ఈనాడు, హైదరాబాద్: పీజీ మెడికల్ కోర్సుల ఫీజు పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం తప్పుకొంది. పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను పెంచుతూ ఏప్రిల్ 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 20ను సవాలు చేస్తూ డాక్టర్ ఎస్.పి.సుదీప్శర్మతో పాటు మరో 120 మంది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మే 15న విచారణ సందర్భంగా టీఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ పి.స్వరూప్రెడ్డి కొన్ని ఆరోపణలతో మెమో దాఖలు చేయడంతో దానిపై నిర్ణయం వెలువరిస్తామంటూ వాయిదా వేసింది. మే 18న విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం ఈ మెమో నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేస్తూ అందులోని ఆరోపణలను తోసిపుచ్చింది. దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించడానికి అవకాశం ఉన్నా తాము ఆ నిర్ణయం తీసుకోవడంలేదని పేర్కొంది. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నామని, ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది సామా సందీప్రెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్తో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించగా మే 19న విచారణ చేపట్టడానికి అనుమతించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.