ఈనాడు, అమరావతి: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అన్నారు. విద్య సమాజ మార్పునకు ఉపకరించే అత్యంత విలువైన ఆయుధమని, పరీక్షల్లో మార్కుల కంటే సృజనాత్మక ఆలోచనలు సృష్టించడమే ముఖ్యమని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంకుర సాధికారిక అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి, తీసుకొచ్చిన 52 ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో విజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించాలని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 4,776 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి, తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించడం అభినందనీయమని తెలిపారు. విశాఖ జిల్లా అగనంపూడి పాఠశాలకు చెందిన సాయి, జయంత్, నరేంద్ర బృందానికి మొదటి బహుమతి, కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి ఎస్ఎల్ఎస్ ఓరియంటల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు మల్లీశ్వరి, మేరీజ్యోస్న, రామసీతకు ద్వితీయ, చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుతర్లపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన మీనా, అతిఫా, వర్షా జట్టుకు తృతీయ బహుమతి లభించాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.