• facebook
  • whatsapp
  • telegram

ITI: ఒక్కో ఐటీఐ పరిధిలో 10 వేల మందికి శిక్షణ!

* అందుబాటులోకి రానున్న స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులు

* శిక్షణ సంస్థల ఆధునికీకరణపై రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన కమిటీ

* నివేదికపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల ఆధునికీకరణకు అడుగులు పడుతున్నాయి. కాలం చెల్లిన యంత్రాలపై కొనసాగుతున్న కోర్సుల స్థానంలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలపై శిక్షణకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇప్పటికే టాటా టెక్నాలజీస్‌తో కలిసి 50 ఐటీఐలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోని ఐటీఐలను పరిశీలించి ఆ మేరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిగా.. కార్మికశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ తమిళనాడు, కర్ణాటకల్లో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో టాటా సంస్థ ఆధ్వర్యంలో ఆధునికీకరించిన ఐటీఐలను పరిశీలించింది. బెంగళూరు పారిశ్రామికవాడలోని పీన్యా ప్రభుత్వ ఐటీఐని కమిటీ సందర్శించింది. అక్కడ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, ఐవోటీ, ఈవీ మెకానిక్‌, బేసిక్‌ డిజైనర్‌, వర్చువల్‌ వెరిఫైయర్‌, వీఆర్‌ అసిస్టెడ్‌ వెల్డింగ్‌, పెయింటింగ్‌, అడ్వాన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యంత్రాలు ఉన్నాయి. తమిళనాడులోని గిండి ప్రభుత్వ ఐటీఐలో 10 వేల చదరపు అడుగుల స్థలంలో నెలకొల్పిన ప్రత్యేక ల్యాబ్‌నూ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆయా చోట్ల ప్రయోగశాలలు, పరికరాలు బాగున్నాయని కమిటీ అభిప్రాయపడింది.

కొత్త టెక్నాలజీలపై శిక్షణ..

రాష్టంలో 65 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. వీటిలో ఎంపిక చేసిన 50 ఐటీఐల్లో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించేందుకు టాటా టెక్నాలజీస్‌ ముందుకు వచ్చింది. యువతకు కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇప్పించాలని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ మోటార్స్‌ మల్లేపల్లి ఐటీఐతో కలిసి ఆధునిక కోర్సులు నిర్వహిస్తోంది. ఇక్కడ కోర్సులు చేసిన వారికి మారుతీ ప్లాంట్లలో శిక్షణ ఇచ్చి... నూరుశాతం ఉద్యోగాలు కల్పిస్తోంది. అలాగే రాష్ట్రంలోని ఐటీఐలను పలు పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఒక్కో ఐటీఐ పరిధిలో కనీసం 10 వేల మందికి స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆధునికీకరించిన ఐటీఐల్లోని మిషనరీపై శిక్షణ తీసుకుంటే... పరిశ్రమల్లో కొత్త టెక్నాలజీతో కూడిన యంత్రాలను ఆపరేట్‌ చేసేందుకు నైపుణ్యం లభించనుంది. ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి కార్మిక శాఖ రూపొందించిన నివేదికపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో తొలి విడతలోని ఐటీఐల సంఖ్య, అదనపు మౌలిక సదుపాయాలు, కొత్త కోర్సులు తదితర అంశాలపై నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.
 



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.