* సీట్లను బ్లాక్ చేసేందుకు కొన్ని కళాశాలల వ్యూహం
* కఠిన చర్యలు తప్పవని కాళోజీ వర్సిటీ హెచ్చరిక
ఈనాడు, హైదరాబాద్: వారికి నీట్లో ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్లు పొందారు. మళ్లీ రాష్ట్రంలోని కళాశాలల్లో యాజమాన్య కోటా సీటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. కానీ సీటు వచ్చినా చేరరు. తర్వాత ఆ సీట్లను కళాశాలలు భారీ మొత్తానికి అమ్ముకుంటాయి. కొన్ని వైద్య కళాశాలలు, విద్యార్థులు కలిసి ఈ అక్రమానికి తెరలేపుతున్నారు. ఈ సీట్ల బ్లాక్ దందా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈసారి పెద్దమొత్తంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాశాలల యాజమాన్యాలు కొంత మొత్తాన్ని నీట్ ర్యాంకర్లకు ఇచ్చి వారి ద్వారా సీట్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు. బీ/సీ కోటాలో సీటు పొందిన తర్వాత విద్యార్థులు చేరరు. ఆ తర్వాత ఖాళీ సీట్లను యాజమాన్యాలు స్పాట్ ప్రవేశాల కింద భారీ మొత్తానికి అమ్ముకునేందుకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డిసెంబరు 17న కళాశాలలను హెచ్చరిస్తూ విశ్వవిద్యాలయం నోటీసు జారీ చేసింది. ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విద్యార్థులు యాజమాన్య కోటా కింద చేరే ముందు తాను ఇతర రాష్ట్రాల్లో చేరలేదని, సీట్లను బ్లాక్ చేసే వ్యవహారంలో తాను భాగం కాదని రూ.10 స్టాంప్ పేపర్పై హామీపత్రం అందించాలని నిబంధన విధించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.