• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ ప‌ది ప‌రీక్ష‌లు ర‌ద్దు

12వ త‌ర‌గ‌తి ఎగ్జామ్స్‌ వాయిదా

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న త‌రుణంలో దేశవ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై ఎట్ట‌కేల‌కు ఉత్కంఠ వీడింది. వచ్చే నెలలో జరగాల్సిన వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేర‌కు 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

‣ ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం

కరోనా విజృంభణ దృష్ట్యా వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి పరీక్షలపై చర్చలు జరిపారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పినట్లు రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. అకడమిక్‌ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు పేర్కొన్నారు.

‣ ట్విట‌ర్‌లో మంత్రి ప్ర‌క‌ట‌న‌

‘‘దేశంలో మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 

‣ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ఫ‌లితాలు

సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో విద్యార్థులు, త‌ల్లిదండ్రుల్లో ఫ‌లితాలు ఎలా ప్ర‌క‌టిస్తార‌నే సందేహాలు మొద‌ల‌య్యాయి. అయితే ఇప్ప‌టికే సీబీఎస్ఈ ప‌ది ఫ‌లితాల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్ క్రైటేరియా ఆధారంగా ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. కాగా వాటితో సంతృప్తి చెందని విద్యార్థులు క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. 

‣ ఇవీ నిర్ణయాలు...

12వ తరగతి: మే 4 నుంచి జూన్‌ 14వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. జూన్‌ 1న సీబీఎస్‌ఈ బోర్డు పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేదీ కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తుంది.

10వ తరగతి: మే 4 నుంచి జూన్‌ 14వరకు జరగాల్సిన ఈ పరీక్షలను పూర్తిగా రద్దుచేయాలని నిర్ణయించారు. బోర్డు నిర్ణయించే నిష్పాక్షిక కొలమానాలకు అనుగుణంగా వీటి ఫలితాలను తయారుచేస్తారు. బోర్డు కేటాయించే మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే అలాంటి వారు పరిస్థితులు కుదుటపడిన తర్వాత నిర్వహించే పరీక్షకు హాజరుకావచ్చు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.