• facebook
  • whatsapp
  • telegram

AICTE: ఏఐసీటీఈ పరిధిలోకి బీసీఏ, బీబీఏ, బీబీఎం

* వాటికి సాంకేతిక విద్యామండలి అనుమతులు తప్పనిసరి

* పాలిటెక్నిక్‌ సీట్లను బీటెక్‌గా మార్చుకోవచ్చు

* ఏఐసీటీఈ ముసాయిదా నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఎం) కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు పొందాల్సిందే. ఈ మేరకు ఏఐసీటీఈ తన ముసాయిదా నివేదికలో స్పష్టం చేసింది. దీనిపై న‌వంబ‌రు 17వ తేదీలోపు అభిప్రాయాలు పంపాలని కోరింది. మార్చిలో తుది నిబంధనలపై హ్యాండ్‌బుక్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఆ కోర్సులకు యూజీసీ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతులిస్తోంది. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) జారీ చేస్తాయి. ఇక నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ తరహాలోనే బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందాలి. ఏఐసీటీఈ నిబంధనలనే పాటించాలి. సాంకేతికత, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సరైన ప్రమాణాలను పాటించేలా వాటికి కొత్త సిలబస్‌నూ రూపొందించనున్నారు. త్వరలో దానిపై నిపుణుల కమిటీని నియమించనున్నారు. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం అనుమతులు పొందాల్సి ఉండేది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లపాటు అనుమతి ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ తదితర నియంత్రిత సంస్థలను మిళితం చేసి భారత ఉన్నత విద్యా కమిషన్‌ (హెకీ)గా మార్చాలన్న ప్రతిపాదనపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై మూడేళ్లకు అనుమతులు ఇవ్వనున్నారని నిపుణులు చెబుతున్నారు.


అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు మరికొన్ని..


కొన్నిచోట్ల ఇప్పటికే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (బీటెక్‌+ఎంటెక్‌) నడుస్తున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ ఇన్‌ ప్లానింగ్‌ (మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ), మాస్టర్‌ ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ (ఎంహెచ్‌ఎంసీటీ), మాస్టర్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) కోర్సులకు అనుమతి ఇస్తారు. దీనివల్ల విద్యార్థులకు ఒక ఏడాది సమయం ఆదా అవడమే కాకుండా విద్యార్థులు యూజీతో చదువు ఆపకుండా పీజీ కూడా చేస్తారన్నది ఏఐసీటీఈ ఉద్దేశం.

* క్యూఎస్‌/టైమ్‌ ర్యాంకింగ్‌లో 1000 ర్యాంకులోపున్న విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం ద్వారా ట్విన్నింగ్‌ ప్రోగ్రామ్‌లను అందించవచ్చు. అంటే కొంతకాలం భారత్‌లో, మరికొంతకాలం విదేశాల్లో చదువుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న కళాశాలకు/వర్సిటీకి న్యాక్‌లో కనీసం 3.01 పాయింట్లు లేదా ఎన్‌బీఏలో వెయ్యికి 650 పాయింట్లు లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో 200 లోపు ఉండటం తప్పనిసరి.
 

* పాలిటెక్నిక్‌ సీట్లను ఇంజినీరింగ్‌గా, ఇంజినీరింగ్‌ సీట్లను పాలిటెక్నిక్‌ సీట్లుగానూ మార్చుకోవచ్చు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బీటెక్‌ సీట్లు వస్తాయని అంచనా.

* 40 శాతం క్రెడిట్లను విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా చదివి పొందొచ్చు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటారు.
 


 



మరింత సమాచారం... మీ కోసం!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.