* ఆన్లైన్లోనే నిర్వహించాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను రేకెత్తించి... వారిని పరిశోధన వైపు మళ్లించే ప్రతిష్ఠాత్మక ఇన్స్పైర్ పోటీలకు ఈసారి విద్యార్థుల సందడి ఉండదు. గత విద్యా సంవత్సరానికి(2019-20) సంబంధించిన పోటీలను ఈసారి ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. విద్యార్థులు పంపిన ఆలోచనలను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) ప్రాథమికంగా గత ఏడాదే ఎంపిక చేసింది. సాధారణంగా ఆ ఆలోచనలపై విద్యార్థులు ఎగ్జిబిట్లు రూపొందించి జిల్లా స్థాయి ప్రదర్శన పోటీల్లో పాల్గొంటారు. కిందటేడాదే పోటీలు జరగాల్సి ఉండగా... విద్యాశాఖ చొరవ తీసుకోక జాప్యం జరిగింది. వాటిని డిసెంబరులో నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో విద్యార్థులు తమ ప్రదర్శనలను అప్లోడ్ చేస్తే వాటిని జడ్జీలు చూసి విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి పోటీలు డిసెంబరు 14-17 తేదీల మధ్య పూర్తి అయ్యేలా చూడాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 3,472 ప్రాజెక్టులు పోటీపడనున్నాయి. అందులో 10 శాతం ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర పోటీలు ఈ నెలాఖరులో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి(2020-21) సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థుల నుంచి 24,061 దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించి ఎన్ఐఎఫ్ ప్రతినిధులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన ఆలోచనలకు ఎగ్జిబిట్లు తయారు చేసేందుకు రూ.10 వేలు అందజేస్తారు. ఈ సంవత్సరం పోటీలను ఎప్పుడు? ఎలా? నిర్వహిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.