ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన 33 పాఠశాలలు, 15 డిగ్రీ కళాశాలల ప్రారంభం కొంత ఆలస్యం కానుంది. అక్టోబరు 11 నాటికి పాఠశాలలు, 15 నాటికి డిగ్రీ కళాశాలలు ప్రారంభించి, తరగతులు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కొత్త గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నెలన్నర రోజులైనప్పటికీ ఉత్తర్వులు రెండు రోజుల క్రితమే వెలువడ్డాయి. దీంతో భవనాలు గుర్తించి, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలను అక్టోబరు మూడు లేదా నాలుగో వారంలో ఒకే రోజు ప్రారంభించి, దీపావళికి పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించేలా బీసీ సంక్షేమశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియను దసరా సెలవుల్లోగా ముగించేందుకు ఆయా వర్గాలు చర్యలు చేపట్టాయి.
పరిశుభ్రతకు ఒక్కో వసతి గృహానికి రూ.50 వేలు
బీసీ వసతి గృహాలు, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు రూ.50 వేల చొప్పున బీసీ సంక్షేమశాఖ మంజూరు చేసింది. ఆయా పనులను దసరా సెలవుల్లో పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.