* రూ.10వేల జరిమానాపై పునఃపరిశీలించండి
* ఉస్మానియా యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: విద్యా లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఫీజుల జరిమానా ఉండకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2017-18 విద్యా సంవత్సరం డిగ్రీ విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షల నిమిత్తం ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేల జరిమానా చెల్లించాలన్న నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేలు జరిమానా చెల్లించాలంటూ 2022 డిసెంబరులో జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన కె.ప్రమోద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బాగ్లేకర్ ఆకాశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన పిటిషనర్ బ్యాక్లాగ్లను పూర్తి చేయడానికి ఇంత మొత్తం చెల్లించడం భారమన్నారు. పెనాల్టీ విధించవద్దని తాము కోరడం లేదని అయితే అది సహేతుకంగా ఉండాలన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లోని వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని రూ.10 వేల జరిమానాపై 4 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీకి ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ నుంచి సాధారణ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.