనిచేసే వెసులుబాటును కల్పించాయి. సైబర్‌ నేరాలకు అదే మరింత ఊతం ఇచ్చింది. ఒక ఉద్యోగి తన ఇంటి నుంచి లోపభూయిష్ఠమైన నెట్‌వర్క్‌ ద్వారా తాను పనిచేసే కంపెనీ సర్వర్‌కి పంపించే సమాచారాన్ని సైతం సైబర్‌ నేరగాళ్లు తస్కరించిన దాఖలాలు ఉన్నాయి. సమాచార బదిలీలో వివిధ ప్రొటోకాల్స్‌కు మధ్య ఉండే సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకొనే మాయగాళ్లూ ఉన్నారు. అలా జరుగుతున్న సమాచార తస్కరణ మామూలు వ్యక్తులకే కాదు, బడా సంస్థలకు సైతం ఇబ్బందికరంగా మారుతోంది. కరోనా తరవాత దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, శాఖలు, సంస్థల కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో కొనసాగడం అధికమైంది. దాంతో ప్రభుత్వ అధికారులు ఇచ్చిపుచ్చుకొనే కీలకమైన సమాచారం సైతం సైబర్‌ నేరస్తులకు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని సైబర్‌ భద్రత సదస్సులో జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు. గతేడాది దేశవ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు), నౌకాశ్రయాలు, వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నెట్‌వర్క్‌లలోకి చైనా హ్యాకర్‌ మూకలు మాల్‌వేర్‌ను చొప్పించిన విషయం వెలుగులోకి రావడం ఆందోళన కలిగించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్‌ బాట పడుతున్నాయి. బ్యాంకులు, బీమా, ఆస్పత్రులు వంటి అన్ని కీలక రంగాల సమాచారం డిజిటల్‌ రూపంలోకి మారుతోంది. అందువల్ల సైబర్‌ భద్రత పరంగా అన్ని స్థాయుల్లో పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.

సైబర్‌ నేరగాళ్ల బారిన పడి బ్యాంకు ఖాతా ఖాళీ అయితే ఎవరిని సంప్రదించాలన్నదానిపై సామాన్యులకు కనీసం అవగాహన లేదు. ఒకవేళ ఫిర్యాదుచేస్తే సమస్యకు ఎన్నిరోజుల్లో పరిష్కారం లభిస్తుందన్నదానిపై స్పష్టత కొరవడింది. నెట్‌వర్క్‌ సరిగ్గా లేక నగదు చెల్లింపు స్తంభించి, ఆ ధనం కొన్ని రోజుల వరకూ తిరిగి అకౌంట్లలోకి రాక ఎంతోమంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సైబర్‌ మోసాల విషయంలో బ్యాంకులు సరిగ్గా స్పందించడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరోవైపు రాన్సమ్‌వేర్‌ దాడులవల్ల తమ కంప్యూటర్‌, సర్వర్లలో కీలకమైన సమాచారాన్ని పోగొట్టుకుంటున్న వారెందరో ఉంటున్నారు. హ్యాకర్లు కోరినంత డబ్బు చెల్లిస్తే తప్ప ఆ సమాచారాన్ని తిరిగి పొందడం సాధ్యం కావడంలేదు. అంత పెద్దమొత్తాన్ని చెల్లించలేక డేటాపై ఆశలు వదిలేసుకుంటున్న వారూ కోకొల్లలు.

సమన్వయం అవసరం

సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని, మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ప్రలోభపెట్టే మోసాలూ భారీగానే చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ పేరిట పుట్టుకొస్తున్న ఎన్నో నకిలీ యాప్‌లు అందినకాడికి దండుకుంటున్నాయి. పెట్టుబడిపై పదిరోజుల్లోనే రెట్టింపు లాభాన్ని ఆయా యాప్‌లు చూపిస్తున్నాయి. దాంతో అప్పులు తెచ్చి మరీ లక్షల రూపాయలు ఆ యాప్‌లలో పోస్తున్నారు. వాటిలో కేవలం సంఖ్య మాత్రమే కనిపిస్తుందని, ఆ నగదును తీసుకోవడం(విత్‌డ్రా) సాధ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించేసరికి చాలా ఆలస్యమైపోతోంది. పుంఖానుపుంఖంగా పుట్టుకొచ్చిన రుణ యాప్‌లు నిరుడు చాలామంది ఉసురు తీశాయి. భారత్‌లో సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు పటిష్ఠ వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఆ మోసాలపై ఫిర్యాదు చేయడానికి ‘సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో వెలుగుచూసే నేరాల సరళిని పరిశీలిస్తూ వివిధ దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర హోం శాఖపై ఉంది. బాధితులకు నిర్దిష్ట కాల వ్యవధిలో న్యాయం జరిగేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందాలి. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా మార్గాల్లో సైబర్‌ మోసాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. తమను ఎవరూ పట్టుకోలేరన్న ధీమా సైబరాసురులు పదేపదే నేరాలకు పాల్పడేలా చేస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేలా సైబర్‌ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎటువంటి భయాలూ లేకుండా సామాన్యుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోగలిగిన నాడే నిజమైన డిజిటల్‌ ఇండియా సాకారం అవుతుంది.

చైనా మూలాలు

కరోనా తరవాత భారత్‌లో పెరిగిన సైబర్‌ నేరాల్లో చైనా పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ దేశం హ్యాకింగ్‌ ముఠాలకు కొమ్ముకాస్తోంది. భారతీయ నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించి సమాచారాన్ని తస్కరించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, భారతీయ యువతను ప్రలోభాలకు గురిచేయడం, బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడం వంటి దురాగతాలకు ఊతం ఇస్తోంది. గతేడాది సెప్టెంబరులో వెలుగుచూసిన కలర్‌ ప్రెడిక్షన్‌ గేమ్‌ భారతీయ యువత నుంచి ఏకంగా రూ.1100 కోట్లు కొల్లగొట్టింది. దీనికి మూలాలు చైనావే. జీవితాలతో జూదమాడే ఇటువంటి ఎన్నో ఆన్‌లైన్‌ ఆటలు, యాప్‌లు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎంతోమంది వాటి బారినపడి జేబులు గుల్లచేసుకుంటున్నారు. డ్రోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, బిగ్‌ డేటా, కృత్రిమమేధ వంటివి విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తరుణంలో సైబర్‌ నేరాలు పోనుపోను మరింతగా పెచ్చరిల్లే ప్రమాదం ఉంది.

- నల్లమోతు శ్రీధర్‌

(సైబర్‌, సాంకేతిక వ్యవహారాల నిపుణులు)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేలిమి విద్యే దేశానికి పెన్నిధి

‣ ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం

‣ చైనాపై అమెరికా దూకుడు

‣ మళ్ళీ జిన్‌పింగ్‌దే సింహాసనం

Posted Date: 01-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం