* డిసెంబరులో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూలు చేసింది. పరీక్షలను డిసెంబరులో నిర్వహిస్తామని, తేదీలను తర్వాత ప్రకటిస్తామంది. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అలాగే డీఎస్సీకి, గ్రూప్-2కు మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉందని, నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ఇప్పటికే నిరుద్యోగులతో ఒకసారి సమావేశమై పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిరుద్యోగులు ఆందోళన కొనసాగించారు. దాంతో సీఎం సూచన మేరకు శుక్రవారం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. నిరుద్యోగుల కోరిక మేరకు పరీక్షను డిసెంబరు చివరి వారంలో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డికి విన్నవిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షల వాయిదా విషయాన్ని పరిశీలించాలంటూ టీజీపీఎస్సీకి సూచించింది. అనంతరం... వివిధ పోటీ పరీక్షల మధ్య వ్యవధి తక్కువ ఉన్నందున గ్రూప్-2ను వాయిదావేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
రెండేళ్ల క్రితం వెలువడిన ప్రకటన
రాష్ట్రంలో గ్రూప్-2 ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడింది. మొత్తం 783 పోస్టులతో 2022లో ఉద్యోగ ప్రకటన వెలువడింది. అప్పట్లో 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. వరుస పరీక్షలు, గురుకుల టీచర్ ఉద్యోగాల పరీక్షలతో గ్రూప్-2కు సన్నద్ధం కాలేకపోయామని, సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో అప్పటి ప్రభుత్వం అదే ఏడాది నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షలు మరోసారి 2024 జనవరి 6, 7 తేదీలకు వాయిదా పడ్డాయి. తర్వాత ప్రభుత్వం మారి... కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక ఆగస్టు 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు రీషెడ్యూల్ను ప్రకటించింది. తాజాగా డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో మరోసారి డిసెంబరుకు వాయిదా వేసింది.
అంబేడ్కర్ నాలెడ్జి కేంద్రాల ఏర్పాటు
గ్రూప్-2 అభ్యర్థులు, నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పరీక్ష వాయిదాపై హామీ ఇచ్చారు. ‘‘రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. గత పదేళ్లలో ఉద్యోగాలన్నీ భర్తీ చేసుంటే లక్షల కుటుంబాలు స్థిరపడేవి. అందుకే మేం నిరుద్యోగితనే ఎన్నికల ఎజెండాగా మార్చుకున్నాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కలిగించాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. కొందరి స్వలాభం కోసం... ప్రభుత్వాన్ని బెదిరించి కేసులపాలైతే నిరుద్యోగులే నష్టపోతారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షార్థుల కోసం అంబేడ్కర్ నాలెడ్జి కేంద్రాలు ప్రారంభిస్తాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వడానికి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. దేశంలోనే అత్యున్నత సబ్జెక్టు నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. అభ్యర్థులు అశోక్నగర్లో రూ.5 భోజనంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని పరిశీలించి, సమస్యలను ఇందిరమ్మ ప్రభుత్వం పరిష్కరిస్తుంది’’ అని భట్టి భరోసా ఇచ్చారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.