‣ వ్యాధి నిర్ధారణ, చికిత్సల్లో దీటైన పాత్ర
కుటుంబ సంక్షేమంతోపాటు దేశార్థికానికీ ప్రజారోగ్యం ఎంత కీలకమో కరోనా వైరస్ చాటిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, వైద్య సహాయ సిబ్బంది, ఆస్పత్రి పడకల కొరతను; ఇతర మౌలిక వసతుల లేమిని కొవిడ్ బట్టబయలు చేసింది. ప్రతి వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ చొప్పున ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. భారత్లో ప్రతి 1456 మంది జనాభాకు ఒక వైద్యుడు ఉన్నారని 2019-20 ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024కల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సును నెరవేర్చాలని సంకల్పిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ కె.పాల్ నిరుడు ప్రకటించారు. దేశంలో సగటున ప్రతి వెయ్యి జనాభాకు 0.55 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రతి 670 మంది జనాభాకు ఒక నర్సు మాత్రమే ఉంది. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ (ఏఐ) ఎంతో తోడ్పడనుంది. ఏఐని విస్తృతంగా వినియోగిస్తే 2023నాటికే ప్రతి వెయ్యి జనాభాకు ఏడుగురు వైద్యుల సేవలు అందించవచ్చునని ఒక అధ్యయనం తెలిపింది.
అపార సమాచారం ముడిసరకుగా....
ఆరోగ్య రంగంలో ఏఐ సరికొత్త విప్లవం తీసుకొస్తుందని గట్టిగా చెప్పవచ్చు. రోగుల రికార్డులు, ఎక్స్రే, సీటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, రక్త పరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ, శరీరంపై ధరించగల (వేరబుల్) పరికరాలు అందించే సమాచారం (డేటా)... ఈ విప్లవానికి బాటవేస్తుంది. కోట్ల జనాభా ఆరోగ్య సమాచారాన్ని మెరుపు వేగంతో విశ్లేషించి, వ్యక్తిగత చికిత్సా విధానాలను సిఫార్సు చేసి అమలులోకి తెచ్చే సత్తా ఏఐకి ఉంది. రానున్న 20 ఏళ్లలో వైద్యులకన్నా మిన్నగా రోగ నిర్ధారణ చేసే సామర్థ్యాన్ని ఏఐ సంతరించుకొంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని గ్రహించినందువల్లే కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబరునుంచే ఆయుష్మాన్ భారత్-డిజిటల్ ఆరోగ్య పథకం కింద అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ప్రభుత్వ నిర్వహణలోని ప్రయోగశాలలు, ఔషధ శాలలు, రేడియాలజీ సెంటర్లు, చికిత్సా కేంద్రాలను తమ దగ్గరున్న సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు సైతం స్వచ్ఛందంగా తమ దగ్గరున్న సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తోంది. ఇలా అందే అపార సమాచార రాశిని ఏఐ ముడిసరకుగా ఉపయోగించుకుని కచ్చితంగా రోగ నిర్ధారణ చేయగలుగుతుంది. కొత్త మందులు, చికిత్సా విధానాలు, పరిశోధనలు, ప్రయోగాలకు మార్గదర్శనం చేస్తుంది. మెదడులో కణితులు, నేత్ర వ్యాధులు, రొమ్ము, ఊపిరితిత్తి, చర్మ క్యాన్సర్లను ముందుగానే కనిపెట్టడంలో వైద్యులకన్నా ఏఐ మిన్నగా నిలవబోతోంది. అసలు భవిష్యత్తులో కుటుంబ వైద్యుడి స్థానాన్ని ఏఐ వైద్యం ఆక్రమిస్తుందని అంచనా. మొదట వైద్యులకు సహాయ సాధనంగా నిలిచి, తరవాత వైద్యులు లేని చోట్ల తానే చికిత్సా పద్ధతులను సిఫార్సు చేసే స్థాయికి ఏఐ ఎదుగుతుంది. ఏఐ అసిస్టెంట్ ఆల్గోరిథమ్ చేసే సునిశిత రోగ నిర్ధారణ, ప్రతిపాదించే చికిత్సా విధానాలను పరిశీలించి ఆమోదముద్ర వేయడంతో వైద్యుడి పాత్ర ముగిసి, ఏఐ పని మొదలవుతుంది. ఆపైన రోగులకు భరోసానిస్తూ వేగంగా కోలుకోవడానికి తోడ్పడటం వైద్యుడి ప్రధాన బాధ్యతగా మారవచ్చు.
అంకుర సంస్థల విస్తరణ
ఆరోగ్య రంగంలో డేటా, కృత్రిమ మేధ వినియోగం వల్ల 2025కల్లా భారతదేశ జీడీపీకి దాదాపు రూ.2.61 లక్షల కోట్ల అదనపు విలువ సమకూరుతుందని నాస్కామ్ అంచనా కట్టింది. అందుకే ఈ రంగంలోకి కొత్త పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఆరోగ్య అంకురాలు విస్తరిస్తున్నాయి. బెంగళూరులో 2016లో ప్రారంభమైన ‘నిరమై’ అంకుర సంస్థ రొమ్ము క్యాన్సర్ను ముందే గుర్తించడానికి కృత్రిమ మేధ, హైరిజల్యూషన్ థర్మల్ ఇమేజింగ్లను మేళవించి థర్మాలైటిక్స్ పరికరాన్ని ఆవిష్కరించింది. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు గీతా మంజునాథ్ రోగ నిర్ధారణలో ఉత్తమ అంకుర సంస్థ స్థాపకురాలి అవార్డు పొందారు. 2016లోనే ముంబయిలో ప్రారంభమైన ‘క్యూర్’ ఏఐ అంకుర సంస్థ ఛాతీ ఎక్స్రేలు, శిరస్సు, ఛాతీ సీటీ స్కాన్లను క్షణాల్లో పరిశీలించి రోగనిర్ధారణ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తోంది. ముంబయిలో 2015లో ప్రారంభమైన ‘ఫార్మ్ఈజీ’ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి వినియోగదారులకు మందుల దుకాణాలతో అనుసంధానం ఏర్పరుస్తోంది. దేశంలోని 1200 పట్టణాలు, నగరాల్లోని 80,000 మందుల దుకాణాలతో ఈ సంస్థ అనుసంధానం ఏర్పరచింది. బెంగళూరులో 2015లో ప్రారంభమైన సిగ్ టపుల్ అంకురం రక్తం, మూత్రం, వీర్యం, రెటీనాలను ఏఐ సాయంతో విశ్లేషించి రోగనిర్ధారణ చేస్తోంది. బెంగళూరుకు చెందిన ట్రైకాగ్- ఏఐని ఉపయోగించి ఈసీజీ, 2డి ఇకోలను వేగంగా విశ్లేషించి హృద్రోగ నిర్ధారణకు తోడ్పడుతోంది. ఈ సంస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. బెంగళూరులో వైద్యపరమైన ఏఐ అంకురాల్లోకి దాదాపు రూ.650 కోట్ల పెట్టుబడులు ప్రవహించినట్లు ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. రోగాలు వచ్చిన తరవాత చికిత్స మొదలుపెట్టడంకన్నా అసలు వ్యాధులు రాకుండా నివారించడానికి ఏఐ సాయంతో తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని ‘హెల్తిఫైమీ’ యాప్ పేర్కొంటోంది. 2012లో బెంగళూరులో స్థాపితమైన ఈ అంకురం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ‘రియా’ యాప్ను ఉపయోగించి వినియోగదారులకు ఆరోగ్యం, పోషకాహారం, వ్యాయామాలకు సంబంధించి 10 భాషల్లో సలహాలు ఇస్తోంది. పోనుపోను గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణలోనూ అగ్రగాములుగా నిలవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.
కొత్త ఔషధాల ఆవిష్కరణ
నేడు ఒక కొత్త మందు లేదా టీకాను కనుగొనడానికి ఏళ్లూపూళ్లూ పట్టడమే కాదు- సుమారు రూ.7.46 వేల కోట్ల నుంచి 14.93 వేల కోట్లదాకా ఖర్చవుతోంది. అందుకే టీకాలు, మందులపై మేధాహక్కులను వదులుకోవడానికి ఫార్మా కంపెనీలు సిద్ధంగా లేవు. మున్ముందు ఏఐ తక్కువ ఖర్చుతో వేగంగా ఔషధాలను ఆవిష్కరించడానికి తోడ్పడనుంది. నిరుడు జర్మనీకి చెందిన ఇన్సిలికో బయోటెక్నాలజీ కంపెనీ ఊపిరితిత్తులకు సంబంధించి ఐడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధికి ఏఐ సాయంతో మొట్టమొదటి మందును విడుదల చేసింది. సంప్రదాయ పద్ధతిలో ఆ మందును తయారుచేయడానికి అయ్యే వ్యయంలో కేవలం 10శాతంతోనే దాన్ని ఆవిష్కరించడానికి ఏఐ తోడ్పడింది. మానవ జన్యు క్రమాన్ని, అపార వైద్య సమాచార రాశిని ఉపయోగించి చవకగా, వేగంగా కొత్త మందులు కనుగొనడానికి ఏఐ తోడ్పడుతుంది. శస్త్రచికిత్సలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2012లో మొత్తం శస్త్రచికిత్సల్లో కేవలం 1.8శాతమే రోబోల సాయంతో జరిగాయి. 2018లో అవి 15.1శాతానికి పెరిగాయి. దెబ్బతిన్న కణజాలానికి మరమ్మతులు చేయడానికి, క్యాన్సర్ కణితులను నిర్మూలించడానికి, జన్యు లోపాలను సరిదిద్దడానికి నానో బాట్లు (సూక్ష్మ రోబోలు) రంగ ప్రవేశం చేస్తాయి.
- కైజర్ అడపా
******************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం
‣ ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.