* గతేడాది 38 శాతం
* ఈసారి స్వల్పంగా పెరుగుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పీజీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో సగం సీట్ల భర్తీ కూడా గగనంగా మారుతోంది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష(సీపీగెట్) కౌన్సెలింగ్లో భాగంగా కన్వీనర్ కోటాలో సుమారు 50 వేల సీట్లు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం వాటిలో కేవలం 20,484 సీట్లు(40.96 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. గత విద్యాసంవత్సరం(2022-23) 19,121(38.24) సీట్లు మాత్రమే నిండాయి. అంటే, ఈసారి 1,363 సీట్లు అధికంగా భర్తీ కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఎమ్మెస్సీ రసాయనశాస్త్రంలోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ఆ తర్వాతి స్థానం ఎంకాంది. ఈ సారి కొత్తగా ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు. అందులో 400 సీట్లకుగాను 231 మంది ప్రవేశాలు పొందారని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. అలాగే, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్, ఎమ్మెస్సీ న్యూట్రిషన్ కోర్సుల్లో ఈ సారి ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. మొత్తం పీజీ సీట్లలో 80 శాతాన్ని కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని, మిగిలిన 20 శాతం యాజమాన్య కోటాలోని సీట్లలో 1000-1500కు మించి చేరటం లేదని చెప్పారు. కన్వీనర్ కోటాలోని సీట్లు మిగిలిపోతుండగా.. యాజమాన్య కోటా కింద అధిక ఫీజులు చెల్లించి చేరే వారు చాలా తక్కువగా ఉంటున్నారని ఆయన వివరించారు.
చేరేవారిలో అమ్మాయిలే అధికం
పీజీలో మొత్తం 48 కోర్సులు ఉన్నాయి. వాటిలో జాగ్రఫీ, ఎంపీఎడ్, టూరిజం, లైబ్రరీ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ తదితర కోర్సుల్లో తక్కువగా చేరుతుంటారు. వీటిలో చేరే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని కోర్సుల్లో 70-80 శాతం అమ్మాయిలే ఉంటున్నారని సీపీగెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఎంకాం, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి. స్టాటిస్టిక్స్లో 417 సీట్లకు గాను 358 మంది మహిళలే ఉన్నారు. ఎంఏ రాజనీతిశాస్త్రంలో చేరిన 636 మందిలో 330 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. గత విద్యాసంవత్సరం ఎమ్మెస్సీ గణితంలో 1445 మంది చేరగా 1192 మంది మహిళలే. మొత్తం మీద గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు మూడొంతుల మంది అమ్మాయిలే పీజీ కోర్సుల్లో చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరే అబ్బాయిల సంఖ్య భారీగా తగ్గుతోంది. వారంతా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల వైపు వెళ్తున్నారని, అమ్మాయిలు మాత్రం సంప్రదాయ డిగ్రీలో చేరి తర్వాత పీజీ చదువుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.