• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ ‘సప్లిమెంటరీ’పై స్ప‌ష్ట‌త క‌ర‌వు

* లక్షలాది విద్యార్థుల ఎదురుచూపులు
* ఇప్పట్లో పరీక్షల నిర్వహణ కష్టమేనంటున్న ఇంటర్‌బోర్డు వర్గాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తప్పినవారు, ఉత్తీర్ణులైనవారు సప్లిమెంటరీ/బెటర్‌మెంట్‌ పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ద్వితీయ ఇంటర్‌లో తప్పినవారినందరినీ ప్రభుత్వం కనీస మార్కులిచ్చి ఉత్తీర్ణులను చేసింది. ప్రథమ ఇంటర్‌లో తప్పినవారికి, పాసైనా మార్కులు పెంచుకునేందుకు బెటర్‌మెంట్‌ రాసేవారి కోసం మాత్రం తర్వాత పరీక్షలు జరుపుతామని ఆనాడు అధికారులు చెప్పుకొచ్చారు. అక్టోబరు ముగుస్తున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేక లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గత మార్చిలో జరిగిన పరీక్షలకు వివిధ కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 27వేల మంది రెండో సంవత్సర విద్యార్థులు హాజరుకాలేదు. ఇపుడు వారంతా సప్లిమెంటరీ నిర్వహించకపోతే విద్యా సంవత్సరం వృథా అవుతుందన్న ఆందోళనలో ఉన్నారు. తమను ఉత్తీర్ణులను చేయాలని, లేకుంటే పరీక్షలు జరపాలని కోరుతూ ఇటీవల కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే గత మార్చి పరీక్షలలో ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థులు 1,92,172 మంది తప్పారు. ఇంటర్‌బోర్డు ఇప్పటికే 2021 మార్చి 24 నుంచి వార్షిక పరీక్షలు జరుపుతామని స్పష్టంచేసింది. అంటే వాటికి కనీసం నెల ముందుగా సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యేలా చూడాలి. దీనిపై ఇంటర్‌బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో డిసెంబరులోపు సప్లిమెంటరీ నిర్వహించే అవకాశమైతే లేదని అభిప్రాయపడ్డారు.
వెయిటేజీ ఉంటే ఎలా?
ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రధాన సబ్జెక్టుల్లోని 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు లెక్కిస్తారు. వెయిటేజీ ఎత్తివేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఇటీవల వెల్లడించినా అది కార్యరూపం దాలుస్తుందా.. అన్నది చూడాలి. వెయిటేజీ ఉన్నందునే ఏటా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దాదాపు లక్షన్నర మంది బెటర్‌మెంట్‌ కోసం పరీక్షలు రాస్తుంటారు. ఒకవేళ వచ్చే ఏడాది కూడా వెయిటేజీ కొనసాగితే బెటర్‌మెంట్‌ నిర్వహించకుండా దాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించే అవకాశం ఉంది. చివరకు న్యాయపరమైన సమస్యలూ రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.