* ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ఘనత
ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల.. బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఆన్లైన్లో సెమిస్టర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికే నాలుగో ఏడాది విద్యార్థులకు సంబంధించి పరీక్షల ఫలితాలు విడుదల చేయగా.. మరో వారం, పది రోజుల్లో మిగిలిన సంవత్సరాల ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలో నడిచే ఇంజినీరింగ్ కళాశాల పూర్తిగా ఆన్లైన్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. బీటెక్తోపాటు ఎంటెక్ చదువుతున్న సుమారు 800 మంది విద్యార్థులు ఇంట్లో నుంచే ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు రాశారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఆన్లైన్ పరీక్షలకు ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఆచార్యుడిని పర్యవేక్షకుడిగా నియమించారు. ల్యాప్టాప్ లేదా మొబైల్ కెమెరా సాయంతో విద్యార్థులను గమనించే విధంగా ఏర్పాట్లు చేశారు. పరీక్షకు 5 నిమిషాల ముందు విద్యార్థుల మెయిల్కు ప్రశ్నపత్రం పంపించారు. ప్రశ్నపత్రం చూసి విద్యార్థులు పేపర్లపై సమాధానాలు రాసి మొబైల్ లేదా ట్యాబ్ ద్వారా ఫొటోలు తీసి మెయిల్కు పంపాలి. వాటిని ఆచార్యులు డౌన్లోడ్ చేసుకుని మూల్యాంకనం చేస్తారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించారు. ఇలా బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు రాకుండానే ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి త్వరలో ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
సాంకేతికతను వినియోగించుకున్నాం
కరోనా నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చి రాయాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారు అవస్థ పడకుండా అన్ని రకాల సాంకేతిక వనరులను వినియోగించుకుని పరీక్షలు నిర్వహించాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. 95 శాతం హాజరు వచ్చింది. హాల్టికెట్ సహా అన్ని పద్ధతులను అనుసరించాం.
- ప్రొఫెసర్ ఎం.కుమార్, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.