‣ విద్యార్థుల ద్వారా కుటుంబ సభ్యులు, ఇతరులకు కరోనా వ్యాప్తిపై అనుమానాలు
‣ రాష్ట్రంలో ఇప్పటికే 700 మంది బడిపిల్లలకు పాజిటివ్
‣ పాఠశాలలు మూసివేతకు వైద్యశాఖ ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే పదోతరగతిలోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తేనే మేలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మార్చి 22న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక ఒకటీ, రెండురోజుల్లో ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు కరోనా వేగంగా వ్యాప్తిచెందడానికి వాహకులుగా మారుతున్నట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అంచనా. పిల్లల్లో రోగనిరోధకశక్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. వీరిలో పాజిటివ్ ఉన్నా లక్షణాలు బయటికి కనిపించవు. అందువల్ల వీరు తరగతులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి వాహకాలవుతున్నారని వైద్యుల అంచనా. అందువల్లనే మార్చి ప్రారంభం నుంచి కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని భావిస్తున్నారు. వాస్తవానికి 2020 సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దగా లేవు. కానీ, పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాలలో పెరుగుతున్నాయి. అక్కడి నుంచి నిత్యం వేలమంది తెలంగాణకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి నుంచీ వైరస్ తెలంగాణలోకి వేగంగా వ్యాపిస్తోందని వైద్యశాఖ భావిస్తోంది. ఇక్కడి విద్యార్థుల్లోనూ కేసుల సంఖ్య మరింత పెరుగుతోండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు మూసివేయడం ఉత్తమమని వైద్యశాఖ భావిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.