• facebook
  • whatsapp
  • telegram

గగనతల రక్షణలో కొత్త అధ్యాయం

భారత అమ్ములపొదిలో ఎస్‌-400

గగనతలాన్ని దుర్భేద్యంగా మార్చేందుకు భారత్‌ కొత్త ఆయుధ వ్యవస్థను సమకూర్చుకుంది. ఇండియా అమ్ముల పొదిలో ‘ఎస్‌-400 ట్రయాంఫ్‌’ గగనతల రక్షణ వ్యవస్థ చేరింది. దీనితో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఆధిపత్యానికి గండిపడనుంది. భారత వైమానిక దళ స్థావరాలతో పోలిస్తే డ్రాగన్‌వి భౌగోళికంగా బాగా ఎత్తులో ఉన్నాయి. సహజంగా ఎత్తు ప్రదేశాల్లో ఆక్సిజన్‌ తక్కువగా ఉండటంతో, యుద్ధ విమానాల ఇంజిన్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి చైనా రాకెట్‌ఫోర్స్‌ను లద్దాఖ్‌కు తరలించింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్‌-400ను కూడా అక్కడికి చేర్చింది. ఈ వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరంలోని విమానాలు, రాకెట్లను గుర్తించి, 400 కిలోమీటర్ల దూరంలోనే కూల్చివేయగలదు. ఫలితంగా భారత విమానాలు దాని దృష్టి నుంచి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. 2018లో భారత్‌ కొనుగోలు చేసిన ఎస్‌-400 వ్యవస్థలు ఇటీవలే అందుబాటులోకి రావడం మొదలైంది. ఫలితంగా ఎల్‌ఏసీ వద్ద డ్రాగన్‌ ఆధిపత్యానికి గండిపడి భారత్‌ది పైచేయి కానుంది. ఎందుకంటే, చైనా క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌)లో భాగస్వామి కాదు. అందువల్ల డ్రాగన్‌ వాడే ఎస్‌-400లకు రష్యా అధికారికంగా 300 కిలోమీటర్ల రేంజికి మించిన క్షిపణులను సరఫరా చేయకూడదు. ఎంటీసీఆర్‌ సభ్యదేశం కావడంతో భారత్‌కు ఆ ఇబ్బంది లేదు.

సామర్థ్యం మెరుగుదల

కొత్త వ్యవస్థతో సుదూరాల్లో శత్రువుల కదలికలను మందగింపజేసి, వివాదాస్పద ప్రదేశంలోకి ప్రవేశించిన ప్రత్యర్థుల్ని నిలువరించే సామర్థ్యం భారత్‌కు మెరుగు పడుతుంది. గగనతలంలో దూసుకొచ్చే ముప్పులను పసిగట్టేందుకు పాకిస్థాన్‌ వద్ద దాదాపు తొమ్మిది అవాక్స్‌ నిఘా విమానాలు ఉన్నాయి. భారత్‌ వద్ద ఆ స్థాయిలో అవాక్స్‌లు లేవు. ఫలితంగా ఎస్‌-400 రాకతో భారత సరిహద్దులకు 600 కిలోమీటర్ల సమీపానికి నిఘా విమానాలు పంపేందుకు పాక్‌ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా నియంత్రణ రేఖ వద్ద భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్‌-400ను మిగిలిన క్షిపణి రక్షణ వ్యవస్థలతో అనుసంధానించే అవకాశం ఉండటం మనకు కలిసివచ్చే అంశం. ప్రస్తుతం భారత్‌ బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ, పృథ్వీ గగనతల రక్షణ వ్యవస్థలను దీనికి అనుసంధానించే అవకాశాలు ఉన్నాయి. గగనతల రక్షణ బాధ్యతలు చూసుకొనే భారత వైమానిక సేనకు 42 స్క్వాడ్రన్లు అవసరం; ప్రస్తుతం దాదాపు 30 మాత్రమే  ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ఈ సంఖ్య 35కు పెరగవచ్చని వైమానిక దళాధిపతి వీఆర్‌చౌధరి అక్టోబరులో వెల్లడించారు. ఇప్పటికిప్పుడు భారీయెత్తున యుద్ధ విమానాలు కొనుగోలు చేసే పరిస్థితి లేనందువల్ల అయిదు ఎస్‌-400 వ్యవస్థలు యుద్ధవిమానాల కొరతను అంతగా కనిపించనీయకపోవచ్చు.

గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకొన్నదన్న వాస్తవం ఇటీవల హమాస్‌- ఇజ్రాయెల్‌ పోరులో వెల్లడైంది. బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించాక వాటి వార్‌హెడ్లు వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యంపై పడే క్రమంలో, శబ్దం కంటే కొన్ని రెట్లు అధిక వేగాన్ని అందుకొంటాయి. ఆ సమయంలో గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడం చాలా కష్టం. ఎస్‌-400లో ఈ సమస్యను పరిష్కరించేందుకు రష్యా ప్రస్తుతం 77ఎన్‌6 క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. రష్యా కూడా సిరియా యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు ఎస్‌-400లను వాడకపోవడం గమనార్హం. అందుకని, ఆయుధాలు అమ్ముకొనేందుకు ఆయా దేశాల ప్రచారాలను పూర్తిగా నమ్మకూడదనేందుకు అమెరికా ‘పేట్రియాట్‌’ ప్రచారమే ఓ ఉదాహరణ. 1991లో ఇరాక్‌ నుంచి ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన స్కడ్‌ క్షిపణులను తమ పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు అమెరికా ప్రచారం చేసుకొన్నా, అది వాస్తవం కాదని ఆ తరవాత వెల్లడైంది.

ఆంక్షలు విధించే అవకాశం

గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం, తదితర కారణాలతో రష్యాను అగ్రరాజ్యం ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. రష్యా ఆయుధ విక్రయాలు, నిఘా కార్యకలాపాల ద్వారా నిధులను సమకూర్చుకోనీయకుండా చేయడం దీని లక్ష్యాల్లో ఒకటి. భారత్‌ ఎస్‌-400 కొనుగోలుతో ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చింది. ‘రక్షణ పరికరాల కొనుగోళ్ల బోర్డు’ ఈ ఆంక్షల పరిధిలోకి రావచ్చు. అమెరికా కాట్సా చట్టంలోని సెక్షన్‌ 235 ప్రకారం 12 రకాల ఆంక్షలు విధించడానికి అవకాశం ఉంది. వీటిలో 10 ఆంక్షలు భారత్‌ అమెరికా, భారత్‌ రష్యా సంబంధాలపై నామమాత్రపు ప్రభావం చూపుతాయి. వీసా తిరస్కరణలు, అమెరికా నుంచి రుణాలు లభించకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. మిగిలిన రెండు రకాల్లో- భారత్‌, రష్యా మధ్య బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పరిమితులు విధించవచ్చు. ఇదే జరిగితే ఆయుధ కొనుగోళ్లకు చెల్లింపులు కష్టతరమవుతాయి. ‘ఎగుమతుల ఆంక్ష’గా పిలిచే 235(ఎ)(2) మాత్రం భారత్‌, అమెరికా సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. భారత్‌కు ద్వంద్వ వినియోగ సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, అణు శక్తి పరికరాల సరఫరాలను నియంత్రిస్తుంది. మిగిలిన ఎగుమతులకు కూడా వేర్వేరుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా ప్రయోజనాల సాధనకు అవసరమైన మిత్రదేశానికి మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రకమైన మినహాయింపు లభించవచ్చని భారత్‌ ఆశిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా దళాల మోహరింపు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇదే అదనుగా రష్యా-భారత్‌ సంబంధాలను బలహీనపరచేలా అమెరికా కాట్సా ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. భారత్‌పై ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రాధాన్యాలే కీలకం. ట్రంప్‌ ఆధ్వర్యంలో జీవం పోసుకొన్న ‘క్వాడ్‌ కూటమి’ స్థాయిని వీలైనంత తగ్గించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల ‘ఆకస్‌’ ఒప్పందం. అమెరికా ప్రపంచ స్థితి సమీక్షలో భారత్‌ లేదా క్వాడ్‌ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు భారత్‌ను ‘కఠిన ఆంక్షల’ పరిధిలోకి తీసుకురావడం ద్వారా క్వాడ్‌ను దెబ్బతీశారన్న అప్రతిష్ఠను బైడెన్‌ మూటగట్టుకోకపోవచ్చన్న అభిప్రాయాలు లేకపోలేదు.

పరిమితులపై ఆందోళన

ప్రపంచంలో ప్రతి ఆయుధానికి ప్రత్యేక బలంతోపాటు, బలహీనతలూ ఉంటాయి. ఎస్‌-400 దీనికి మినహాయింపేమీ కాదు. దీన్ని రష్యా ఎస్‌-300కు ఆధునిక రకంగా అభివృద్ధి చేసింది. సిరియాలో ఎస్‌-300 రాడార్లు ఇజ్రాయెల్‌ క్షిపణులను గుర్తించడంలో విఫలమయ్యాయి. ఇక అర్మీనియాతో జరిగిన యుద్ధంలో పలు ఎస్‌-300 వ్యవస్థలపై తమ డ్రోన్లు దాడి చేసినట్లు అజర్‌బైజాన్‌ ఆధారాలతో సహా ప్రకటించింది. తక్కువ ఎత్తులో వచ్చే క్షిపణులు, డ్రోన్లతో గగనతల రక్షణ వ్యవస్థలకు ముప్పే. టర్కీ తయారు చేసిన బేరక్తర్‌ డ్రోన్లలో గగనతల రక్షణ వ్యవస్థల్ని కళ్లుగప్పే ఎలెక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలు ఉన్న విషయం భారత్‌ గుర్తుంచుకోవాలి. ఈ డ్రోన్ల కొనుగోలుకు పాక్‌ తీవ్ర యత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్‌, అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆయుధ వ్యవస్థలను ఎస్‌-400తో అనుసంధానించడం అంత తేలిక కాదు.

- పెద్దింటి ఫణికిరణ్‌  
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వనరుల పరిరక్షణ ప్రాణావసరం

‣ అసమానతల భారతం

‣ చేనేతకు మరణశాసనం

Posted Date: 28-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం