ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇటీవల చేపట్టిన ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్(ఔటా) ఈ నెల 10న ఫిర్యాదు చేయడంతో ఉన్నత విద్యామండలి స్పందించి విచారణ కమిటీని నియమించింది. తగినన్ని పీహెచ్డీలు లేకపోయినా, అంతర్జాతీయ జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురితం కాకపోయినా కొందరు ప్రొఫెసర్లు పదోన్నతులు పొందారంటూ సంఘం ప్రతినిధులు ఆరోపించారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలివీ..
సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇవ్వాలంటే ప్రొఫెసర్లకు పదేళ్ల సర్వీసు, 2పీహెచ్డీలు ఉండాలి. యూజీసీ-కేర్లో 10 పరిశోధన పత్రాలు ప్రచురితమై ఉండాలి. 42 మంది ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించగా..వారిలో కొందరికి అర్హతలు లేవు.
విశ్వవిద్యాలయంలోని ఓ ప్రొఫెసర్.. 10 పరిశోధన పత్రాలు సమర్పించానని నివేదికలో రాసుకున్నారు. ఇందులో నాలుగు పత్రాలు లేవు. ఒక పరిశోధన పత్రం కాపీరైట్ వివాదంలో ఉంది.
డీన్గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ పది పరిశోధన పత్రాలు సమర్పించానంటూ నివేదికలో రాసుకున్నారు. ఇందులో తొమ్మిది పత్రాలు యూజీసీ-కేర్ జర్నళ్లలో లేవు. తనది కాని ఒక పరిశోధన పత్రాన్ని తన పేరు మీద రాసుకున్నారు.
ఒక ప్రొఫెసర్ 25 పరిశోధన పత్రాలను సమర్పించారు. అవి యూజీసీ-కేర్ జర్నళ్లలోనూ ప్రచురితమయ్యాయి. వాటిలో మూడు పరిశోధన పత్రాలే పనికొస్తాయంటూ ఓయూ అధికారులు పదోన్నతి ఇవ్వలేదు.
డీన్గా వ్యవహరిస్తున్న ఓ ప్రొఫెసర్ 2010 నుంచి పరిశోధన విద్యార్థులకు గైడ్గా వ్యహరిస్తున్నారు. ఇతర ప్రొఫెసర్ల నుంచి కొందరు విద్యార్థులను బదిలీ చేయించుకుని నెల రోజుల్లో వారికి పీహెచ్డీలు వచ్చేలా చేసి.. పదోన్నతి పొందారు.
పదోన్నతుల కల్పనలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ ఆరోపించారు. కొందరు అర్హులకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఉన్నత విద్యామండలి విచారణ కమిటీని నియమించిందని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.