* ర్యాంకులను వెల్లడించని వైనం
ఈనాడు, హైదరాబాద్: జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) మరోసారి విద్యార్థులతోపాటు ఐఐటీలకు షాక్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్ ఫైనల్ కీని మాత్రమే ఆగస్టు 7న ఎన్టీఏ విడుదల చేసింది. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్డ్కు ఆగస్టు 7న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రియ 7న ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుందని ఐఐటీ బాంబే గత ఏప్రిల్ 14నే ప్రకటించింది. జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించిన ఎన్టీఏ వాటి ర్యాంకులను ఆగస్టు 7న ప్రకటించలేదు. ప్రొవిజనల్ ఫైనల్ కీని మాత్రమే వెల్లడించింది. ఆ ర్యాంకులు లేకుండా అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులు ఎవరో తెలియదు. ఎన్టీఏతో సంప్రదించే ఐఐటీలు కాలపట్టికను ప్రకటిస్తాయి. ఆ సంస్థ మాత్రం అందుకు అనుగుణంగా నడుచుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఐఐటీలు ఒక కాలపట్టికను చెబితే కచ్చితంగా అమలు చేస్తాయి. గత రెండేళ్లుగా మాత్రం ఎన్టీఏ దెబ్బకు ఐఐటీలు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి.
ఇలాగేనా ప్రశ్నపత్రాలు రూపొందించేది?
జులై 23 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు జరిగాయి. ప్రశ్నపత్రాల్లో 23 తప్పులు జరిగినట్లు ప్రొవిజనల్ ఫైనల్ కీ ద్వారా వెల్లడైంది. ఆరు ప్రశ్నలను తొలగించారు. వాటికి మార్కులు ఇవ్వరు. కొన్నిటికి జవాబులు మార్చారు. మరికొన్నిటికి రెండు సరైన సమాధానాలుగా పేర్కొన్నారు. ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందో ఎన్టీఏ సమీక్షించుకోవాలని, ఇన్ని మార్పులు, చేర్పులు సమంజసం కాదని జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్ అన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.