* ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు పోటీ
ఈనాడు, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిన తొలి ఏడాదే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలు ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు పోటీపడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో లేని కళాశాలలతోపాటు ఉన్నవి కూడా డిమాండ్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మరో కళాశాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతవరకు జేఎన్టీయూహెచ్కు 6 కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆలస్య రుసుంతో దరఖాస్తుకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు గడువు ఉన్నందున ఆ సంఖ్య 10కి చేరుకోవచ్చని జేఎన్టీయూహెచ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కళాశాలలను లీజు భవనంలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు 75 కిలోమీటర్ల దూరం లోపు ఉంటే అధ్యాపకులను రెండు కళాశాలల్లో బోధించేందుకు అనుమతించడం.. లాంటి పలు వెసులుబాట్లు కల్పించడంతో నగరానికి దూరంగా ఉన్న కళాశాలలు సైతం హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతవరకు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. ఈసారి కొన్ని కొలమానాల ఆధారంగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు సైతం అనుమతి ఇస్తున్నారు. దరఖాస్తు గడువు పూర్తయిన తర్వాత పరిశీలించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కళాశాలల్లో మౌలిక వసతులుంటే సీట్లు పెంచుకునే అవకాశాన్ని ఏఐసీటీఈ ఇవ్వడంతో ఈసారి పెద్ద సంఖ్యలో కళాశాలలు దరఖాస్తు చేస్తున్నాయని, ఇంకా ఎన్ని కళాశాలలు, ఎన్ని సీట్లన్నది లెక్కించలేదని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్లోని ఓ కళాశాల, ఘట్కేసర్ ప్రాంతంలోని మరో కళాశాల, జీడిమెట్ల సమీప ప్రాంతంలోని గ్రూపు సంస్థల యాజమాన్యం కూడా దరఖాస్తు చేసిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు మరో 3 ప్రముఖ కళాశాలలు కూడా దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో కలిపి ప్రస్తుతం మొత్తం 1.20 లక్షల బీటెక్ సీట్లున్నాయి. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో మరో 8 వేల వరకు ఉన్నాయి. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరం (2024-25)లో కనీసం మరో 15 వేల సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
* అనుమతి ఇచ్చినా.. బోధనా రుసుములు లేకుండానే?
ఏఐసీటీఈ ఆమోదం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. వాటిలో చేరేవారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదన్న షరతుతో పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం నేత రవికుమార్ సైతం ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు ఇష్టమొచ్చినట్లు సీట్లు పెంచుకునే అవకాశం.. మరో వైపు ఆఫ్ క్యాంపస్లు ఇస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల మనుగడ కష్టమని, తప్పదనుకుంటే గ్రామీణ జిల్లాల్లో ఉన్న కళాశాలలకే అనుమతి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో.. ఎంబీఏలో కొత్తగా పెరిగిన సీట్లకు ఈ విధానంలోనే 2022-23 విద్యా సంవత్సరంలో అనుమతి ఇచ్చినట్లు రవికుమార్ చెబుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.