• facebook
  • whatsapp
  • telegram

TSPSC: 7.41 లక్షలు దాటిన గ్రూప్‌-4 దరఖాస్తులు

* అదనంగా మరో 141 పోస్టులు చేర్చిన టీఎస్‌పీఎస్సీ
* ప్రకటనలో 8,180కి చేరిన మొత్తం ఉద్యోగాలు


 

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-4 పోస్టులకు దరఖాస్తు చేస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనవరి 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో జనవరి 28వ తేదీ నాటికి మొత్తం 7,41,159 మంది దరఖాస్తు చేశారు. చివరి రెండు రోజులు దరఖాస్తులు పెద్దసంఖ్యలో వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచిస్తోంది. 2018లో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈసారి చివరి తేదీ నాటికి ఈ సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలకు చేరువలో ఉండవచ్చని కమిషన్‌ భావిస్తోంది. 
 
అదనంగా చేరిన బీసీ గురుకుల సొసైటీ పోస్టులు 

గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటనలో మరో 141 పోస్టులను అదనంగా టీఎస్‌పీఎస్సీ చేర్చింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో గ్రూప్‌-4 సర్వీసుల పరిధిలోకి వచ్చే 141 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రభుత్వం జనవరి 27న అనుమతి మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల సొసైటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటనలో ఇపుడున్న 8039 పోస్టులకు అదనంగా 141 ఉద్యోగాలు చేర్చుతూ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన 19/2022కు అనుబంధాన్ని జారీ చేసింది. ఈ పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్‌-4లో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో బాలుర విద్యాలయాల్లో 86 పోస్టులు, బాలికల విద్యాలయాల్లో 55 పోస్టులు ఉన్నాయి. గురుకుల బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హతగా అనుబంధంలో పేర్కొంది. ఇప్పటికే గ్రూప్‌-4 కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసినట్లు పరిగణిస్తామని కమిషన్‌ వెల్లడించింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.