* ఏఎన్ఎంల రాత పరీక్ష వాయిదా
* వివిధ దశల్లో వైద్య, ఆరోగ్య శాఖలో 7,356 పోస్టుల భర్తీ
* నిరుద్యోగుల ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖలో అర్ధంతరంగా ఆగిన నియామకాల ప్రక్రియ కొనసాగింపు కోసం వేలమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ శాఖలో మొత్తంగా 7,356 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉందని, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
* వైద్యారోగ్యశాఖలో కీలక విభాగాల్లో నియామకాల ప్రక్రియను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, గురుకుల పాఠశాలలు సహా వివిధ వైద్య విభాగాల్లో 5,204 మంది స్టాఫ్నర్సుల నియామకానికి ఈ ఏడాది జనవరిలో ఉద్యోగ ప్రకటన వెలువడింది. సుమారు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, రాత పరీక్ష నిర్వహించి ‘కీ’ని కూడా విడుదల చేశారు. రెండు నెలల క్రితమే అభ్యంతరాలు స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదలచేసి, నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియను అధికారులు నిలిపేశారు. తిరిగి దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, నియామక ఉత్తర్వులు ఎప్పుడిస్తారనే సమాచారమూ ఇవ్వలేదు.
* దీంతోపాటు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,996 మంది ఏఎన్ఎంల నియామకానికి ఆగస్టులో ప్రకటన వెలువడగా దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. దరఖాస్తులు భారీగా వచ్చాయి. నవంబరు 10వతేదీన రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారమూ బోర్డు నుంచి వెలువడకపోవడంతో దరఖాస్తుదారులంతా ఆందోళన చెందుతున్నారు.
* ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియకు ఆగస్టులో ప్రకటన వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. తదుపరి నియామక ప్రక్రియ నిల్చిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరగా ఆయా పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.