* ఐదేళ్లలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
* నెల వేతనం, రూ.3వేల పీఎఫ్ రీయంబర్స్
దిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25ను (Union Budget) మంగళవారం ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మూడు ఉద్యోగ కల్పన ఆధారిత పథకాలను ప్రకటించారు. ఉద్యోగ భవిష్య నిధి(EPFO)లో నమోదు ఆధారంగా ఈ పథకాలు అమలుచేస్తామని లోక్సభలో ప్రకటించారు.
తొలి పథకం: తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనం అందిస్తామని సీతారామన్ తెలిపారు. అన్ని రంగాలకు దీన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద మూడు వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. గరిష్ఠంగా రూ.15 వేలు వరకు అందజేయనున్నారు.
రెండో పథకం: తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండో పథకాన్ని తీసుకొచ్చారు. తొలిసారి ఉద్యోగులతో పాటు ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి కంట్రిబ్యూషన్ (EPFO) ద్వారా దీన్ని అందజేయనున్నారు. ఉద్యోగం కల్పించిన నాటినుంచి నాలుగేళ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గరిష్ఠంగా రూ.లక్ష వేతనం ఉన్నవారికి దీన్ని వర్తింపజేయనున్నారు.
మూడో పథకం: అదనంగా ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు రెండేళ్ల పాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ రీయంబర్స్ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా.
20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
మరోవైపు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణనిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. 1000 ఐటీఐలను హబ్-స్పోక్ మోడల్ కింద ఉన్నతీకరిస్తామని తెలిపింది. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు రూ.10 లక్షల వరకు రుణసాయం అందజేయనున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.