ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లోని లోపాలను సరి చేసుకునేందుకు విశ్వవిద్యాలయాలు మరో నెల రోజులు గడువు ఇచ్చాయి. గతంలో గుర్తించిన లోపాలు సరిచేసుకొని, వివరాలు సమర్పించేందుకు ఈ గడువు విధించాయి. రాష్ట్రంలో 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. సౌకర్యాలు సరిగా లేవని, అర్హత కలిగిన అధ్యాపకులు లేరని 120 కళాశాలలకు అనుమతులు నిలిపివేశాయి. వీటిల్లో కొన్ని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ను ఫిబ్రవరి 15వరకు వాయిదా వేయగా.. లోపాలు సరి చేసుకునేందుకు కళాశాలలకు విశ్వవిద్యాలయాలు నెల రోజులు గడువు ఇచ్చాయి. ఈలోపు సమస్యలను పరిష్కరిస్తే 2022-23 కౌన్సెలింగ్ జాబితాలో పెడతామని, లేదంటే ప్రవేశాలు నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేశాయి. ఫిబ్రవరి 16 నుంచి కౌన్సెలింగ్ చేపట్టి, లోపాలు సరిచేసుకున్న అనంతరం వచ్చే వాటిని రెండో విడత కౌన్సెలింగ్లో పెట్టాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ లెక్కన బీఈడీ కౌన్సెలింగ్ పూర్తయ్యేందుకు మరో నెల రోజులకు పైగా సమయం పడుతుంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ప్రవేశాలు మాత్రం పూర్తికావడం లేదు. దీంతో విద్యార్థులు ఏడాది సమయాన్ని కోల్పోనున్నారు. అధికారులు సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు వాపోతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.