భోజనం ముందు ఈ పద్ధతి పాటిస్తున్న విద్యార్థులు 29 శాతమే
ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లోని పలు సర్కారు పాఠశాలల్లో అధ్యయనం
కేంద్ర విద్యాశాఖ నివేదిక వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో కేవలం 29.20 శాతం మందే భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. అవగాహనా లోపంతోపాటు చాలాచోట్ల సబ్బులు, హ్యాండ్వాష్లు లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. తల్లిదండ్రుల నేపథ్యం చూసినప్పుడు కూడా చాలామంది పెద్దగా చదువుకోనివారే. దీనివల్ల వారు కూడా పిల్లలకు సరైన అవగాహన కల్పించలేకపోతున్నారన్న అభిప్రాయాలున్నాయి. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్), ఇతర నిపుణులతో కూడిన కమిటీ క్షేత్ర స్థాయిలో ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కిందటి ఏడాది నవంబరులో అధ్యయనం చేసింది. దేశంలో మధ్యాహ్న భోజనం అమలు స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవడంలో భాగంగా రాష్ట్రంలో కూడా ఈ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మల విసర్జన తర్వాత కూడా 15 శాతం మంది సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదని తేలింది. సాధారణంగా విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యాశాఖ నుంచి పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ రావాలి. కానీ అది సకాలంలో రాదు. దానివల్ల ప్రధానోపాధ్యాయులు వివిధ ఖర్చుల కోసం సొమ్మును తమ జేబుల్లో నుంచి పెట్టాల్సి వస్తోంది. చాలాచోట్ల సబ్బులు, హ్యాండ్వాష్లు లేకపోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చు. ఈ నేపథ్యంలో స్కూల్ గ్రాంట్ పెంచాలని కూడా ఉపాధ్యాయులు కమిటీని కోరటం గమనార్హం. సర్కారు పాఠశాలలకు వచ్చే ముందు అల్పాహారం/ఆహారం తిని వచ్చేది 85.80 శాతం మందే. తక్కిన వారు ఏమీ తినకుండానే వస్తున్నారు. బడుల్లో మధ్యాహ్న భోజనం తినాలంటే 12.30 గంటల వరకు వేచి చూడక తప్పదు. అక్టోబరులో సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించినా 27 వేల పాఠశాలలకు గాను దాదాపు 3 వేల బడుల్లోనే అమలవుతోంది.
పర్యవేక్షణ భారం
మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణకు రోజూ సుమారు గంట సమయం కేటాయించాల్సి వస్తోందని 71 శాతం మంది ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దానివల్ల బోధనపైనా ప్రభావం పడుతోందని కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ పథకం తమకు భారంగా మారిందని 8 శాతం మంది హెచ్ఎంలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్న చోట ఇంకా ఇబ్బందిగా మారిందన్నారు.
విద్యార్థుల గురించి సర్వేలో తేలిన విషయాలు (శాతాల్లో)
‣ భోజనానికి ముందు సబ్బుతో చేతుల శుభ్రం 29.20
‣ మధ్యాహ్న భోజనం మెనూ గురించి తెలిసినవారు 49.60
‣ అన్నం తినేందుకు ఇంటి నుంచి పళ్లాలు తెచ్చుకునేవారు 79.60
‣ మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం 85.00
‣ అల్పాహారం తిని బడికి వచ్చేవారు 85.80
‣ రోజూ ఉతికిన దుస్తులు ధరించేవారు 96.50
‣ వడ్డించే ఆహారం సరిపోతోందన్నవారు 96.50
‣ బ్రష్తో దంతాలు శుభ్రం చేసుకునేవారు 98.20
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.