ఈనాడు, హైదరాబాద్: సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను ఆరు నెలల్లోగా భర్తీచేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. కొత్తగా చేరిన వారిలో అర్హులకు అంతర్గత కోటా పెంచి అవకాశం కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో మంగళవారం 46వ త్రైపాక్షిక భద్రత సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గనుల్లో ఖాళీగా ఉన్న సాంకేతిక సిబ్బంది, పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది, వైద్యనిపుణులు, సింగరేణి సంఘాలు చేసిన వినతిపై ఆయన స్పందించారు. గత ఐదేళ్లుగా కారుణ్య, నేరుగా చేసే నియామకాల కింద సుమారు 16 వేల పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. భద్రత పరికరాల కొనుగోలుకు ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని హామీ ఇచ్చారు. కొవిడ్ నివారణ చర్యల్లో విశేషంగా కృషి చేసిన వైద్యసిబ్బందిని, సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎస్.బలరామ్లను అభినందించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మైన్స్సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ మలయ్ టీకే దార్ మాట్లాడుతూ భద్రత పెంపునకు గనుల మేనేజర్లు, డీజీఎంఎస్ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత మూడేళ్ల కాలంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సింగరేణి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. సింగరేణిలో ప్రమాదాల నివారణకు సింటార్సు సంస్థ సహకారంతో 822 మందికి శిక్షణ ఇచ్చామని మరో డైరెక్టర్ బలరామ్ చెప్పారు. గనులు, కాలనీల్లో మరింత వెలుతురు కోసం 22 వేల ఎల్ఈడీ దీపాలు అమరుస్తున్నామని డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. డీజీఎంఎస్ అధికారులు కౌశిక్ సర్కార్, టి.శ్రీనివాస్, శాంమిశ్రా తదితరులు గనుల్లో తాము గుర్తించిన లోపాలను వివరిస్తూ కొన్ని పరిష్కారాలను సూచించారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు, కార్యదర్శి రాజిరెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సీతారామయ్య తదితరులు మాట్లాడారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.