‣ జేఈఈ మెయిన్స్లో 73.8 శాతం మార్కులతో ఉత్తీర్ణత
కొండల్లో ఎక్కడో విసిరేసినట్టుండే గిరిజన గ్రామం. కరెంట్ మాట అటుంచితే... ఆ ఊరికి బస్సులూ తక్కువే. ఊరిజనాల్లో కూలిపనులతో జీవితాన్ని నెట్టుకొచ్చే వాళ్లే ఎక్కువ. అలాంటి చోటు నుంచి మొదటిసారి ఓ అమ్మాయి జేఈఈ రాసి ఎన్ఐటీలో సీటుకొట్టిందంటే గొప్పేగా! ఆ ఊరు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా పచ్చమలై. ఆ అమ్మాయి పేరు రోహిణి.
ఉన్న ఊళ్లో రెక్కలుముక్కలు చేసుకున్నా ముగ్గురు పిల్లల్ని పోషించడం కష్టమైంది. దీంతో కేరళ వెళ్లిపోయి అక్కడ కూలిపనులు చేసేవారు రోహిణి తల్లిదండ్రులు. ఊళ్లో ఉంటూ రోహిణీ కూడా కూలిపనులు చేస్తూనే చదువుకుంది. దీపం వెలుతురులో చదివే జేఈఈ పరీక్షలు రాసింది¨. ‘నేను చిన్న ఇలుప్పైయూర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్లస్ 2వరకూ చదువుకున్నా. బాగా చదువుతానని పోటీ పరీక్షలకు రాయమని ప్రోత్సహించేవారు మా మాస్టార్లు. స్కూల్ రోజుల్లో ఒకసారి ఎన్ఐటీలోని కెమికల్ ల్యాబ్కు తీసుకెళ్లారు. అప్పుడు ఏర్పడిన ఆసక్తి వల్లే ఎన్ఐటీలో చేరాలని ఉందని మా ఉపాధ్యాయులకు చెప్పాను. వాళ్లూ ప్రోత్సహించారు. కానీ మా ఊళ్లో కరెంట్ ఉండే సమయం చాలా తక్కువ. లైబ్రరీ, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అసలే లేవు. రాత్రి పూట టార్చ్లైట్ వేసుకొని చదివేదాన్ని. ఇంకో పక్క కూలిపనులు చేసుకుంటూనే నీట్, క్లాట్, జేఈఈ పరీక్షలు రాశా. జేఈఈ మెయిన్స్లో 73.8శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించా. తిరుచ్చి ఎన్ఐటీలో బీఈ కెమికల్ ఇంజినీరింగ్ చేసే అవకాశం దక్కింది. నా చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తాననడం సంతోషంగా ఉంది’ అంటోంది రోహిణి. 60ఏళ్లలో తిరుచ్చి ఎన్ఐటీలో సీటు పొందిన తొలి గిరిజన విద్యార్థినిగా రోహిణి ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!