ఎంపిక చేసిన గుత్తేదారు వద్దనే కొనాలంటూ కళాశాలలకు ఆదేశాలు
ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వం పుస్తకాల వ్యాపారం మొదలుపెట్టింది. ఇప్పటికే డిగ్రీ పాఠ్యపుస్తకాలను ముద్రించి పిల్లలతో బలవంతంగా కొనిపించిన ప్రభుత్వం.. ఇప్పుడు తాము ఎంపిక చేసిన గుత్తేదారు వద్దే పుస్తకాలు కొనాలని పాలిటెక్నిక్ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాలు పుస్తకాల ధరల కంటే అధికంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలు కూడా ఇదే సూచనను పాటిస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. పాలిటెక్నిక్ మొదటి ఏడాది విద్యార్థుల కోసం సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వ లెక్చరర్లతో పాఠ్యపుస్తకాలు, ల్యాబ్ మ్యానువల్స్ రూపొందించింది. వీటిని ముద్రించేందుకు టెండర్లు నిర్వహించి, ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ వద్దనే పుస్తకాలు కొనాలంటూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ యాజమాన్యాలకు ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పుస్తకాల ముద్రణలో జాప్యం జరగడంతో కొందరు విద్యార్థులు మార్కెట్లో లభించే వాటిని ఇప్పటికే కొనుక్కున్నారు. అయినా మళ్లీ తమ వద్దే కొనాలంటూ కళాశాలల అధ్యాపకులు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు.
ఆన్లైన్లో పాఠ్యపుస్తకాల పీడీఎఫ్లు ఏవి?: తక్కువ ధరకు ఇచ్చేందుకు పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి తీసుకువచ్చామని సాంకేతిక విద్యాశాఖ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ పాఠ్యపుస్తకాలను పీడీఎఫ్ రూపంలో వెబ్సైట్లో పెడుతున్నాయి. సాంకేతిక విద్యాశాఖ మాత్రం పీడీఎఫ్లు వెబ్సైట్లో పెడితే గుత్తేదారుకు నష్టం వస్తుందంటూ ఆ పని చేయడం లేదు. పాలిటెక్నిక్లో ఆరు బ్రాంచిలకు సంబంధించి పుస్తకాల ధరలు రూ.609 నుంచి రూ.762 వరకు ఉండగా.. ప్రైవేటు యాజమాన్యాలు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నాయి. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.