* ఎన్టీఎస్ఈ పరీక్షలో సత్తా చాటండి
* 6వ తేదీతో ముగియనున్నదరఖాస్తు గడువు
అమరావతి ఫీచర్స్, న్యూస్టుడే : ఒకే ఒక పరీక్ష.. ప్రతిభ చాటితే ఆరేళ్ల చదువుకు భరోసానిస్తుంది. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్టీఎస్ఈ) పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమొచ్చింది. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తొమ్మిదో తరగతి పూర్తి చేసి పదో తరగతిలో ఈ ఏడాది చేరిన అన్ని ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉన్న పాఠశాలల విద్యార్థులు అర్హులు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రతిభా పోటీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. రూ.200 రుసుంతో ఆన్లైన్లో దరఖాస్తుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు ఉంది. డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభా పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని 2021 జూన్ 13న దేశ వ్యాప్తంగా నిర్వహించే రెండో దశ పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులోనూ రాణిస్తే పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నెలకు రూ.1,250 చొప్పున నగదు ఉపకార వేతనంగా అందజేస్తారు. డిగ్రీ, పీజీ చదువులకు నెలకు రూ.2 వేలు చొప్పున అందిస్తారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు దూరవిద్యా విధానంలో పదో తరగతి చదవబోతున్నవారు కూడా అర్హులే. దరఖాస్తుదారుడు 18 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ ఏడాది 1.4 లక్షల మంది పదో తరగతి చదవబోతున్నారు. వీరిలో ప్రతిభాన్వేషణ పరీక్ష రాసేందుకు సుమారు లక్ష మంది విద్యార్థులకు అవకాశం ఉంది. www.bseap.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్టీఎస్ఈ పరీక్షలో పాల్గొనేందుకు ఔత్సాహికులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని రెండు జిల్లాల సైన్సు అధికారులు మధుకుమార్, హుస్సేన్ పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.