• facebook
  • whatsapp
  • telegram

Varsity Appointments: వర్సిటీ నియామకాల్లో వింతలెన్నో!

* సహాయ ఆచార్య పోస్టులకు పరిగణనలోకి ‘ఒప్పంద’ సర్వీసు

* అసోసియేట్‌కు మాత్రం యూజీసీ పేస్కేల్‌ ఉంటేనే అర్హత

* నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష
 

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం చిత్ర విచిత్ర నిబంధనలు విధించింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా అర్హత సాధించాలంటే సహాయ ఆచార్యుడిగా 8 ఏళ్లు పని చేసి ఉండాలనే నిబంధనను పెట్టింది. ఈ సమయంలో యూజీసీ పేస్కేల్‌ తీసుకుని ఉండాలని పేర్కొంది. వర్సిటీల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు యూజీసీ స్కేల్‌ ఇవ్వకుండా వారితో ప్రభుత్వం పని చేయించుకుంది. ఇప్పుడు వీరిని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అనర్హులుగా పేర్కొంటోంది. గత 15ఏళ్లుగా ఒప్పంద అధ్యాపకులు వర్సిటీల్లో పని చేస్తున్నారు. యూజీసీ పేస్కేళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వమే ఇవ్వకుండా.. ఇప్పుడు వారికి ఆ పేస్కేలు లేదని అనర్హులంటోంది. ఈ నిబంధనతో రెండు వేల మంది ఒప్పంద అధ్యాపకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్సిటీల్లో కేవలం అనుభవం మాత్రమే అడుగుతుండగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పేస్కేళ్ల నిబంధన పెట్టింది. మరోవైపు ఒప్పంద అధ్యాపకుల సర్వీసు పరిగణనలోకి తీసుకొని, సహాయ ఆచార్యుల పోస్టుల ఇంటర్వ్యూల్లో 10 పాయింట్లు వెయిటేజీ ఇస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్వ్యూలకు సర్వీసును పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు అదే సర్వీసుతో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టును ఇవ్వాలి కదా? కానీ, సహాయ ఆచార్యుడి పోస్టుకు సర్వీసును పరిగణిస్తూ.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు వచ్చేసరికి పేస్కేల్‌ అడుగుతోంది. ఒకే నోటిఫికేషన్‌లో రెండు విరుద్ధ నిబంధనలు పెట్టింది.


ఎస్సీ, ఎస్టీలపై ఆర్థిక భారం..

కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టుల దరఖాస్తుకు రూ.2వేలు ఫీజు పెట్టింది. నా ఎస్సీ, నా ఎస్టీ అని ప్రతి సమావేశంలోనూ కపట ప్రేమ చూపే సీఎం జగన్‌ వారి నుంచి దరఖాస్తు ఫీజు వసూలు చేస్తున్నారు.

కేవలం ఇంటర్వ్యూలతో ఎంపిక చేసే ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.3 వేల ఫీజు నిర్ణయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు మినహాయింపు ఇవ్వలేదు.  

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ఎలాంటి పరీక్షలూ నిర్వహించకూడదనే నిబంధన ఉంది. ప్రభుత్వం మాత్రం సహాయ ఆచార్యుల పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌కు పరీక్ష నిర్వహిస్తామంటోంది.

అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో లాంగ్వేజ్‌లు మినహాయించి, ఇతర సబ్జెక్టుల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇది అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది. ఈ నిబంధనపైనా అభ్యర్థులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.