ఈనాడు, హైదరాబాద్: ‘ప్రస్తుత తరుణంలో ఈ దేశం కల్పిస్తున్న ఎన్నో గొప్ప అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలి. ఆకర్షణీయమైన వృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్ఫూర్తి..ఏ రకంగా చూసినా మీ ముందు ఎన్నో దారులు ఉన్నాయి’ అని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ ఐఎస్బీ విద్యార్థులకు సూచించారు. ‘స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగితే సాధించనిది ఏదీ లేదని, అనుకున్న వాటిని సొంతం చేసుకోవచ్చని అన్నారు. మీ మదిలో ఒకటే లక్ష్యం ఉండాలి, అదే అనుక్షణం మీ కళ్ల ముందు ఉండాలి, మిగతా విషయాలన్నింటినీ తాత్కాలికంగా పక్కన పెట్టేయండి. అప్పుడు అనుకున్నది మీ సొంతం అవుతుంద’ని స్పష్టం చేశారు. ఏప్రిల్ 5న ఇక్కడ ఐఎస్బీలో పీజీపీ-2024 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మీ చేతిలో ఉన్న పట్టాతో మీరు ఎన్నో పనులు చేయవచ్చు. కార్పొరేట్ సంస్థల్లో, ప్రభుత్వంలో పనిచేయవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావచ్చు. ఒకదాని తర్వాత మరొకటిగా ఈ పనులన్నీ చేయవచ్చు. ఈ మధ్య నేనొక మహిళను కలిశాను. ఆమె 32 అంకుర సంస్థలకు సీఎఫ్ఓగా పనిచేస్తోంది. గతంలో ఇటువంటి పరిస్థితిని ఊహించగలమా. ఇటువంటి వినూత్నమైన అవకాశాలు ప్రస్తుత యువతరం ముందున్నాయి. దీనికి తగ్గట్లుగా ముందుకు సాగాల’ని సూచించారు. అంతకు ముందు ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ, ప్రపంచ మేనేజ్మెంట్ విద్యా సంస్థల ర్యాంకింగ్లో ఐఎస్బీ 31వ స్థానంలో ఉందని, కానీ ఐఎస్బీకి ఉన్న సత్తాను పరిగణనలోకి తీసుకుంటే, టాప్- 10లో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ హరీష్ మన్వానీ, డిప్యూటీ డీన్ రామ్, పలువురు ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. పీజీపీ-2024 బ్యాచ్లో అత్యంత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఈ సందర్భంగా పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.