• facebook
  • whatsapp
  • telegram

AP Gvt Schools: 649 పాఠశాలల విలీనం నిలిపివేత

ఆగస్టు 31నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ
ఈనాడు, అమరావతి: పాఠశాలల విలీనంపై ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 649 పాఠశాలల విలీనాన్ని నిలిపివేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల తరగతి గదులు లేకపోయినా.. పిల్లలు వాగులు, వంకలు, ప్రధాన రహదారులూ దాటాల్సి వచ్చినా పట్టించుకోకుండా తరగతులను విలీనం చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు సైతం వినతిపత్రాలు సమర్పించారు. క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత రావడంతో చివరికి ఫిర్యాదుల పరిశీలనకు చర్యలు చేపట్టారు. జిల్లాలో సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సరిగా పరిశీలించలేదని మంత్రి బొత్స సత్యనారాయణకే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మరోసారి పరిశీలించాలని ఆయన ఆదేశించారు. కొన్నిచోట్ల పునఃపరిశీలన చేయగా.. మరికొన్నిచోట్ల యథావిధిగానే జాబితాలను ఆమోదించారు.
ఎమ్మెల్యే వినతులకే దిక్కులేదు..
పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యేలు, జిల్లా కమిటీల ద్వారా మొత్తం 1,399 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో ఎమ్మెల్యేలు ఇచ్చినవి 820 కాగా.. జిల్లా కమిటీల నుంచి వచ్చినవి 579 ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాటిల్లో కనీసం సగం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 820 బడులకు సంబంధించి వినతులు ఇవ్వగా.. 380చోట్ల మాత్రమే విలీన మినహాయింపునిచ్చారు. క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు, విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకునే ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు. వాటిల్లో సగం వాటికి మాత్రమే విలీనం నుంచి విముక్తి లభించింది. జిల్లా కమిటీలకు వచ్చిన 579లో 269ని పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 649 పాఠశాలల విలీనం నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులు తగ్గడంతో గడువు మార్పు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గడువు(కటాఫ్‌)ను మార్పు చేశారు. గతంలో జులై నెలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యార్థులు తగ్గారనే సమాచారం రావడంతో ఈ కటాఫ్‌ను మార్చేశారు. ఆగస్టు 31న బడుల్లో ఉన్న విద్యార్థులనే ప్రామాణికంగా తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారమే ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల అవసరం, సబ్జెక్టులు, కేటగిరి వారీగా రూపొందించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరాలు వచ్చిన 649 పాఠశాలలను మినహాయించి, మిగతా వాటిని విలీనం చేస్తూ జాబితా రూపొందించాలని సూచించింది. ఈ జాబితాలపై సెప్టెంబరు ఒకటి నుంచి మూడో తేదీ వరకు కమిషనరేట్‌లో వర్క్‌షాపు నిర్వహించనున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.