* అవకాశాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
* అవసరమైతే చట్ట సవరణకు యోచన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లను అమలుచేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి అవసరమైతే చట్ట సవరణ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో ఉన్నత విద్యామండలి అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రైవేటు వర్సిటీల చట్టాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ప్రైవేటు వర్సిటీలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సమగ్రంగా వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరంలో తొలిసారిగా అనురాగ్, మల్లారెడ్డి, ఎస్ఆర్, వోక్సన్, మహేంద్ర వర్సిటీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2023 సెప్టెంబరు 13న గురునానక్, శ్రీనిధి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (ఇక్మార్), ఎంఎన్ఆర్, కావేరి వర్సిటీల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పాసైనా.. వాటికి గవర్నర్ ఆమోదం లభించలేదు. అయినా గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లో ప్రవేశాలు పూర్తిచేయడం, గవర్నర్ ఆమోదం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరం ఆ విద్యార్థులను ఇతర వర్సిటీలు, కళాశాలల్లో సర్దుబాటు చేయడం తెలిసిందే. కాగా వర్సిటీల వారీగా విద్యార్థుల సంఖ్య, వార్షిక ఫీజు, భూములు తదితర సమగ్ర వివరాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో చట్టాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలిని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో ప్రైవేటు వర్సిటీలున్నాయి. ఒక్క ఉత్తర్ప్రదేశ్లోనే రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉంది. నగరంలోని ఓ ప్రముఖ వర్సిటీ ఉన్న భూములకు కూడా రైతుబంధు డబ్బులు వస్తున్నాయని తెలిసింది.. దానికితోడు వర్సిటీ భూముల్లో కబ్జా, వివాదాస్పద స్థలాలు ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!
‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు
.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.