* ఆర్థికభారం తగ్గించుకునేందుకు తెరపైకి హేతుబద్ధీకరణ
ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టులను కొత్త నియామకాలతో భర్తీ చేయకుండా ఉన్నవాటినే ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హేతుబద్ధీకరణ పేరుతో ఈ ప్రక్రియ చేపట్టింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఒక్క రెగ్యులర్ అధ్యాపక పోస్టు మంజూరు లేకుండా 11 కళాశాలలు కొనసాగుతున్నాయి. మరో 12 కళాశాలలకు అరకొర పోస్టులు ఇచ్చారు. వాస్తవంగా ఈ 23 చోట్ల 233 అధ్యాపక పోస్టులు అవసరం. వీటి మంజూరుకు సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలు పంపినా, ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వద్దనే నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఉన్నా, ఆయన దాన్ని పట్టించుకోవడం లేదు. అధ్యాపకులు లేకుండా విద్యార్థులకు పాఠాలు ఎవరు బోధిస్తారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న శాశ్వత ప్రిన్సిపల్నో, విభాగాధిపతినో ఓఎస్డీగా నియమించి, మిగతా వారిని డిప్యుటేషన్లపై కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు తక్కువగా ఉన్నచోట్ల నుంచి అధ్యాపక పోస్టులను ఇతర కళాశాలలకు సర్దుబాటు చేయబోతున్నారు. ఇవికాకుండా గతంలో పార్ట్టైమ్ కోఆర్డినేటర్లను నియమించారు. వారిని సైతం సర్దుబాటు చేయనున్నారు. టైప్రైటర్, రికార్డు మెకానిక్, టైప్ రైటింగ్ మెకానికల్ వంటి బోధనేతర పోస్టులను కన్వర్షన్ చేయబోతున్నారు.
విద్యార్థులకు సైతం..
కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్, ఈఈఈ, సివిల్ బ్రాంచిల్లో విద్యార్థులు తక్కువగా చేరారు. గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్(జీఎంఆర్) కళాశాలల్లోనూ కొన్ని బ్రాంచిల్లో అయిదు మంది లోపే ప్రవేశాలు పొందారు. ఏలూరు జిల్లా కేఆర్పురం పాలిటెక్నిక్లో గతేడాది ఒక్కరూ చేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది లోపు ప్రవేశాలున్న బ్రాంచిల్లోని విద్యార్థులను సమీపంలోని పాలిటెక్నిక్కు పంపించటం.. లేదంటే అదే కళాశాలలో మరో బ్రాంచిలో ప్రవేశాలు కల్పించాలని సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.