* నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి వెసులుబాటు
* రెండేళ్ల పీజీలో ఏడాది తర్వాత మానుకుంటే డిప్లొమా పట్టా
* యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల జారీ
ఈనాడు, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు అంటే ఇప్పటివరకు రెండేళ్లు చదవాల్సి వచ్చేది. ఇక నుంచి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసిన వారు ఏడాది పీజీ కోర్సు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ యూజీసీ పచ్చజెండా ఊపింది. త్వరలో ఆ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యా ప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్వర్క్లకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలు, సూచనలను పంపేందుకు తుది గడువు డిసెంబరు 15వ తేదీగా నిర్ణయించింది. వాటిని పరిశీలించి డిసెంబరు లేదా జనవరిలో తుది మార్గదర్శకాలు విడుదల చేస్తారు. నూతన జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా పీజీ విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన యూజీసీ.. అందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యాంశాలు..
* మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు ఇప్పటి మాదిరిగానే రెండేళ్ల పీజీ చదువుతారు. నాలుగేళ్ల ఆనర్స్ పూర్తిచేసిన వారు మాత్రం ఏడాదిపాటు పీజీ చదవొచ్చు. డిగ్రీలో చదివిన సబ్జెక్టుల్లో ఏదైనా ఒక సబ్జెక్టును పీజీలో ఎంచుకొని పూర్తి చేయవచ్చు.
* మూడేళ్లు డిగ్రీ చదివిన వారు రెండేళ్ల పీజీలో చివరి ఏడాది పూర్తిగా పరిశోధనకే కేటాయిస్తారు. ప్రథమ సంవత్సరం చదివి మానుకుంటే పీజీ డిప్లొమా పట్టా అందజేస్తారు. తర్వాత ఆసక్తి ఉన్నప్పుడు రెండో ఏడాది పూర్తి చేస్తే పీజీ ధ్రువపత్రం ఇస్తారు.
* ఆఫ్లైన్లో చదవాలా? ఆన్లైన్లో చదవాలా.. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో చదవాలా? అన్నది విద్యార్థుల ఇష్టం.
* మరిన్ని అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టిఫిషియల్ లెర్నింగ్తో అనుసంధానించిన హెల్త్కేర్, అగ్రికల్చర్, లా తదితర కోర్సులను ప్రవేశపెట్టుకునేందుకు అనుమతి ఇస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాక్ మార్కెట్లో చక్కని కెరియర్!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.