• facebook
  • whatsapp
  • telegram

అమ్ముల పొదిలో కృత్రిమ మేధ

రేపటి యుద్ధాల్లో విజయానికి కృత్రిమ మేధ (ఏఐ) కీలకం. ఈ అంశాన్ని ప్రధాన దేశాలు ఇప్పటికే గ్రహించాయి. ఏఐ రంగంలో నాయకులయ్యేవారే ప్రపంచానికి అధినాయకులవుతారని రష్యా అధినేత పుతిన్‌ 2017లోనే ఉద్ఘాటించారు. 2030కల్లా ఏఐలో అగ్రస్థానానికి దూసుకుపోతామని చైనా గతంలోనే లక్ష్య ప్రకటన చేసింది. జాతీయ భద్రతలో దీని ప్రాధాన్యాన్ని అమెరికా చాన్నాళ్లక్రితమే గుర్తించింది. భారత్‌ సహా దాదాపు 30 దేశాలు జాతీయ వ్యూహాలను ప్రకటించాయి.

అమెరికా, బ్రిటన్‌, చైనా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, ఇండియా వంటి దేశాలు ఏఐ పరిశోధన, అభివృద్ధి కోసం గణనీయంగా మానవ వనరులను, పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు అమెరికాకు చెందిన బ్రూకింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ వెల్లడించింది. వాణిజ్య, ప్రైవేటు రంగాల్లో ఏఐ వినియోగంపై 2018లోనే నీతి ఆయోగ్‌ జాతీయ వ్యూహ ప్రకటన చేసింది. రక్షణ రంగంలో ఏఐ వినియోగంపై భారత్‌ ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టినా- పెట్టుబడులు, స్వదేశంలో పరిశోధనలు, ఇతర దేశాలతో సహకారం విషయంలో వడివడిగా అడుగులు వేసింది. రక్షణ రంగ ఏఐ మండలి (డీఏఐసీ), రక్షణ  రంగ ఏఐ ప్రాజెక్టు ఏజెన్సీ (డీఏఐపీఏ)లను స్థాపించి కృత్రిమ మేధ ప్రాజెక్టులకు ఏటా బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయిస్తోంది. తాజాగా 2023-24 బడ్జెట్‌లో కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖకు రూ.16,361 కోట్లు కేటాయించారు. ఇది అంతకుముందు సంవత్సర బడ్జెట్‌ కేటాయింపులకన్నా ఎక్కువే. ఏఐ పరిశోధనలకు బడ్జెట్‌ కేటాయింపులు కొత్త ఊతమిస్తాయి. కొన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ పరిశోధనలకు ఉత్కృష్ట కేంద్రాలను నెలకొల్పాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది.

సాయుధ బలగాల్లో వినియోగం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఇతర దేశాలతో ద్వైపాక్షిక, బహుళ పక్ష సహకార ప్రాజెక్టులు చేపట్టడానికి 2020లో భారత్‌ వినూత్న, వ్యూహపరమైన సాంకేతికతల విభాగాన్ని ప్రారంభించింది. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో క్వాడ్‌ కూటమిగా ఏర్పడినందువల్ల ఈ దేశాల మధ్య వ్యూహపరమైన సహకారం పెరుగుతోంది. కృత్రిమ మేధ వంటి అత్యధునాతన సాంకేతికతలలో భారత్‌తో సహకార వృద్ధికి చర్యలు తీసుకోవాలని 2020లోనే అమెరికా జాతీయ భద్రతా కమిషన్‌ సిఫార్సు చేసింది. 2022 క్వాడ్‌ శిఖరాగ్ర సభ ఏఐ రంగంలో సహకార వృద్ధికి పిలుపిచ్చింది. అదే సంవత్సరం జూన్‌లో భద్రత, సాంకేతిక రంగాలలో సహకారం గురించి భారత్‌, జపాన్‌ చర్చించుకున్నాయి. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి రంగాల్లో సంయుక్తంగా కృషి చేయాలని భారత్‌, ఫిన్లాండ్‌ నిశ్చయించాయి.

భావి యుద్ధాల్లో శత్రువు మీద పైచేయికి ఏఐ కీలకమవుతుందని గ్రహించిన భారతదేశం త్రివిధ సాయుధ దళాల్లో కృత్రిమ మేధను పెద్దయెత్తున ఉపయోగించాలని భావిస్తోంది. ఈ మేరకు 2022 ఆగస్టులో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భవిష్య ప్రణాళికను ఆవిష్కరించారు. 2024కల్లా రక్షణ కోసం ప్రత్యేకించిన 25 ఏఐ ఉత్పత్తులను సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రైవేటు రంగంతో కలిసి భారత సైన్యం ఏఐ సామర్థ్యాన్ని పెంచుకొంటోంది. మానవ రహిత విమానాలు, మానవ చోదకులు లేకుండా అన్ని ప్రదేశాల్లో తిరిగే భూతల వాహనాలు, రోబోలు, బ్లాక్‌చెయిన్‌ ఆధారిత ఆటొమేషన్‌, నియంత్రణ, నిఘా వ్యవస్థలు, స్వయంచాలిత ఆయుధ వ్యవస్థల రూపకల్పనకు భారత రక్షణ దళాలు నడుంకట్టాయి. 2022 జులైలో రక్షణ శాఖ 75 ఏఐ ఆధారిత వ్యవస్థలను ఆవిష్కరించింది. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో 140 ఏఐ సెన్సర్‌ వ్యవస్థలను ఏర్పాటుచేసింది. లద్దాఖ్‌ పర్వతాలు, రాజస్థాన్‌ ఎడారుల్లో కృత్రిమ మేధ సాయంతో తిరిగే మానవ రహిత నిఘా వాహనాలను త్వరలోనే పరీక్షించనున్నది. ఇవి సైనికులకు సరకులు, ఆయుధాలను కూడా బట్వాడా చేయగలవు. భారత నౌకాదళం కొత్తగా మోహరించే ఆయుధాల్లో ఏఐ అంతర్భాగమవుతుంది.

పోరాట సామర్థ్యం పెంచేందుకు...

భారత నౌకాదళం ఇప్పటికే 30 ఏఐ ప్రాజెక్టులను చేపట్టింది. జామ్‌నగర్‌లోని ఐఎన్‌ఎస్‌ వాల్సురా నౌకాదళ శిక్షణ కేంద్రాన్ని ఏఐ ఉత్కృష్ట కేంద్రంగా ప్రకటించింది. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ కేంద్రం (సీఏఐఆర్‌), భారత నౌకాదళం, భారత్‌ ఎలెక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కలిËసి సముద్రాల్లో స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలిపేలా స్వయంచాలిత సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థను రూపొందించాయి. నౌకాదళ ప్రధాన కార్యాలయం నుంచి సముద్రంలోని ప్రతి నౌకకు సందేశాలు పంపడానికి తోడ్పడే వ్యవస్థ ఇది. ఏఐ, రోబోటిక్స్‌ వంటి అధునాతన సాంకేతికతలలో నౌకా దళ సిబ్బందికి ఐఐటీలలో, నౌకాదళ శిక్షణ సంస్థల్లో తర్పీదు ఇస్తున్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత వైమానిక దళం కూడా వేగంగా పరుగు ప్రారంభించింది. ఏఐతో యుద్ధ విమానాల పోరాట సామర్థ్యం పెంచడానికి నడుంకట్టింది. ఉడాన్‌ (యూనిట్‌ ఫర్‌ డిజిటైజేషన్‌, ఆటొమేషన్‌, ఏఐ, అప్లికేషన్‌ నెట్‌వర్కింగ్‌) పేరిట ఉత్కృష్ట కేంద్రాన్ని నిరుడు ప్రారంభించారు. ఏఐతో ప్రతి పైలట్‌ పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి వైమానిక సేన శిక్షణ, మౌలిక వసతులను నెలకొల్పింది! చైనా సైనికపరంగా ఏఐ రంగంలో ముందడుగు వేయడం భారత్‌ను కలవరపరుస్తోంది. మానవ పైలట్లు నడిపే యుద్ధ విమానాలను వేగంగా ఎదుర్కోగల మానవ రహిత విమానాలను చైనా సిద్ధం చేస్తోంది. వాటికి ఏఐ సాయంతో శిక్షణ ఇస్తున్నది. చైనా ఈ విషయంలో అమెరికాకన్నా ముందున్నది. భావి పోరాటాలకు ఏఐని వినియోగించే పోటీలో భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకబడకూడదు. చైనాలో హైస్కూల్‌ నుంచే ఏఐని బోధిస్తున్నారు. డిగ్రీ స్థాయిలో దీనికి అక్కడ విపరీతమైన గిరాకీ ఉంది. విద్యార్థులకు, కార్మిక బలగానికి కృత్రిమ మేధా నైపుణ్యాలను అలవరచడానికి భారత్‌ కూడా తక్షణం వివిధ కార్యక్రమాలు చేపట్టాలి.

అంకురాలకు ప్రోత్సాహం

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన విభాగాలన్నీ ఏఐ సాంకేతిక బృందాలను నెలకొల్పాయి. తమ ఉత్పత్తుల్లో ఏఐ సాంకేతికతలను అంతర్భాగంగా మార్చే ప్రయత్నమిది. డీఆర్‌డీఓ ప్రయోగశాలలు, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ కేంద్రం (సీఏఐఆర్‌), డీఆర్‌డీఓ యువ శాస్త్రవేత్తల ప్రయోగశాల, కాగ్నిటివ్‌ టెక్నాలజీ కేంద్రం ఏఐలో నూతన ఆవిష్కరణలను సాధించడానికి, వాటి అన్వయానికి కృషి చేస్తున్నాయి. సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో కృత్రిమ మేధ వినియోగానికి సీఏఐఆర్‌ 2019 జనవరిలో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. అనేక ఏఐ అంకుర సంస్థలను ప్రోత్సహిస్తూ, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు కార్యశాలలు నిర్వహిస్తోంది. రక్షణ శాఖకు చెందిన అధునాతన సాంకేతికతల సంస్థ ఏఐలో కోర్సులను అందిస్తోంది. ఈ రంగంలో రక్షణ శాఖ విద్యాసంస్థలు, పరిశ్రమల సమన్వయంతో సాగుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొత్త బడ్జెట్‌... కోటి ఆశలు!

‣ కేంద్ర బడ్జెట్‌ 2023-24

‣ కేంద్ర సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ ఆర్థిక వృద్ధికి చుక్కాని అవుతుందా?

Posted Date: 17-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం