• facebook
  • whatsapp
  • telegram

బిగుసుకుంటున్న రుణపాశాలు

అప్పుల ఊబిలో భారతీయ కుటుంబాలు

కొవిడ్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజల ఆదాయాలు చాలా మేరకు కోసుకుపోయాయి. ఇటువంటి గడ్డు రోజుల్లోనూ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌, ఫర్నిచర్‌ వంటి మన్నికైన వినియోగ వస్తువుల అమ్మకాలు మాత్రం పెద్దగా తగ్గలేదు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో దాదాపు రెండు కోట్లమంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అనేక వ్యాపారాలు మూతపడి భారీ ఉపాధి నష్టం సంభవించింది. అయినా చిత్రంగా బ్యాంకు డిపాజిట్లు పెరుగుతున్నాయి. బహుశా అప్పు చేసి మరీ వినియోగ వస్తువులు కొనేవారు ఎక్కువ కావడంతో వాటి అమ్మకాలు పెరుగుతుండవచ్చు. గడచిన మూడేళ్లలో ఆర్థిక ప్రగతికి రుణాలు చోదకశక్తిగా పనిచేసిన మాట వాస్తవం. కరోనా కష్టకాలంలోనూ అదే ఉపాయం పనిచేయకపోవచ్చు. బ్యాంకులకు, విధాన కర్తలకు ఇది ఆందోళనకర పరిణామం. కరోనా సంక్షోభం దేశ ప్రజల మధ్య ఆదాయ అసమానతలను మరింత ఎగదోస్తోందని, కరోనా తరవాత ఆర్థికాభివృద్ధి రేటు మళ్ళీ పుంజుకొన్నా దాని ఫలితాలు కొద్దిమందికే దక్కుతాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు ఇటీవల హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభం నుంచి భారత్‌ బయటపడి ఉత్పత్తి మళ్ళీ గాడిన పడటానికి మరో మూడేళ్లు పడుతుందని అంచనా వేశారు.

అయిదేళ్లలో పెరిగిన జోరు

దేశంలో గడచిన 15 ఏళ్లలో సంభవించిన ఆర్థిక విజృంభణకు పాలకులు, వ్యాపారస్తులు, కుటుంబాలు భారీగా అప్పులు చేసి ఖర్చు పెట్టడమే ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థ జోరు మీదున్నప్పుడు ఈ అప్పుల గురించి కలవరపడనక్కర్లేదు. ఆర్థిక మందగమనంలో మాత్రం అప్పులు తిప్పలు తెచ్చిపెడతాయి. 2017 నుంచి జరుగుతున్నది అదే. 2020 నుంచి కరోనా వల్ల పరిస్థితి తీవ్రతరమైంది. అసలు 2010 నుంచే కుటుంబాలు అప్పుల పాలవడం మొదలై, గత అయిదేళ్లలో పరిస్థితి బాగా ముదిరింది. 2010 నుంచి సులభ రేట్లపై అప్పులు ఇచ్చే సంస్థలు ఎక్కువైనందువల్ల వ్యక్తులు, కుటుంబాలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. 1990-91 మధ్య బ్యాంకులు కుటుంబాలకు రుణాలిచ్చేవి కావు. అప్పట్లో మొత్తం బ్యాంకు రుణాలు రూ.1.18 లక్షల కోట్లు మాత్రమే. కానీ 1990-91 మొదలుకొని 2015-16 వరకు ప్రతి అయిదేళ్లకు ఒకసారి బ్యాంకులు ఇచ్చే రుణాలు రెట్టింపు కాసాగాయి. 2015-16లో రూ.66.50 లక్షల కోట్లుగా ఉన్న ఈ రుణాలు 2020-21 నాటికి రూ.97.23 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులు మొట్టమొదటిసారిగా 1993-94లో రూ.57.81 కోట్ల మేరకు గృహ రుణాలు ఇచ్చాయి. 2000-2001 నుంచి గృహ రుణాలకు బడ్జెట్లో పన్ను రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ తరహా రుణ వితరణ పెద్దయెత్తున పెరిగిపోయింది. వ్యక్తిగత రుణాలదీ అదే వరస. 1999-2000లో మొత్తం బ్యాంకు రుణాలు నాలుగు లక్షల కోట్ల రూపాయల్లో వ్యక్తిగత రుణాలు- రూ.516 కోట్లు. అదే 2011-12కు వచ్చేసరికి మొత్తం బ్యాంకు రుణాలు రూ.43.79 లక్షల కోట్లకు పెరగ్గా, అందులో వ్యక్తిగత రుణాల వాటా రూ.7.5 లక్షల కోట్లకు చేరింది. 2021 మార్చి నాటికి మొత్తం బ్యాంకు రుణాలు రూ.97.23 లక్షల కోట్లయితే, అందులో రూ.26.68 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే. వీటిలో గృహ రుణాలూ కలిసే ఉన్నాయి. పైన చెప్పుకొన్న కాలంలో మొత్తం బ్యాంకు రుణాలు 2.2 రెట్లు పెరిగితే వ్యక్తిగత రుణాలు 3.5 రెట్లు పెరిగాయి. 2021 మార్చికల్లా మొత్తం బ్యాంకు రుణాలు రూ.97.23 లక్షల కోట్లలో గృహ రుణాల వాటా రూ.14.59 లక్షల కోట్లు. భారత్‌లో బంగారంపై తాకట్టు రుణాలూ గణనీయంగా పెరిగాయని ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడించింది. 2021 మార్చినాటికి ఈ తరహా రుణాలు రూ.4.05 లక్షల కోట్లకు చేరతాయని అంచనా కట్టింది. వీటిలో బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చే రుణాలే ఎక్కువ. ఇవి కాకుండా క్రెడిట్‌ కార్డు, విద్యా రుణాల భారాన్ని కూడా భారతీయ కుటుంబాలు మోస్తున్నాయి. క్రెడిట్‌ కార్డులపై రూ.1.16 లక్షల కోట్ల మేరకు అప్పులు చేయగా, విద్యా రుణాలు రూ.63.805 కోట్లకు, వినియోగ వస్తు కొనుగోలు రుణాలు రూ.7,300 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, తాకట్టు వ్యాపారుల నుంచీ కుటుంబాలు అప్పులు తీసుకుంటున్నాయి.

వడ్డీ రేట్లు తగ్గిస్తే మేలు

గడచిన దశాబ్దంలో బ్యాంకులు ఉదారంగా రుణాలివ్వడం వల్ల కుటుంబాలు పెద్దయెత్తున వస్తుసేవలపై ఖర్చు చేశాయి. వినియోగ సంస్కృతి విజృంభించింది. కరోనా మొదటి దశ, రెండో దశ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌లు, ఆదాయ నష్టం వల్ల పాత అప్పులు తీర్చలేని స్థితి దాపురించింది. ఈ సందర్భంలో రుణమాఫీ కోసం రాజకీయ డిమాండ్లు వచ్చే అవకాశమున్నా, ప్రభుత్వం వాటిని ఆమోదిస్తే బ్యాంకింగ్‌ రంగానికి జరిగే నష్టం అంతాఇంతా కాదు. అది దేశ ఆర్థిక ప్రగతిని కుంగదీస్తుంది. దీని బదులు గృహ రుణాల చెల్లింపు కాలావధిని మార్చడం మంచిది. వీలైతే వడ్డీ రేట్లు తగ్గించే విషయాన్ని ఆలోచించాలి. అన్నింటినీ మించి పౌరులపై పరోక్ష పన్నులు పెంచేసి ఆదాయం పిండుకునే పద్ధతిని కేంద్ర, రాష్ట్రాలు విడనాడాలి. ప్రజలపై పన్నులు వేస్తే తప్ప సంక్షేమానికి కావాల్సిన నిధులు సమకూర్చుకోలేమని ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే- బాగా ఆదాయం ఉన్నవారే ఎక్కువ ఖర్చుపెడతారు. వస్తుసేవల కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వానికి పన్నులు కడతారు. ఆదాయం కోల్పోయినప్పుడు వారి కొనుగోళ్లూ తగ్గుతాయి. అది పన్నుల ఆదాయానికి కోత పెడుతుంది. ఫలితంగా అన్ని వర్గాలూ నష్టపోతాయి.

కొవిడ్‌ తెచ్చిపెట్టిన కష్టాలు

కొవిడ్‌ మహమ్మారి కుటుంబాలను తీవ్ర కష్టనష్టాల పాల్జేసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. అసలు ఇప్పటికే మన దేశంలో తమ అర్హతలకు సరితూగని ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ. ఉపాధి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ తలకిందులవడం వల్ల బ్యాంకింగ్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రస్తుతం దేశీయంగా సగటు వ్యక్తిగత రుణం రూ.15 లక్షలుగా ఉంది. కుటుంబాలు అప్పులపాలవడం వల్ల గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాల కిస్తీలను క్రమం తప్పకుండా వసూలు చేసుకోవడం బ్యాంకులకు కష్టతరమవుతుంది. రుణభారం వల్ల కుటుంబాలు ఖర్చులను తగ్గించుకోవడంతో వస్తుసేవలకు గిరాకీ తగ్గి ఉత్పత్తి పడిపోతుంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది.

Posted Date: 24-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం