* 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* నోటిఫికేషన్ విడుదల
![]() |
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష(టీఎస్ సీపీజీఈటీ) జులై 5న జరగనుంది. మే 18 నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. సీపీజెట్ నోటిఫికేషన్ను బుధవారం (మే 15) ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, వైస్ఛైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ రవీందర్, సెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి, ఇతర విశ్వవిద్యాలయాల వీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ పరిధిలోని 297 పీజీ కళాశాలల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీజెట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు మే 18 నుంచి జూన్ 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుంతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షను జులై 5న కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీటీ)లో నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగాలు, డిమాండ్ ఇతర అంశాల ఆధారంగా పీజీ కోర్సులు కొత్తవి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. సీపీజెట్కి సంబంధించిన సమాచారాన్ని www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్సైట్ల ద్వారా పొందవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం లభించలేదని తెలిపారు. సిబ్బంది కొరత వల్ల యూజీసీ నిధులివ్వడం లేదని ఈ సందర్భంగా వెంకటేశం చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.